Karthika Puranam | కార్తీక పురాణం - 15వ అధ్యాయము | 🌷దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందు
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

Karthika Puranam | కార్తీక పురాణం - 15వ అధ్యాయము | 🌷దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందు

P Madhav Kumar

🍃🌷దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుట:


అంతట జనకమహారాజుతో వశిష్ఠమహాముని, జనకా! కార్తీకమహాత్మ్యము గురించి యెంత వివరించిననూ పూర్తికానేరదు. కాని, మరియొక యితిహాసము తెలియ చెప్పెదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను...

ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవులవద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట, లేక, వినుట, సాయంత్రము దేవతాదర్శనము చేయలేనివారు కాలసూత్రమనెడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీకశుద్ద ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు యిచ్చిన యెడల, విశేషఫలము పొందగలరు. ఈ విధముగా నెలరోజులు విదువక చేసిన యెడల అట్టివారు దేవదుందుభులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు.

ఇలా నెల రోజులు పూజాదికాలు నిర్వర్తించలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్ధశి, పౌర్ణిమ రోజుల్లో నిష్టతో పూజ చేసి, ఆవు నేతితో దీపం వెలిగించాలి. ఆవు పాలు పితికినంత సేపు అయినా దీపం వెలిగించిన వారికి తదుపరి బ్రాహ్మణ జన్మ ప్రాప్తిస్తుంది. ఇతరులు పెట్టిన దీపం నందు నూనె వేసినా, అవసాన దశలో ఉన్న దీపం యొక్క వత్తిని పైకి జరిపి దీపాన్ని వృద్ధి చేసినా, కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించినా, వారి సమస్త పాపాలు హరిస్తాయి. దీనికి సంబంధించి ఒక కథ చెబుతాను వినుము” అని ఇలా చెప్పసాగెను...

సరస్వతి నదీ తీరంలో శిథిలమైన దేవాలయము ఒకటి ఉండేది. కర్మనిష్టుడైన దయార్థ్ర హృదయుడైన ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి, కార్తీకమాసము అంతయూ అక్కడే గడిపి, పురాణ పఠనం చేయాలని తలంచాడు. ఆ పాడుబడ్డ దేవాలయాన్ని శుభ్రంగా ఊడ్చి, నీళ్లతో కడిగి, బొట్టు పెట్టి, పక్క గ్రామాలకు వెళ్లి, ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులు చేసి, పన్నెండు దీపాలు పెట్టాడు. స్వామిని పూజిస్తూ, నిష్టతో పురాణాన్ని చదువుతుండెను. ఈ విధంగా కార్తీకమాసం ఆరంభం నుంచి చేయసాగాడు.

ఒక రోజున ఓ ఎలుక ఆ దేవాలయంలోకి ప్రవేశించింది. నాలుగు మూలలు వెతికి, తినడానికి ఏమి దొరుకుతుందా? అని అక్కడ ఆరిపోయిన వత్తిని తినాలని నిర్ణయించుకుంది. అలా ఆ దీపం వత్తిని నోట కరుచుకుని తీసుకెళ్తుండగా, పక్కనే వెలుగుతున్న దీపానికి తగిలి, ఎలుక నోట్లో ఉన్న వత్తి కొసకు నిప్పు అంటుకుంది. అలా ఆరిపోయిన వత్తి వెలుగుతూ వచ్చింది. అది కార్తీకమాసం కావడం, శివాలయంలో ఆరిపోయిన వత్తిని ఎలుక వెలగించడం వల్ల దాని పాపాలు హరించుకుపోయి, పుణ్యం కలిగింది. వెంటనే దానికి మానవ రూపం సిద్ధించింది.

ధ్యాన నిష్ఠలో ఉన్న యోగి పుంగవుడు కళ్లు తెరిచి చూడగా పక్కనే ఒక మానవుడు నిలబడి ఉండడం గమనించాడు. “ఓయీ! నీవు ఎవరవు? ఎందుకు ఇలా నిలబడ్డావు?” అని ప్రశ్నించగా, అతను వినమ్రంగా “అయ్యా! నేను ఒక ఎలుకను. రాత్రి నేను తిండికోసం వెతుకుతుండగా ఈ ఆలయంలోకి వచ్చాను. ఇక్కడేమీ దొరక్కపోవడంతో నెయ్యి వాసనలతో ఉన్న ఆరిపోయిన వత్తిని తినాలని దాన్ని నోటకరిచి తీసుకువెళ్లసాగాను. పక్కనే ఉన్న దీపానికి తగిలింది. ఆ వత్తి వెలగడం వల్ల నా పాపాలు హరించుకుపోయాయనకుంటాను. అందుకే వెంటనే పూర్వజన్మమెత్తాను. కానీ… ఓ మహానుభావా! నేను ఎందుకీ మూషిక జన్మనెత్తానో, దానికి కారణమేమో తెలియదు. మీరు యోగి పుంగవుల్లా ఉన్నారు. దయచేసి, నాకు విశదీకరించండి” అని కోరాడు.

అంతట ఆ యోగి ఆశ్చర్యంతో తన దివ్యదృష్టిచే సర్వం తెలుసుకుని ఇలా చెబుతున్నాడు… ‘ఓయీ! నీవు కిందటి జన్మలో బ్రాహ్మణుడవు. నీ పేరు బహ్లికుడు. నీవు జైన మతానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేస్తూ, ధనాశాపరుడవై వైదేవ పూజలు, నిత్య కర్మలను మరచావు. నీచుల సహవాసం చేశావు. నిషిద్ధాన్నం తిన్నావు. మంచివారు, యోగ్యులను నిందించావు. పరుల చెంత స్వార్థ చింతన కలిగి ఉండడమే కాకుండా, ఆడపిల్లలను అమ్మే వృత్తిని చేపట్టి, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టావు. సమస్త తిను బండారాలను చౌకగా కొని వాటిని ఎక్కువ ధరలకు అమ్మినావు. అలా అమ్మిన ధనాన్ని నీవు అనుభవించక, ఇతరులకు ఇవ్వక భూస్థాపితం చేసి, పిసినారివై జీవించావు. మరణించిన తర్వాత ఎలుకగా జన్మనెత్తి, వెనకటి జన్మ పాపాలను అనుభవించావు. భగవంతుడి దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించి నందున పుణ్యాత్ముడవయ్యావు. దానివల్లే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కాబట్టి, నీవు నీగ్రామానికి వెళ్లి, నీ పెరట్లో పాతిన ధనాన్ని తవ్వితీసి, దాంతో దానధర్మాలు చేసి, భగవంతుడిని ప్రార్థిస్తూ మోక్షం పొందుము” అని నీతులు చెప్పి పంపాడు.

“చూశావా జనక మహారాజా! జీర్ణమైన ఓ వత్తిని తిరిగి వెలిగించినంత మాత్రాన ఒక మూషికం ఎంతటి ఫలితాన్ని పొందిందో? ఇలా కార్తీకమాసంలో దీపం వెలిగించడం వల్ల, కనీసం కొండెక్కేందుకు సిద్ధంగా ఉన్న దీపంలో నూనె వేసి వృద్ధి చేసినా, జీర్ణమైన దీపాన్ని వెలిగించినా ఎలాంటి ఫలితాలు కలుగుతాయనడానికి ఈ వృత్తాంతం ఉదాహరణ” అని వివరించాడు.

🌷ఇతి శ్రీ స్కాంధపురాణాంతర్గత, వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య: పంచ దశాధ్యాయ సమాప్త: - పదహైదవ రోజు పారాయణం సమాప్తం.

ఓం నమో నారాయణాయ... ఓం నమః శివాయ...🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow