ఇలా వైకుంఠం యాదాద్రి క్షేత్రం - యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ స్థలపురాణం | Sri Lakshmi Narasimha Swamy Temple, Yadadri

P Madhav Kumar

 శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొలువైన యాదగిరి గుట్ట ఇప్పుడు కొత్త శోభను సంతరించుకుంది. వాస్తుశిల్పులు, స్థపతులు ఆధ్యాత్మికతకు అద్దంపట్టేలా పూర్తిస్థాయి రాతి దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. వైష్ణవ సంప్రదాయానుసారం పాంచరాత్ర ఆగమశాస్త్రోక్తంగా ద్రవిడ వాస్తుశైలికి జీవం పోసిన కాకతీయ, చాళుక్య, హొయసాల, పల్లవ శిల్పకళా నైపుణ్యాల మేళవింపుగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం రూపుదిద్దుకుంది.

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణానికి రెండులక్షల టన్నుల కృష్ణశిలను ఉపయోగించారు. ప్రపంచంలోనే మొదటి రాతి దేవాలయంగా లక్ష్మీ నరసింహ స్వామి గుడి నిర్మతమైంది. ఇందుకు తగ్గట్టుగానే ఈ గుడిని విశిష్టంగా నిర్మించారు. అందులో ప్రత్యేకమైన కృష్ణశిలను అలాగే.. వేంచేపు మండపం, బ్రహ్మోత్సవ మండపం, అష్టభుజి ప్రాకార మండపాలను తీర్చిదిద్దారు. వంద సంవత్సరాలకు ముందు నిర్మించిన అనుభూతి భక్తులకు కలిగే విధంగా రాతి కట్టడాలతో యాదాద్రి ఆలయాన్ని నిర్మించారు. పాత ఆలయం చుట్టూ సిమెంట్‌ కట్టడాలను విడతలు విడతలుగా చేపట్టారు. ప్రస్తుతం గర్భాలయాన్ని అలాగే ఉంచి దాని చుట్టూ పదునైన గోడను నిర్మించారు. ఆలయంలోకి భక్తులు సులువుగా వెళ్లేందుకు వీలుగా ముఖ ద్వారాన్ని కూడా వెడల్పు చేశారు. గతంలో దేవాలయం చుట్టూ రథం, స్వామి వారి సేవ తిరగడానికి మూడు వైపుల్లో మాత్రమే స్థలం ఉండేది. దక్షిణం దిక్కున 120 అడుగుల రిటైనింగ్‌ వాల్‌ నిర్మించి ఆలయానికి దక్షిణ భాగంలో స్థలం పెంచారు. గర్భాలయాన్ని మధ్యగా లెక్కిస్తూ పూర్తి అలయ నిర్మాణం చేపట్టారు. ముఖమండప స్థలం పెంచారు. గతంలో పదివేల మంది భక్తులకు వీలుండే చోటును ఇప్పుడు ముప్పయి నుంచి నలభై వేల మంది వచ్చిపోయేందుకు వీలుగా విస్తరించారు. చుట్టూ ప్రాకార, అష్టభుజి మండపాలు నిర్మించారు. ప్రధానాలయంలో గతంలో ఉన్న విధంగానే ధ్వజస్తంభం, బలిపీఠం, గరుడ ఆలయం, ఆండాళ్‌ అమ్మవారు, ఆంజనేయస్వామి ఆలయాలున్నాయి. ఇందులో అదనంగా సేనా మండపం, ఆళ్వార్, రామానుజుల ఉప ఆలయాలను నిర్మించారు. తూర్పు ద్వారం గుండా ఆలయంలోకి భక్తులు వచ్చి, పడమటి రాజగోపురం నుంచి భక్తులు వెళ్లే మార్గంలో రాతి మెట్లకు రాతి రెయిలింగ్‌ను ఏర్పాటు చేయడం విశేషం.


స్థలపురాణం :

దక్షిణాదిలో ...తెలుగు రాష్ట్రాలలో నారసింహ క్షేత్రాలుఎక్కువ. దేశంలోనే ఏకైక నవనారసింహక్షేత్రం అహోబిలం. ఆ తరువాత అంత ప్రాముఖ్యత ఉన్న క్షేత్రం యాదగిరిగుట్ట. ఎందుకంటే ఇది పంచనారసింహక్షేత్రం.

సృష్టికి పూర్వం శ్రీ మహావిష్ణువు నరసింహరూపంలోనే బ్రహ్మకు దర్శనం ఇచ్చాడట.‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యుం నమామ్యహం’అని మంత్రోపదేశం చేశారట. దీనివల్లే బ్రహ్మకు వేద దర్శనమై ఆ తరువాత సృష్టి మొదలు పెట్టాడట. అంతటి ప్రాముఖ్యం ఉన్న అవతారం నృసింహావతారం. అలాంటి నారసింహుడు వెసిన పవిత్రక్షేత్రం యాదగిరి.

రామాయణ కాలం నాటి విభాండక రుషి, అతడి పుత్రుడైన రుష్యృశృంగ్నుడి కుమారుడు యాదరుషి. అతడ్ణే యాదర్షి అంటారు. చిన్నప్పట్నుంచి నరసింహుడి భక్తుడైన అతడికి ఆస్వామిని దర్శించాలని బలమైన కోరిక ఉండేదట. నరసింహుడ్ని అన్వేషించడానికి అడవులు, కొండలు, కోనలు తిరిగాడు. నరసింహుని దర్శనం కాలేదు. అలా సంచరిస్తున్న యాదర్షి ఒకరోజు ఇప్పుడున్న యాదగిరి అరణ్య ప్రాంతానికి చేరుకుని అలసిపోయి ఒక రావి చెట్టు క్రింద పడుకున్నాడు. అపుడు కలలో ఆంజనేయ స్వామి కనిపించి ‘ నీ పట్టుదల నాకు నచ్చింది. నీకు తోడుగా నేనుంటాను. కఠినంగా తపస్సుచేస్తే స్వామి తప్పక ప్రత్యక్షమవుతాడు ’ అని చెప్పాడట. నిద్రలేచిన యాదర్షి అక్కడే తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్ళకు ఉగ్రనరసింహుడు ప్రతక్షమయ్యాడట. ఆ తేజస్సును చూడలేక శాంతస్వరూపంతో కనిపించమని కోరాడట. యాదర్షి అప్పుడు లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చి ‘‘ఏమికావాలో కోరుకో’’ అని అడిగాడు స్వామి. ‘‘నీ దర్శనం కోసం ఇంతఘోర తపస్సు సామాన్యులు చేయలేరు. అందుకే నువ్వు శాంతరూపంతోనే ఇక్కడ కొలువై ఉండిపో’’ అని కోరాడట. అప్పుడు కొండశిల మీద స్వామి ఆవిర్భవించాడు.

కొన్నాళ్ళ తరువాత యాదర్షికి మరో కోరిక కలిగింది. ‘‘స్వామిని ఒకే రూపంలో చూసాను. వేర్వేరు రూపాల్లో చూడలేక పోయానే’’ అనుకొని మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు స్వామి ప్రత్యక్షమయ్యాడు. ‘‘ నారూపాన్నీ నువ్వు చూడలేవు అయినా నీకోసం నాలుగు రూపాలు చూపిస్తాను’’ అని జ్వాల, యోగానంద, గండభేరుండ, నారసింహ రూపాలుగా దర్శనమిచ్చాడు. జ్వాలా నరసింహుడు సర్పరూపంలో వుంటాడు. యోగానందుడు అర్చా విగ్రహరూపంలో వుంటాడు. గండభేరుండ నరసింహుడు కొండబిలంలో కొలువై ఉంటాడు. తరువాత యాదర్షి..... తనను స్వామిలో ఐక్యం చేసుకోమని కోరడంతో అలాగే చేసుకున్నాడట స్వామి. ఆ యాదర్షి పేరుమీద ఇది యాదగిరి గ్నుట్ట అయింది.

ఆ తరువాత ఈ విషయం గురించి ఎవరికి తెలియలేదు. కలియుగంలో ఒక రోజు రాత్రి గ్రామాధికారికి స్వామి కలలో కనిపించి తాను ఈ ప్రాంతంలోనే నాలుగ్ను రూపాల్లో ఉన్నానని గర్తులు చెప్పాడట. గ్రామాధికారి వెళ్ళి రేఖామాత్రంగా ఉన్న స్వామి రూపాలను గుహలనూ, ఆంజనేయుణ్ని కనుగొన్నాడట. అప్పట్నుంచి స్వామికి పూజాధికాలు మొదలయ్యాయి. గర్భగ్నుడిలో ఎదురుగా ఉండే స్వామి జ్వాలా నరసింహుడు. మరికాస్త లోపల యోగ ముద్రలో యోగానందస్వామి, లక్ష్మీనరసింహ స్వాములను చూడవచ్చు. గర్భాలయం నుండి బయటకు వస్తే మెట్లకు ఎడమ ప్రక్కన క్షేత్రపాలకుడైన హనుమంతుడి గుడి ఉంది. హనుమంతుడి విగ్రహానికి క్రిందన ఉన్న పెద్ద రాతిచీలికలో గండభేరుండ నరసింహుని స్వయంభువు రూపం కనిసిస్తుంది.

ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాక బయట ఎడమ వైపు మెట్లు దిగితే పుష్కరిణి, కుడివైపు కొన్ని మెట్లు దిగితే పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరుని ఆలయం కనిపిస్తాయి. సత్యనారాయణ వ్రతాలు మరియు ‘ప్రదక్షణ మొక్కు’ ప్రధానమైంది. దీనివల్ల మానసిక, శారీరక, ఆర్ధిక బాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. మండలం (41 రోజులు) అర్ధమండం, 11 రోజులు ప్రదక్షిణ మొక్కులు మొక్కుకుంటారు భక్తులు. నిత్యం గ్నర్భాయానికి రెండు సార్లు, ఆంజనేయ స్వామికి 16 సార్లు ప్రదక్షణలు చేస్తారు. ఈ మొక్కు తీర్చుకునే దశలో స్వామి కలలోనే తమకు శస్త్రచికిత్స చేసి, శారీరక బాధల నుంచి విముక్తి చేస్తాడని నమ్ముతారు. సత్యనారాయణస్వామి వ్రతాలకు అన్నవరం తరువాత అంత ప్రసిద్ధి చెందిన క్షేత్రం యాదగిరి గుట్ట. రోజులో నాలుగుసార్లు ఈ వ్రతాలు జరుగుతాయి. ఏటా ఫాల్గుణ మాసంలో 11 రోజుల పాటు నారసింహుని బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.


ఉత్సవాల్లో ఎనిమిది రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఎలా వెళ్లాలా..?.... హైదరాబాదు నుండి 60 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడికి వెళ్లటానికి ఆర్‌టిసి బస్సులున్నాయి. సొంత వాహనాల వారు హైదరాబాదు-వరంగల్‌ జాతీయ రహదారిలో రాయగిరి క్రాస్‌రోడ్డు నుండి వెళ్లవచ్చు.

రైలుమార్గంలో భువనగిరి, రాయగిరి , ఆలేరు రైల్వేస్టేషన్‌లో దిగి స్వామి వారి సన్నిధికి బస్సులలో వెళ్లవచ్చు. ఈ క్షేత్రాన్ని దృష్టిలోపెట్టుకుని హైదరాబాదునుండి సరికొత్తగా ‘యాదగిరి రోడ్డు’ పేరిట 8 లైన్ల రహదారిని నిర్మించారు.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat