మానవ జన్మ పుట్టుక లక్ష్యం ఏమిటి?

P Madhav Kumar
మానవ జన్మ పుట్టుక లక్ష్యం ఏమిటి, జన్మలు అంటే ఏమిటి అందులో మానవ జన్మకు గల కారణం ఏమిటి, మొదట మనం జన్మ అంటే ఏమిటో తెలుసుకుందాం. 
జన్మ అంటే మళ్ళి పుట్టడం అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టడమే జన్మ. కాని తిరిగి మానవ జన్మే వస్తుంది అని మాత్రం చెప్పలేము ఎందుకంటే మరల మనం పొందే జన్మ మనం సంపాదించుకున్న జ్ఞానం మీద మాత్రమే ఆధారపడుతుంది. అన్ని జన్మలలోను మానవజన్మ మాత్రమే ఉత్తమోత్తమమైనది.
మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలను చేస్తూ ఉంటాడు. ఆ కర్మలకు ఫలితాలను తప్పక అనుభవించి తీరాలి,వాటినే కర్మఫలాలు అంటారు.అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి.అన్నీపుణ్య కర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు దేవ లోకాలలో దేవ జన్మ నెత్తుతాడు,అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగ భూమి కనుక అక్కడ అతడికి ఏ కర్మలు చేసే అధికారం లేదు. అందువలన పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మల ఆచరించే అవకాశం లేదు.తన కర్మ ఫలాల ననుసరించి భోగాలను అనుభవించి ఆ కర్మ ఫలాలు అయిపోగానే 'క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి' అన్నట్లు ఈ మర్త్య లోకాన్ని మానవ లోకాన్ని చేరవలసిందే.
 మరల మరల మానవ జన్మనో, జంతు జన్మనో ఎత్తవలసిందే. ఈ దేవ జన్మలో కేవలం మనోబుద్దులుంటాయే కానీ కర్మచేయుటకు సాధనమైన స్థూల శరీరం ఉండదు. కనుక భాగవత్సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మకాదు. ఈ దేవ జన్మ ఇక అన్నీ పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు మొదలైన జంతువులుగా జన్మిస్తాడు.ఆ జన్మలలో ఆ కర్మ ఫలాల కారణంగా అనేక బాధలు,దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడుతాడు.
ఈ జన్మలలో కర్మలు చేస్తున్న అవి అన్నియు బుద్ది పరంగా కాదు అవి అన్నియు కేవలం ప్రకృతి ప్రేరణలతో పర తంత్రంగా చేస్తాయి. ఈ జంతు జన్మలలో శరీరం - మనస్సు ఉన్నాయి గాని, బుద్ధి మాత్రం లేదు.కనుక ఈ జన్మలలో కూడా కేవలం కర్మఫలాలు అనుభవించడమే కానీ పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు..
కనుక భాగవత్సాక్షాత్కారానికి ఈ జంతు జన్మ కూడ ఉపయోగపడదు. ఇక పుణ్యపాప కర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది. ఈ మానవ జన్మలో పుణ్య కర్మల ఫలంగా సుఖాలు మరియు పాప కర్మల ఫలంగా దుఃఖ్ఖాలు అనుభవిస్తాడు.
అయితే ఇలా కర్మ ఫలాలనుభవించటం మాత్రమేగాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మనవజన్మలోనే ఉంది.ఎందుకుంటే స్వతంత్రంగా బుద్ధి అనే సాధనం ఉన్న జన్మ ఇది. కనుక పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారం, జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మ ఉత్తమోత్తమమైనది అని అన్నారు. 
ఈ మానవజన్మ తీసుకోవడానికి జీవుడు 84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తరువాత లభించే అపురూప జన్మ ఈ మనవ జన్మ. 
కనుకనే ఈ మానవ జన్మను 'జంతూనాం నర జన్మ దుర్లభం' పెద్దలు తెలియజేసారు.
ఇలాంటి ఈ అపురూపమైన, ఉత్తమోత్తమమైన మరియు దుర్లభమైన మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్ధకం చేసుకోవాలి.
వేరే జన్మలు అయితే ఏవో ఒకటి వస్తూనే ఉన్నాయి కాని ఎందుకు మనం ఈ విధంగా మళ్ళీ మళ్ళీ పుట్టవలసి వస్తుంది. పుట్టిన మన జన్మ లక్ష్యం ఏమిటి, జంతు జన్మలు పొందిన వాటి లక్ష్యం అయితే ఒకటే, అవి మానవ జన్మ పొందడానికి కర్మలను ఆచరిస్తువుంటాయి. మరి మనిషిగా పుట్టిన మనం ఏమి చేస్తున్నాం, మన లక్ష్యం ఏమిటి అన్నది, అంటే మనవ జన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్ధకం చేసుకోవాలి. సార్ధకం చేసుకోవడం అంటే ఏమిటి అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాలి.
సార్ధకం చేసుకోవడం అంటే ఏమిటి, సాధారణంగా మనం అంతా ( మనుషులందరూ ) బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి లేదా పెద్ద పెద్ద పదవులు చేపట్టాలి. బాగా సంపాదించి భార్యబిడ్డలతో సహా తను అనేక భోగాలు అనుభవించాలి.అయితే ఇక్కడ ఎవ్వరు తాము కోరుకున్నట్లుగా జీవించలేకపోతున్నారు. 
ఎన్ని సుఖాలు, భోగాలు అనుభవించిన ఈ మనస్సుకు ఎదో ఒక వెలితి వుంటుంది. దీనికి కారణం మనం అనుభవించేవి ఏవి కూడ నిత్యమైన, పరిపూర్ణమైన సుఖాలు కాదు.
ఇవి అన్నియు అనిత్యమైన వస్తువుల ద్వారా వచ్చే సుఖాలు. నిత్యమైన, పరిపూర్ణమైన, శాశ్వతమైన సుఖం కావాలంటే నిత్య వస్తువు, పరిపూర్ణ వస్తువు, శాశ్వత వస్తువు ద్వారానే లభిస్తుంది. ఏమిటది? 
 నిత్యమైన వస్తువు ఏకమైన "పరమాత్మ" మాత్రమే. 'నిత్య వస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం' అని తత్వబోధ లో శంకరాచార్యులవారు స్పష్టం చేసారు. 
అంటే నిత్య వస్తువు ఏకమైన పరమాత్మ మాత్రమే. దానికి వేరుగా ఉన్న సర్వమూ అనిత్యమైనవే అని అర్థం.
కనుక నిత్యమైన పరమాత్మతో ఐక్యత వలన లభించే సుఖం - ఆనందం అందుకునేవరకు మానవుడికి తృప్తిలేదు.
అసంతృప్తి తీరదు. అట్టి శాశ్వాతానందాన్ని అందుకోవడమే జన్మను సార్ధకం చేసుకోవడమంటే. ఆ శాశ్వతానందాన్నే మోక్షం, ముక్తి అన్నారు.
ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి భగవంతునిలో ఐక్యం (పరమాత్మునిలో విలీనం అయేదే మోక్షం) కావాలంటే ఇక్కడ చేసిన అన్ని కర్మలని సంపూర్ణంగా నిర్మూలించుకొని అంటే ఆత్మ స్వరూపుడవైన నీవు వీటి అన్నిటినుండి విముక్తిని పొందాలి. 
ఈ విధంగా విముక్తిని పొందడమే ముక్తి అని కూడ అంటారు. దానికి సరియైన జన్మ ఈ ఒక్క మానవ జన్మ మాత్రమే ఇది యే జన్మలలోనూ సాధ్యం కాదు.
జంతు జన్మలలో అయితే మనస్సు మాత్రమే ఉంటుంది కాని వాటికీ బుద్ధి ఉండదు. అందువలన మనం అజ్ఞానంతో, అవివేకంతో మరియు అవిద్యతో ఏర్పరచుకున్న ఈ కర్మ బంధనాల నుండి విముక్తి పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఈ మానవ జన్మే. 
ఈ మానవ జన్మలో మనిషికి దేవుడు ఒక ఆయుధాన్ని ప్రసాదించాడు అదియే బుద్ధి. దీని ద్వార శాశ్వతమైన, నిత్యమైన, సత్యమైన, నాశనం లేనిది ఏది అని గ్రహించి అదే విధంగా జ్ఞానాన్ని గ్రహించి అంటే నేను ఎవరు, ఎందుకు పుట్టాను, ఎవరికోసం రావలసి వచ్చింది, నా లక్ష్యం ఏమిటి, నా కర్థవ్యం ఏమిటి, అని తెలుసుకొని మనస్సును అదుపులో పెట్టుకొని పరమాత్మా తత్వాన్ని నిత్య సత్యమైన దానిని సంపుర్ణముగా తెలుసుకొని అదే విధంగా ఆత్మానాత్మ వివేకాన్ని గ్రహించడమే జ్ఞానం* అని అంటారు.
ఎప్పుడైతే నీలో ఈ ధ్యాస అంటే దేవుని గురించి తెలుసుకోవాలని నీలో తపన మొదలవుతుందో అప్పుడు ఆ దేవుడే నీకు ఖచ్చితంగా మార్గాన్ని లేకపోతే ఒక మంచి సద్గురువును ప్రసాదిస్తాడు.ఇక్కడ సద్గురువును ప్రసాదిస్తాడు అంటే దేవుడు తెచ్చి నీ ముందర సద్గురువును పెట్టడు. నువ్వు ప్రయత్నించు దానికి భగవంతుడు సహకారం అందిస్తాడు అని భావం. అంటే మనం అజ్ఞానంలో ఉంటూ కర్మలను ఆచరిస్తూ అన్నియు దుష్కర్మలే చేస్తే నూటికి నూరు శాతం మనం మానవ జన్మ పొందడం మాత్రం సాధ్యం కాదు.
అన్ని చెడ్డ పనులే చేస్తే వాటి ఫలితాలను నీవు అజ్ఞానంతో ఏర్పరచున్న కర్మ బంధనములు ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి ఆ కర్మ ఫలితాన్ని నరకంలో అనుభవించి మళ్ళీ ఇక్కడ ఈ కర్మ భూమిలో నీ జ్ఞాన సముపార్జన ఆధారంగా నీకు ఎదో ఒక జన్మ వస్తుంది.
 మరి సత్కర్మలు ఆచరిస్తే మానవ జన్మ ఎత్తవచ్చా అంటే ఎక్కువ శాతం మానవ జన్మ ఎత్తే అవకాశాలు ఉంటుంది.
కానీ సత్కర్మలు చేస్తే వాటి ఫలితాలను నీవు అజ్ఞానంతో ఏర్పరచున్న కర్మ బంధనములు ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి ఆ కర్మ ఫలితాన్ని స్వర్గంలో అనుభవించి మళ్ళీ ఇక్కడ ఈ కర్మ భూమిలో నీ జ్ఞాన సముపార్జన ఆధారంగా నీకు జన్మ వస్తుంది. నీవు సత్కర్మలు ఆచరించి ఎంతో కొంత దేవుని గురించి తెలుసుకొని ఉంటే నీవు మంచి యోగుల కుటుంబంలో జన్మిస్తావు.
భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ధ్యాన యోగంలో చెప్తాడు. అర్జునా! ఎవరు అయితే నా జ్ఞానాన్ని గ్రహించి యోగాన్ని (కర్మ,జ్ఞాన మరియు ధ్యాన) పద్ధతిని అవలంభించి ఉంటారో వారికి ఇంకా ఏదైనా కర్మలు చేయాల్సిన విషయం ఉంటే వారికి ఖచ్చితంగా ఒక మంచి జన్మ అది ఉన్నతమైన ఆధ్యాత్మీక కుటుంబంలో జన్మ వస్తుంది. ఇందులో ఏ మాత్రం సందేహం ఉండదు అని శ్రీ కృష్ణుడు అర్జునకు వివరిస్తాడు.
అందుకే మనం ఈ మానవ జన్మ పొందినపుడు జీవన, జీవిత సత్యాన్ని గ్రహించి సత్సాంగత్యం చేస్తూ, సత్కార్య జీవనం సాగించాలి.
మానవ సేవే మాధవ సేవగా భావించి అందరిలో దైవాన్ని చూస్తూ నీలో ఉన్న దైవాన్ని నీ పనులలో, ప్రవర్తనలో చూప గలిగిననాడు, దేనికి ప్రలోభ పడక జీవిస్తే తప్పక మోక్షాన్ని పొందుదురు...



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat