కవచకుండలాలు - KavachaKundalalu

P Madhav Kumar
కర్ణుడు కుంతీదేవికి పుట్టలేదు. ఆమె నవమాసాలు మోసి 'కర్ణుని', కనలేదు పసిబిడ్డగా సూర్యుని ద్వారా కుంతీదేవికి లభించాడు. కన్యగా ఉన్న కుంతికి దూర్వాసమహర్షి సంతాన సాఫల్య మంత్రం ప్రసాదించాడు. ఆ మంత్రంతో ఏ దేవతను ఆవాహన చేస్తే, ఆ దేవత వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్లిపోతారు తప్ప మరే వరాలు అనుగ్రహించరు.
   పూర్వం ఒక రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి అభేద్యమైన వెయ్యి కవచాలు వరంగా పొందాడు. నాటి నుంచి అతనికి 'సహస్రకవచుడు' అనే పేరు వచ్చింది. ఆ వరగర్వంతో సర్వలోకాలనూ హింసిస్తూ ఆనందించేవాడు. రాక్షసుని బాధలు పడలేక సకల ప్రాణికోటి విష్ణువును శరణు కోరారు. అప్పుడు ఆయన 'భయపడకండి.. నేను నర, నారాయణ రూపాలలో బదరికావనంలో ఉంటాను. సహస్రకవచునికి అంత్యకాలం సమీపించినప్పుడు అతనే నా దగ్గరకు వస్తాడు. నేనే వాడిని సంహరిస్తాను' అని వారికి ధైర్యం చెప్పి పంపాడు. హిరణ్యకశిపుని వధించిన తర్వాత నరసింహస్వామి రెండురూపాలుగా విడిపోయాడు. నర రూపం నరుని'గానూ, 'సింహ' రూపం 'నారాయణుని'గా 'ధర్ముని' కుమారులుగా జన్మించారు. వారే నర నారాయణులు. వారిరువురూ వుట్టుకతోనే పరాక్రమవంతులు, విరాగులు. ఆయుధధారులై బదరికావనంలో ఏకాగ్రచిత్తంతో తపస్సు చేయడం ప్రారంభించారు. ఏ ఆటంకం లేకుండా వారి తపస్సు కొనసాగుతోంది.
    ఒకసారి ప్రహ్లాదుడు ఆ దిశగా వెళుతూ నర నారాయణుల పక్కన ఆయుధాలు గమనించి, తపస్విలకు ఆయుధాలతో పనేమిటి? వీరెవరో కపటులై ఉంటారని భావించాడు. వారికి తపోభంగం చేసి, యుద్దానికి ఆహ్వానించాడు. వారి మధ్య భీకరయుద్ధం జరిగింది. ఎంతకాలమైనా ప్రహ్లాదుడు వారిని జయించలేకపోయాడు. ఆశ్చర్యంతో ఆయన విష్ణువును ధ్యానించాడు. శ్రీహరి ప్రత్యక్షమై ప్రహ్లాదా! నరనారాయణులు నా అంశతో జన్మించారు. వారిని నీవు గెలవలేవు' అని చెప్పాడు. ప్రహ్లాదుడు తప్పు తెలుసుకుని తపస్విలను క్షమించమని వేడుకున్నాడు. అక్కడ నుంచి వెళ్లిపోయాడు. నరనారాయణులు తపస్సు కొనసాగించారు. 
    అందుకు ఇంద్రుడు భయపడి, వారికి తపోభంగం చేసేందుకు అప్పరసలను పంపాడు. తమ రూప, వయో, నృత్య, గానాలతో నరనారాయణుల తపస్సుకు భంగం కలిగించాలని అపృపరనలు ఎంతో ప్రయత్నించారు. కానీ, ఫలితం శూన్యం. అప్పుడు నారాయణుడు వారిని దగ్గరకు పిలిచి, 'మీ అందాలు మమ్ములను ఆకర్షించలేవు. ఇంద్రపదవి ఆశించి మేం ఈ తపస్సు చేయడంలేదు. మా మాటగా మహేంద్రునకు తెలియజెప్పండి' అని తన తొడమీద చేత్తో చరుచుకున్నాడు. ఆ శబ్దం నుంచి ఓ అసాధారణ, అద్భుత సౌందర్యరాశి జన్మించింది. తన ఊరువుల (తొడల) నుంచి పుట్టిన ఆ సుందరికి 'ఊర్వశి' అని పేరు పెట్టాడు. ఆమెను ఆ అప్సరసలకు ఇస్తూ, 'ఈమెను మా బహుమతిగా ఇంద్రునికి ఇవ్వండి' అని చెప్పి వారిని పంపాడు. 
    మహేంద్రుడు తన తప్పు తెలుసుకుని నరనారాయణులను క్షమించమని వేడుకున్నాడు. ఆ సమయంలో వరగర్వాంధుడైన 'సహస్రకవచుడు' వారిని యుద్దానికి ఆహ్వానించాడు.
నారాయణుడు అతనితో రాక్షసేశ్వరా! నీ సమరోత్సాహం మాకు ఆనందం కలిగించింది. కానీ, మేమిద్దరం కలిసి నీ ఒక్కనితో యుద్ధం చెయ్యడం ధర్మం కాదు. కనుక, మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తూంటే.. మరొకరు తపస్సు చేసుకుంటాడు. అతని తపస్సుకు ఎలాంటి అంతరాయం కలుగకూడదు. ఇందుకు నీకు సమ్మతమైతే యుద్ధం చేస్తాను' అన్నాడు. సహస్రకవచుడు ఈ ఒప్పందానికి సమ్మతించాడు.
   నరుడు తపస్సు చేస్తున్నాడు. నారాయణుడు యుద్ధానికి దిగాడు. యుద్ధం భీకరంగా సాగుతోంది. అలా వేయి ఏండ్లు గడిచిన తర్వాత నారాయణుడు సహస్రకవచుని వేయి కవచాలలో ఒక కవచాన్ని ఖేదించగలిగాడు..అప్పటికి అలసిన నారాయణుడు తపస్సుకు ఉపక్రమించాడు. నరుడు సహస్రకవచునితో యుద్దానికి దిగాడు. మరో వేయి సంవత్సరాలు గడిచిన అనంతరం నరుడు సహస్రకవచుని మరో కవచాన్ని భేదించాడు.
    ఇలా నరనారాయణులిరువురూ కలిసి సహస్రకవచుని తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు భేదించారు. ఇక అతనికి ఒకే ఒక కవచం ఉంది. దీనితో సహస్రకవచునికి భయం కలిగింది. యుద్ధరంగం వదిలి, సూర్యుని వద్దకు వెళ్లి అభయం ఇమ్మని వేడుకున్నాడు. అందుకు సూర్యుడు 'కలకాలం నేను నీకు 'అభయం ఇవ్వలేను. నరనారాయణులు అవతారం చాలించిన తర్వాత నిన్ను నా నుంచి విడుదల చేస్తాను. అంతవరకు నా రక్షణలోనే ఉండిపోమ్మని పలికాడు. అందుకు సహస్రకవచుడు సమ్మతించి సూర్యుని దగ్గర ఉన్నాడు. 
    కుంతి మంత్రబలానికి వచ్చిన సూర్యుడు, ఆ సహస్రకవచుడినే పసిబిడ్డగా మార్చి, కుంతి చేతికి అందించాడు. అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడు. కర్ణుని సంహరించడానికే నర నారాయణులిరువురూ కృష్ణార్జునులుగా జన్మించి కురుక్షేత్ర రణభూమిలో కర్ణుని సంహరించినట్లు మహాభారత గాథ ద్వారా తెలుస్తుంది.

__జాగృతి - డిఆర్ఎస్ నరేంద్ర 

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat