భగవద్గీత లో చెప్పిన స్థితప్రజ్ఞత అంటే ఏమిటి?*

P Madhav Kumar

 *ప్రారబ్ధకర్మ..!!* 

🌸ప్రారబ్ద కర్మ ఎలా ఉంటుందో పురాణాల లోనే కాకుండా నిత్యజీవితంలో కూడా మనం అనుభవిస్తూ ఉంటాం.


🌸రాముడు దండకారణ్యం లో 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి కారణం ఒక మహాపతివ్రత శాపం.


🌸దేవాసుర సంగ్రామం సమయంలో మృతసంజీవనీ మంత్ర బలంతో చావు లేకుండా ఇంకా దౌర్జన్యాలు చేస్తున్న రాక్షసులను తుదముట్టించడానికి మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. 


🌸అప్పుడు తనను శరణు వేడిన రాక్షసులను తన ఆశ్రమంలో దాచి వారిని చంపకుండా తాను గుమ్మం ముందు నిలుస్తుంది ఆ ఋషి పత్ని. మహావిష్ణువు విధి లేక ఆమెను కూడా రాక్షస సంహారంలో భాగంగా తన సుదర్శన చక్రంతో హతమారుస్తాడు. ఇది తెలిసి అక్కడికి వచ్చిన ఆమె భర్త మహా తపోధనుడు హతురాలై పడి ఉన్న భార్య శవాన్ని చూసి విలపిస్తూ శపిస్తాడు. 


🌸ఆ సాధ్వీమని భర్త తన భార్యను హతమార్చి తమకు వియోగం కల్పించినందుకు అతడు కూడా భార్యావియోగముతో బాధపడాలని శపించాడు. అందుకే రాముని వనవాసానికి కైక లేదా మందర లేదా దశరథుడు కారణం కాదనీ వారు నిమిత్త మాత్రులని తెలుస్తోంది అంటే రాముడు కూడా కర్మానుభవం అనుభవించి తీరాల్సిందే. అలాగే రామునికి పట్టాభిషేకం నిర్ణయించి రాత్రికి రాత్రి అనుకోని విపరీత పరిణామాలు చోటు చేసుకున్న సందర్భమున తీరా కైకమ్మ వరాల విషయంగా వనవాసం చేయడానికి వెళ్తున్న రాముడిని చూసి లక్ష్మణుడు ఆగ్రహంతో ఊగిపోయాడు.


🌸ఈ ముసలి తండ్రిని చంపి రాముడి పట్టాభిషేకానికి అడ్డుగా వచ్చిన వారు ఎవరైనా సరే వారిని నరికేస్తానని అంటాడు. అప్పుడు రాముడు తమ్మునితో నాయనా నిన్నటి రోజున నాకు పట్టాభిషేకం నిర్ణయించిన తండ్రిగారు నేనంటే అపరిమిత ప్రేమ కలిగిన తండ్రిగారు, ఇప్పుడు మౌనంగా ఉండటం, అది ఆయన తప్పు కాదు. అతి బలీయం విధివిధానం. అది ఎంత బలవత్తరంగా ఉంటుందో తెలుసుకో, పైగా నాకు వనవాస యోగం ఉందని ప్రాజ్ఞులు చెప్పారు.


🌸ఈ ప్రారబ్దకర్మను తప్పించడం ఎవరి తరమూ కాదు అందుచేత కోపాన్ని తగ్గించుకొని నేను తండ్రి గారి ఆజ్ఞను పాలించెందుకు నీవు నాకు సహకరించు లక్ష్మణా అంటాడు. 


🌸భగవద్గీత లో చెప్పిన స్థితప్రజ్ఞత అంటే ఇదే కష్టాల్లో కృంగిపోవడం, సుఖాల్లో పొంగిపోవడం కాకుండా వాటిని దైవానుగ్రహంగా భావించడం. తన కర్మానుభవంగా గుర్తించడం భావ్యం అని రాముడి నడవడి ద్వారా మనం గ్రహించాలి. 


🌸భగవద్గీత లోని 18వ అధ్యాయం 61వ శ్లోకంలో ప్రతీ జీవునిలో అంతర్యామిగా ఉంటూ జీవుడి కర్మలకు అనుగుణంగా బుద్దిని ప్రేరేపిస్తూ ఉంటాను అని గీతాచార్యుడు శ్రీకృష్ణభగవానుడు చెప్పినట్టుగా సీతారాముల కష్టాలకు కారణం వారి పూర్వజన్మల కర్మలే కాని మరెవరో కారకులు కాదు. వారే కాదు భూమిపై జన్మించిన ఏ ప్రాణీ కూడా కర్మలకు అతీతుడు కాడు దానికి ఎవరినో బాధ్యులు చేయకూడదు. మనం కర్మలు చేయవలసిందే ఆ కర్మల ఫలితం సుఖమైనా కష్టమైనా ఇష్టమున్నా లేకున్నా రాముడైనా కృష్ణుడైనా అనుభవించ వలసినదే. 


🌸వాలిని చెట్టు చాటున దాక్కుని ఒక్క బాణం వేటుకు హతమార్చిన రామునికి కృష్ణ నిర్యాణం కోసం అదే బాణం దెబ్బతో ఒక వేటగాడి చేతిలో చేసిన కర్మ ఫలితం తాను అనుభవించాల్సి వస్తుంది అలా కృష్ణావతారం సుసంపన్నం అయ్యింది.


🌸మరో దృష్టాంతము. ద్రౌపది వస్త్రాహరణం చేసిన దుష్ట చతుష్టయంతో బాటు తమ కళ్ళ ముందు ఒక అబలపై అత్యాచారాన్ని ఆపకుండా చూస్తూ ఉండిపోయిన మహానుభావులు భీష్మ ద్రోణకృపాచార్యులు కూడా జరిగిన పాపాన్ని పంచుకోక తప్పలేదు. 


🌸భారత మహారంగంలో మిడతల వలె మాడి పోయారు. అలా అన్యాయం చేస్తున్నవారితో బాటు సమర్థత ఉండి జరగకుండా అడ్డుకునే శక్తి ఉండి కూడా అన్యాయం చూస్తూ ఉన్నవారు కూడా అంతే పాపాత్ములు. శిక్షకు పాత్రులు అవుతున్నారు. ఎంతటి ప్రజ్ఞాశాలి అయినా కూడా ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాలి కదా. అందుకే రామాయణ భారత భాగవతాలు సారం సత్కర్మలు చేస్తే సత్ఫలితాలు వస్తాయి అని అంటారు. 


🌸సద్భావన అనేది భగవంతుడు సర్వాంతర్యామి అని గ్రహించినప్పుడే కదా, అందుకే దేవుడు మనిషికి అనుగ్రహించిన రెండు వరాలు ఒకటి జ్ఞానం రెండు మాట్లాడే ప్రతిభ. వీటిని తమ తమ జీవితాల్లో సత్ ప్రవర్తన సత్ చింతనతో సద్వినియోగం చేసుకోవాలి. ఉత్కృష్టమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. 


🌸ఇదే పరమాత్మ ఆంతర్యం కూడా పరపీడనం పాపాన్ని తాపాన్ని కలిగిస్తుంది. ఏ చరిత్ర వినినా ఏ జీవితం చూసినా అహింసా పరమో ధర్మః అనగా నవ్వులాటకైనా ఇతరులను ఏ ప్రాణిని హింసించరాదు, బాధ పెట్టరాదు.


🌸ఎందుకంటే ఆ శరీరంలో ఉన్నది కూడా పరమాత్ముడే అతడు అంతర్యామిగా అంతటా ఉంటూ అన్నీ గమనిస్తూ మనలోనే ఉంటూ మన పాపపుణ్యాల కర్మలను లెక్కలు వేస్తూ ఉన్నాడన్న సత్యం మరవకూడదు.


🌸నీ ఆనందాన్ని ఇతరుల ఆనందంలో వెదకాలి, అంటే తోటివారు తృప్తిగా సంతోషంగా ఉండడానికి నీ వంతు కృషి మనసా వాచా కర్మణా సహాయం చేస్తూ ఉండాలి. ఇదే మానవ ధర్మం. సృష్టి రహస్యం కూడా ఇదే.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat