1. కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ!
కరమూలే తు గోవిందః ప్రభాతే కరదర్శనమ్ !!
భావము : అరచేతి అగ్రభాగమునందు లక్ష్మీదేవి, మధ్యభాగమునందు సరస్వతీదేవి, అరచేతి మూలమునందు విష్ణువు నివసిస్తుంటారు. కాబట్టి ప్రభాత సమయమున నిద్రలేచిన వెంటనే అరచేతిని చూసుకొని కళ్లకు అద్దుకొనవలెను.
2. సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే!
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే||
భావము : సముద్రమును వస్త్రముగా ధారణచేసి, పర్వతములను స్తనములుగా కలిగియున్న విష్ణుపత్నియైన ఓ భూదేవీ! నీకు నమస్కారము. నీపై పాదములను మోపుతున్నందుకు నన్ను క్షమించు తల్లీ. (భూమాతకు నమస్కరించి మన దైనందిన జీవితమును ప్రారంభించుకొనవలెను).
3. బ్రహ్మా మురారిస్త్రిపురాన్తకారి భానుశ్శశీ భూమిసుతో బుధశ్చ!
గురుశ్చ శుక్రశ్శనిరాహుకేతవః కుర్వన్తు సర్వే మమ సుప్రభాతమ్ ||
భావము : బ్రహ్మదేవుడు, మురారి అనగా విష్ణువు, త్రిపురులను అంతం చేసిన శివుడు, సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు, కేతువులనే నవగ్రహములు. వీరందరు నా యీ ప్రభాత సమయమును మంగళ దాయకమొనరింతురు గాక!
4. సనత్ కుమారః సనకః సనందనః సనాతనోప్యాసురి పింగలౌచ|
సప్తస్వరాః సప్తరసాతలాని కుర్వన్తు సర్వే మమ సుప్రభాతమ్ ||
భావము : సనత్కుమారుడు, సనకుడు, సనందనుడు, సనాతనుడు అను ఈ నలుగురు బ్రహ్మమానస పుత్రులు విష్ణుమూర్తి అంశతో జన్మించారు. కపిలమన్న శిష్యుడైన ఆసురి, ఛందశ్శాస్త్ర నిర్మాతయైన పింగళుడనే ఋషి, స.రి.గ.మ.ప.ద.ని అనే సంగీత శాస్త్ర సప్తస్వరములు, అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళములనే సప్త అధోలోకములు, నాకు మంగళ ప్రదమొనరింతురు గాక !
5. సప్తార్ణవాఃసప్తకులాచలాశ్చ సప్తర్షయో ద్వీపవనాని సప్త |
భూరాదికృత్వా భువనాని సప్త కుర్వన్తు సర్వే మమ సుప్రభాతమ్ ॥
భావము : సప్త సముద్రములు, సప్తకులు పర్వతములు, సప్తర్షులు, సప్త ద్వీపములు, భూః, భువః స్వః, మహః, జనః, తపః, సత్యః అనే సప్త భువనాలు ఈ ప్రభాత సమయాన్ని నాకు మంగళప్రదమొనరింతురుగాక!
6. పృథ్వీ సగనా సరసాస్త... థాపః స్పర్శీ చ వాయుర్జ్వలనం చ తేజః ।
నభస్సశబ్దం మహతా సహైవ కుర్వన్తు సర్వే మమ సుప్రభాతమ్ ॥
భావము : భూమికి వాసన, జలమునకు రసము, వాయువునకు స్పర్శ, అగ్నికి ప్రకాశము, ఆకాశమునకు శబ్దగుణము కలిగి ఉండుట పంచభూతాల సహజ లక్షణములు. ఈ మహాతత్త్వముతో అనగా సద్బుద్ధితో మా యీ ప్రభాత సమయమును నాకు మంగళప్రదమొనరింతురు గాక!
7. ప్రాతఃస్మరణమేతద్యో విదిత్వాదరతః పఠేత్ |
స సమ్యక్ ధర్మనిష్టః స్యాత్ సంస్కృతాఖండభారతః ॥
భావము : ఈ ప్రాతఃస్మరణలోని విషయములను బాగుగా అర్థం చేసుకొని అఖండభారత స్వరూపమును స్మృతికి తెచ్చుకొని ప్రతి నిత్యమూ శ్రద్ధతో పఠించినవారికి, సంపూర్ణమైన మంచి ధర్మనిష్ఠ కలుగును.
భారత్ మాతా కీ జయ్
Next
