మాఘ మాసం కృష్ణపక్ష చతుర్దశి - Maha Shivaratri - మహా శివరాత్రి , మహా శివరాత్రి వ్రత మహాత్యం తెలుసుకుందాము.

P Madhav Kumar
11 minute read

 🚩 🚩*


మహా శివరాత్రి పర్వదినాన్ని నిష్ఠతో ఓ వ్రతంలా చేసుకోవటం పురాణకాలం నుండి వస్తోంది. ఈ వ్రతం చేసేవారి చెంతన నిరంతరం శివుడుంటూ చింతలు తీరుస్తాడు. ఇదే వ్రతాన్ని నిష్కామ దృష్టితో చేసే వారికి ముక్తి లభిస్తుంది. కేవలం మహాశివరాత్రినాడే కాక ఈ వ్రతాన్ని సంవత్సరంలో ప్రతి మాసశివరాత్రి నాడు చేసి ఆ తరువాత ఉద్వాసన విధిని ఆచరించిన వారికి అనంత పుణ్యఫలం లభిస్తుంది. భక్తి , ముక్తి సొంతమవుతాయి. ఇంతటి పుణ్యఫలప్రదమైన ఈ వ్రతాన్ని గురించి చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తూ ఆ శివుడే.

ఓసారి బ్రహ్మ , విష్ణువు , పార్వతీ నేరుగా శివుడినే ఏ వ్రతం చేస్తే మానవులకు శివుడు భక్తిని , ముక్తిని కలిగించటం జరుగుతుందని ప్రశ్నించారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు చేసిన వారికే కాక చూసిన వారికీ , విన్నవారికీ కూడా పాప విముక్తిని కలిగించే శివరాత్రి వ్రతాన్ని గురించి , దాన్ని ఆచరించాల్సిన పద్ధతి గురించి తెలియచెప్పాడు. భక్తిని , ముక్తిని మానవులకు కలిగించే శివ సంబంధ వ్రతాలు చాలా ఉన్నాయి.

జాబాల శ్రుతిలో రుషులు పది శైవవ్రతాలను గురించి చెప్పారు. శివపూజ , రుద్రజపం , శివాలయంలో ఉపవాసం , వారణాసిలో మరణం అనే నాలుగు సనాతనమైన ముక్తి మార్గాలు , అష్టమి తిథితో కూడిన సోమవారం , కృష్ణపక్షం నాటి చతుర్ధశి శివుడికి ఎంతో ప్రీతికరం. ఇవన్నీ ఓ ఎత్తైతే శివరాత్రి వ్రతం అన్నిటికంటే గొప్పది. ఎలాగో ఒకలాగా మనిషి పట్టుపట్టి ఈ వ్రతాన్ని చెయ్యటం మంచిది. ధర్మసాధనలన్నిటిలో ఉత్తమమైనదని దీనికి పేరు. ఏ భేదమూ లేకుండా సర్వవర్ణాలవారు , అన్ని ఆశ్రమాలవారు , స్త్రీలు , పిల్లలు ఒకరనేమిటి దీన్ని ఎవరైనా చేసి మేలు పొందవచ్చు.

మాఘమాసం కృష్ణపక్షంలో ఈ వ్రతం చేయటం శ్రేష్ఠం. రాత్రి అంతా ఈ వ్రతాన్ని చేయాలి. శివరాత్రి పూట ఉదయాన నిద్రలేవగానే శివుడి మీదనే మనస్సును లగ్నంచేయాలి. శుభ్రంగా స్నానం చేశాక శివాలయానికి వెళ్ళి శివపూజను చేసి సంకల్పం చెప్పుకొని పూజాద్రవ్యాలను సమకూర్చుకోవాలి. ఆ రాత్రికి ప్రసిద్ధమైన శివలింగం ఉన్న చోటికి వెళ్ళి సమకూర్చుకొన్న పూజాద్రవ్యాలను అక్కడ ఉంచాలి. ఆ తర్వాత మళ్ళీ స్నానం , లోపల , బయట అంతాపరిశుభ్ర వస్త్రధారణలతో శివపూజకు ఉపక్రమించాలి. శివాగమ ప్రకారం పూజను చేయటం మంచిది. దీనికోసం ఉత్తముడైన ఆచార్యుడిని ఎంచుకోవాలి. ఏ మంత్రానికి ఏ పూజాద్రవ్యాన్ని వాడాలో ఆ క్రమంలోమాత్రమే పూజ చేయాలి. మంత్రం లేకుండా పూజించకూడదు.

భక్తి భావంతో గీత , వాద్య , నృత్యాలతో ఇలా ఆ రాత్రి తొలి యామం(జాము) పూజను పూర్తిచేయాలి. శివమంత్రానుష్ఠానం ఉన్నవారు పార్థివ లింగాన్ని పూజించాలి. ఆ తర్వాత వ్రతమాహాత్మ్య కథను వినాలి. ఈ పూజ నాలుగు జాములలోనూ ఆ రాత్రి అంతా చెయ్యాల్సి ఉంటుంది. వ్రతానంతరం యధాశక్తిగా పండితులకు , శివభక్తులకు విశేషించి సన్యాసులకు భోజనాన్ని పెట్టి సత్కరించాలి. నాలుగు జాములలో చేసే పూజ కొద్దిపాటి భేదంతో ఉంటుంది. తొలి జాములో పార్థివ లింగాన్ని స్థాపించి పూజించాలి. ముందుగా పంచామృతాభిషేకం , ఆ తర్వాత జలధారతో అభిషేకం నిర్వహించాలి.

చందనం , నూకలు లేని బియ్యం , నల్లని నువ్వులతో పూజచేయాలి. ఎర్రగన్నేరు , పద్మంలాంటి పుష్పాలతోఅర్చించాలి. భవుడు , శర్వుడు , రుద్రుడు , పశుపతి , ఉగ్రుడు , మహాన్‌ , భీముడు , ఈశానుడు అనే శివదశ నామాలను స్మరిస్తూ ధూప దీప నైవేద్యాలతో అర్చన చేయాలి. అన్నం , కొబ్బరి , తాంబూలాలను నివేదించాలి. అనంతరం ధేను ముద్రను చూపి పవిత్ర జలంతో తర్పణం విడవాలి. అనంతరం అయిదుగురు పండితులకు భోజనం పెట్టడంతో తొలిజాము పూజ ముగుస్తుంది.

రెండోజాములో తొలిజాముకన్నా రెట్టింపు పూజను చేయాలి. నువ్వులు , యవలు , కమలాలు పూజా ద్రవ్యాలుగా ఉండాలి. మిగిలిన పద్ధతంతా తొలిజాములాంటిదే.

మూడో జాములో చేసే పూజలో యవలస్థానంలో గోధుమలను వాడాలి. జిల్లేడు పూలతో శివపూజ చేయాలి. వివిధ ధూపదీపాలను. శాకపాకాలను , అప్పాలను నివేదించాలి. కర్పూర హారతిని ఇచ్చిన తర్వాత దానిమ్మ పండుతో అర్ఘ్యం ఇవ్వాలి. పండిత భోజనాలన్నీ అంతకు ముందులాగే ఉంటాయి.

నాలుగోజాములో పూజాద్రవ్యాలుగా మినుములు , పెసలు లాంటి ధాన్యాలను , శంఖ పుష్పాలకు , మారేడు దళాలను వాడాలి. నైవేద్యంగా తీపి పదార్థాలను కానీ , మినుములతో కలిపి వండిన అన్నాన్నీ కానీ పెట్టాలి. అరటిపండు లాంటి ఏదో ఒక ఉత్తమమైన పండుతో శివుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా భక్తి పూర్వకంగా నాలుగు జాములలోనూ ఒక ఉత్సవంలాగా శివరాత్రి వ్రతాన్ని చేయాల్సి ఉంటుంది. ఏ జాముకు ఆ జాము పూజ పూర్తికాగానే ఉద్వాసన చెప్పటం , మళ్ళీ తరువాతి జాము పూజకు సంకల్పం చెబుతుండాలి.

నాలుగు జాముల శివరాత్రి వ్రతం ముగిశాక పండితులకు పుష్పాంజలి సమర్పించి వారి నుండి తిలకాన్ని , ఆశీర్వచనాన్ని స్వీకరించి శివుడికి ఉద్వాసన చెప్పాలి. ఈ వ్రతక్రమాన్ని శాస్త్రం తెలిసిన ఆచార్యుడి సహాయంతో క్రమం తప్పకుండా చేయటం మంచిది. ఇలా చేసిన భక్తుల వెంట తాను నిరంతరం ఉంటానని సర్వశుభాలు , సుఖాలు కలిగిస్తానని శివుడు బ్రహ్మ , విష్ణు , పార్వతులకు వివరించి చెప్పాడు ఈ

🚩శివరాత్రి అంటే ?శివరాత్రి పూజావిధానం ఎలా చేయాలి ?🚩*_

వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి. ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరీలోని శివ అనే రెండక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమ శివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్థశినాడు జరుపుకుంటాం.


*☘శివరాత్రులు ఎన్ని ?☘*

శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం అయిదు. అవి : 

నిత్య శివరాత్రి , పక్షశివరాత్రి , మాసశివరాత్రి , మహాశివరాత్రి , యోగశివరాత్రి. వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి. మార్గశిరమాసంలో బహుళ చతుర్థి , అర్ద్ర నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది. శివునికి అతి ఇష్టమైన తిథి అది. అందుకే ఈరోజున శివుడ్ని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరై పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట. ఈ రోజున శివ ప్రతిష్ట చేసినా లేక శివకళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు. త్రయోదశినాడు ఒంటిపొద్దు ఉండి చతుర్థశినాడు ఉపవాసం ఉండాలి. అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్థశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైందంటారు.

లింగోద్భవ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి 180 రోజులు లెక్కిస్తే శివ రాత్రి వస్తుంది. రూపరహితుడైన శివుడు , జ్యోతిరూపంలో , లింగాకారంగా అవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవకాలం అంటారు. ఈ పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి చాలా ముఖ్యమైనది. అర్థరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయమని పురాణాలలో చెప్పారు. ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆరోజు నిద్ర పోకుండా మేల్కొని ఉపవాసముండి , మహాలింగ దర్శనం చేస్తారు. ఉపవాస దీక్ష స్త్రీలు , పురుషులు కూడా ఆచరించదగినదే. ప్రపంచమంతా శివ శక్తిమయమని తెలుసుకోవాలి. శివలింగానికి ప్రణవానికి సామ్యముందంటారు.

ఆ పంధాలో చూస్తే ఈ శివలింగం ఆరువిధాలు ఇలా ఒక్కొక్క విధానంలో ఆరేసి లింగాలు ద్వివిదా ద్వాదశలింగాలుగా చెప్పబడుతున్నప్పటికీ , శివాగమాలరీత్యా మాత్రం ఆచార గర్వాది లింగాలే సరియైనవి కనుక ఈ ఆరులింగాలనే అనుదినం ఆరాధించాలి. పరమశివుడు శివరాత్రి పర్వదినమున ఎన్నో విధాలుగా ఆలంకరింపబడతాడు. ఆ స్వరూపాలలో విభూతిధారణ ఒకటి. విభూతి అంటే ఐశ్వర్యం. అది అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు. ఈశ్వరుడు ఒంటి నిండా విభూతి అద్దుకుంటాడు. రెండవది రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుని మూడవ కన్ను. అందరు దేవతలలో ఫాలభాగంలో కన్ను గలవాడు ఆయన ఒక్కడే.

మూడవది పంచాక్షరి జపం. పంచాక్షరీ మంత్రోపదేశం లేనివారు శివనామాం జపిస్తే చాలు. నాలుగవది మారేడు దళాలతో శివున్ని పూజించడం. శివునికి మూడు దళాలుంటాయి. అయిదవది అంతరంగంలో శివ స్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశి వాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ప్రదోష సమయంలో శివస్మరణ , శివదర్శనం విధిగా చెయ్యాలి. వేదాలన్నింటికీ తాత్పర్యం ఓంకారం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు. *‘శివ’* శబ్దాన్ని దీర్ఘంతీస్తే *‘శివా’* ఆవుతుంది. అది అమ్మవారి పేరు ఈ స్వరూప ధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు. పార్వతీపరమేశ్వరులు , సూర్యుడు , అగ్ని ఈ మూడింటిలోను శివుడుంటాడు. పరమ శాంతినిచ్చేది శివనామస్మరణమే. శివస్మరణకు అందరూ అర్హలే. పరమ శివునికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి నక్షత్రాలలో ఏకాదశి. ఈ తిథి నెలలో రెండుసార్లు వస్తుంది.

ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గర శివరాత్రి గురించి ఆడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమనీ , ఇంకేమి చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసమున్నాసరే తానెంతో సంతోషిస్తానని చెబుతాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం , ఆ రోజు పగలంతా నియమనిష్ఠతో ఉపవాసంతో గడిపి , రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో , తర్వాత పెరుగుతో , ఆ తర్వాత నేతితో , ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రహ్మవిధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు. మామూలుగానైతే ఏ మాసమైనా కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు. కానీ , ఫాల్గుణ మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్తు ఉంటుంది. అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు. మహాశివుడంటే అందరికి తెలుసు. కాని , రాత్రి అంటే ప్రత్యేకార్థము చాల మందికి తెలియదు. *“రా” అన్నది దానార్థక ధాతు నుండి “రాత్రి”* అయిందంటారు. సుఖాన్ని ప్రదానం చేసేదాన్నే రాత్రి అంటారు. ఋగ్వేద – రాత్రి సూక్తం తాలూకు యూప మంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ ఇలా చెప్పబడింది – హే రాత్రే ! 

అక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక !… వగైరా –


*‘ఉప మాపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్!*

*ఉష ఋణేవ యాతయ||’*


నిజంగానే రాత్రి ఆనందదాయిని అన్నింటికి ఆశ్రయం ఇవ్వగలది. అందుకే రాత్రిని ప్రశంసించటం జరిగింది. మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూటే జరుపుకుంటారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఓ ప్రత్యేకత వుంది. చతుర్దశి రోజు ఎవరైతే శివపూజను చేస్తారో , ఆ రాత్రి జాగరణ వహిస్తారో వారికి మళ్ళీ తల్లి పాలు తాగే అవసరం రాదు. అంటే ఆ భక్తుడు జీవన్ముక్తుడు అవుతాడని స్కందపురాణంలో స్పష్టంగా చెప్పబడింది. అంతటి మహిమాన్వితమైనది శివపూజ.


*‘శివంతు పూజయత్వా యోజా గర్తిచ చతుర్దిశీం!*

*మాతుః పయోధర రసం నపిబేత్ స కదాచన!!’*

అందుకేనేమో గరుడ , స్కంద , పద్మ అగ్ని మొదలైన పురాణాల్లో దీనిని ప్రశంసించడం జరిగింది. వర్ణనలలో కొంత తేడా వుండొచ్చు. ప్రముఖ విషయం ఒకటే. ఏ వ్యక్తి అయితే ఆ రోజు ఉపవాసం చేసి , బిల్వ పత్రాలతో శివపూజ చేస్తారో , రాత్రి జాగరణ చేస్తారో వారిని శివుడు నరకాన్నుండి రక్షిస్తాడు. ఆనందాన్ని , మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వ్రతం చేసే వ్యక్తి శివమయంలో లీనమైపోతాడు. దానము , తపము , యజ్ఞము , తీర్థయాత్రలు , వ్రతాలు లాంటివెన్ని కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు. మహాశివరాత్రి రోజు ఉపవాసము , జాగరణ శివపూజ ప్రధానమైంది. అసలు వీటికి తాత్విక అర్థాలెన్నో ఉన్నాయి. అసలు వ్రతం గురించి భిన్న భిన్న గ్రంథాల్లో భిన్నార్థలు గోచరిస్తున్నాయి. వైదిక సాహిత్యంలో దీని అర్థం – వేద బోధితమని , ఇష్ట ప్రాపకర్మ అని వుంది. దార్శనిక గ్రంథాల్లో *‘అభ్యుదయ ‘ మని , ‘ నిః శ్రేయస్సు ‘ కర్మ అని , అమరకోశంలో వ్రతమంటే నియమమని వుంటే పురాణాల్లొ మాత్రం ధర్మానికి పర్యాయవాచిగా ఉపయోగించబడింది. అన్నింటిని కలుపుకుంటే – వేదబోధిత అగ్నిహోత్రాది కర్మ , శాస్త్ర విహిత నియమాది , సాధారణ లేక అసాధారణ ధర్మమే వ్రతమని చెప్పవచ్చు. సులభంగా చెప్పుకోవాలంటే కర్మ ద్వారా ఇష్ట దేవుడి సామీప్యాన్ని పొందటమే అని అనవచ్చు.

మహాశివరాత్రి వ్రతం రోజు ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత నిచ్చారు. అలా అని *‘తిథితత్వం'* లో చెప్పబడింది. ఈ గ్రంథంలో భగవాన్ శంకరుడు ఇలా అన్నట్లు వుంది. – *‘ మీరు స్నానం చేసినా , మంచి వస్త్రాలు ధరించినా , ధూపాలు వెలిగించినా , పూజ చేసినా , పుష్పాలంకరణ చేసినా వీటన్నిటికంటే కూడా ఎవరైతే ఉపవాసం చేయగలరో వారంటేనే నాకిష్టం'* అంటాడు శివుడు.


*☘ఉపవాసం అంటే ఏమిటి ?☘*

దగ్గర వసించటం , నివశించటం , ఉండటాన్ని ఉపవాసమంటారు. వ్రతం చేసేవారి ఇష్టదైవం దగ్గర ఉండటమే ఉపవాసం – ఉపవాసమంటే ఇంతేనా అని పెదవి విరిచే వారికోసమే ఈ శ్లోకం.

*‘ఉప – సమీపే యో వాసః జీవాత్మ పరమాత్మనోః*

*ఉపవాసః సవిఘ్నేయ సర్వభోగ వసర్జిత్: ||’ (వరాహోపనిషత్తు)*

*భవిష్య పురాణంలో కూడా అలాగే చెప్పబడింది.*

*ఉపావృత్తస్య పాపేభ్యోయస్సు వాసో గుణైః సహా!*

*ఉపవాసః స విఘ్నేయ సర్వభోగ వివర్జిత్: ||*

మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరము. వ్రతానికి యోగ్యమైన కాలము రాత్రి. ఎందుకంటే రాత్రిపూట భూత , శక్తులు , శివుడు తిరిగే సమయమన్నమాట. చతుర్దశి రాత్రి ఆయనను పూజించాలి. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఇలా స్పష్టంగా చెప్పాడు. *‘సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రి కాలంలో మేల్కొని తిరుగుతుంటాడు. అతనిలోని ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి. అంటే భోగ , సంగ్రహంలో మునిగి ఉంటారు. తత్వాన్ని అర్థం చేసుకోగల మునులు దృష్టిలో రాత్రి  అది.

*‘యానిశా సర్వ భూతానం తస్యాం జాగర్తి సమ్యమీ*

*యస్యాం జాగృతి భూతాని సానిశాపశ్యతో మునే ‘*

విషయాసక్తుడు నిద్రలో వుంటే అందులో నిగ్రహస్తుడు ప్రబుద్ధంగా ఉన్నాడు. అందువల్ల శివరాత్రి రోజు జాగరణ ముఖ్యమన్నమాట. శివునితో ఏకీకరణమవటమే నిజమైన శివ – పూజ. ఇంద్రియాభిరుచుల్ని నిరోధించి పూజించటమే శివవ్రతము.

శివరాత్రి ఎలా చేసుకోవాలంటే – గరుడ పురాణంలో ఇలా వుంది – త్రయోదశి రోజునే శివ – సన్మానము గ్రహించి , వ్రతులు కొన్ని ప్రతిబంధకాల్ని గమనించాలి. అంటే కొన్ని నియమాల్ని మనసులో నిర్ధారించుకుని పాటించాలి. మీ ప్రకటన ఇలా ఉండాలి – *‘హే మహాదేవా ! నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను. నా భక్తి సామర్ధ్యాన్ని బట్టి దాన , తప , హోమాన్ని చేయగలను. నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను. రెండవరోజు మాత్రమే తింటాను. ఆనంద , మోక్షాలను అనుగ్రహించు శివా !”*

వ్రతం చేశాక గురువు దగ్గరికి వెళ్ళాలి. పంచామృతంతో పాటు పంచగవ్యాలును (ఆంటే అయిదు విధములైన గో సంబంధిత వస్తువులు – ఆవు పేడ – ఆవు పంచకం , ఆవుపాలు , ఆవు పెరుగు , ఆవునెయ్యి) శివలింగాన్ని అభిషేకం చేయించాలి. అభిషేకం చేస్తున్న సమయంలో *‘ఓం నమః శివాయ‘* అనుకుంటూ జపించాలి. చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారాలతో పాటూ శివపూజ చేయాలి. అగ్నిలో నువ్వులు , బియ్యము , నెయ్యితో కలిపిన అన్నము వేయాలి. ఈ హోమం తర్వాత పుర్ణాహుతి నిర్వహించాలి. అందమైన శివకథలు వినవచ్చు. వ్రతలు మరోకసారి రథరాత్రి మూడవ , నాల్గవ ఝాములో ఆహుతులను సమర్పించాలి. సూర్యోదయం అయ్యేంతవరకూ మౌన పాఠం చేయదలచినవారు *‘ఓం నమః శివాయ* అంటూ భగవాన్ శివుని స్మరిస్తూ ఉండాలి. ఆయనను భక్తులు కోరుకునేది ఏమిటంటే – *'పరమాత్మా ! మీ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజ కొనసాగించి పూర్తి చేసాను. హే లోకేశ్వరా ! శివ – భవా ! నన్ను క్షమించు. ఈ రోజు నేను అర్జించిన పుణ్యమంతా , మీకు అర్పితం గావించినదంతా మీ కృపతోనే పూర్తి చేశాను. హే కృపానిధీ ! మా పట్ల ప్రసన్నులు కండి ! మీ నివాసానికి వెళ్ళండి. మీ దర్శనమాత్రము చేతనే మేము పవిత్రులం అయ్యాము.

అటు తర్వాత శివ భక్తులకు భోజనము. వస్త్ర , ఛత్రములు ఇవ్వాలి. నిజానికి లింగోద్భవమైన అర్థరాత్రి సమయం ప్రతిరోజూ వస్తుంది కనుక ప్రతిరోజూ శివరాత్రే. ప్రతిక్షణం శివస్మరణయోగ్యమే. అయితే కృష్ణపక్ష చతుర్దశి శివునికి ఇష్టమైన రోజు కనుక ప్రతినెలా వచ్చే ఆ రోజును మాసశివరాత్రి అన్నారు. అందులోనూ మాఘ బహుళ చతుర్దశి ఆయనకు మరీ మరీ ప్రీతి కనుక ఆ రోజున మహా శివరాత్రి జరుపు కుంటున్నాం. ఆ రోజు ఉదయం స్నానాదికాలం తర్వాత వీలైన శివాలయాన్ని దర్శించి , అవకాశం లేకపోతే , ఇంటివద్దే ఉమామహేశ్వరులను శివప్రీతికరమైన పువ్వులతో , బిల్వదళాలతో అర్చించాలనీ , శక్తికొలదీ పాలు , గంగోదకం , పంచామృతాదులతో లింగాభిషేకం చేయాలనీ , ఉపవాస , జాగరణ శివస్మరణలతో రోజంతా గడిపి మరునాడు ఉత్తమ విప్రులకు , శివభక్తులకు భోజనం పెట్టాలని వ్రత విధానన్ని బోధించారు.

*శివరాత్రికి లింగోద్భవకాలమని* కూడా పేరు. ఆ రోజు అర్థరాత్రి జ్యోతిర్మయమైన ఒక మహాలింగంగా శివుడు ఆవిర్భవించాడు. పరమేశ్వరుడు లోకానికి తన స్వరూప దర్శనం చేయించి జగత్తంతా దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడంలో అర్థం లేదు. అందుకే శివరాత్రి జాగరణకు అంత ప్రాధాన్యం. ఆ రోజు అభిషేకాదులతో శివుని పూజించి ఉపవాసముండి రోజంతా శివనామస్మరణంతో గడపడంలోని ఉద్దేశం మన తనువునూ , మనసునూ కూడా శివార్పితం , శివాంకితం చేయడానికే. శివమంటే జ్ఞానమే. జన్మ పరంపర శృంఖాలాలను తెంచి నిత్యానంద ప్రదమైన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికే ఉంది. శివరాత్రినాడు పధ్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు  *'బిల్వ'* మూలంలో ఉంటాయనీ , శివరాత్రినాడు ఉపవసించి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది. కనీసం జన్మకొక్క శివరాత్రి అయినా చేయమని పెద్దలు చెబుతుంటారు. సమస్త ప్రాణికోటిలో సూక్ష్మజ్యోతిరూపంలో ఉండే శివుడు భూమిపై పార్థివలింగంగా ఆర్చింపబడుతుంటాడు. శివరాత్రినాడు ఫలం , ఒక తోటకూర కట్ట అయినాసరే శివార్పణం అని దానం చేయడం ముక్తిదాయకం. కలిగినవారు వారి వారి శక్తి అనుసారం బంగారం , వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి ఓ పండితునికి సమర్పిస్తే అజ్ఞానంధకారం నశిస్తుందని పెద్దలవాక్కు. శివరాత్రినాడు ఉపవసించి త్రికరణ శుద్ధిగా శివుని ఆరాధిస్తే , ఒక సంవత్సర కాలం నిత్యం శివార్చన చేసిన ఫలం కలుగుతుందని సాక్షాత్తు శంకరుడు బ్రహ్మదేవునికి చెప్పినట్లు పెద్దలవాక్కు.


*☘ప్రదక్షణ విధులు☘* 

శివాలయములో ప్రవేశించిన తర్వాత నందికి ఏ ప్రక్కనుంచి లోపలకు వెళ్తారో ఆ ప్రక్కనుంచి మాత్రమే , వెనక్కి రావాలి. శివలింగం , నందీశ్వరుల మధ్య నుంచి రాకూడదు. ఇలావచ్చినా పుణ్యం రాదు సరి కదా పూర్వ జన్మలోని పుణ్యం కూడా పోతుంది.


*☘బిల్వ దళం ప్రాముఖ్యత:☘*

బిల్వం లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్టం. బిల్వ దళం మూడు అకుల్ని కలిగి ఉంటుంది. ఇందులో కుడి ఎడమలు విష్ణు , బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు. మారేడుకే శివప్రియ అని మరోపేరు ఉంది. బిల్వదళం పొరబాటున కాలికి తగిలితే ఆయష్షు క్షీణిస్తుందంటారు. ఇది శివుడి అజ్ఞ. బిల్వం ఇంటి అవరణంలోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం. తుర్పున ఉంటే సౌఖ్యం. పశ్చి మాన ఉంటే సంతానాభివృద్ధి. దక్షినాన ఆపదల నివారణ. వసంతం , గ్రీష్మంలో బిల్వంతో శివున్ని పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది.

🚩శివరాత్రి నాడు చేయవలసినవి, చేయకూడనివి ఇవే..!🚩*_

#లింగోద్భం

*శివరాత్రి* అనగానే అందరికీ గుర్తుకువచ్చేది.. లింగోద్భవం. అసలు లింగోద్భం గురించి పురాణాగాథలు ఏమిటీ తెలుసుకుందాం… శివరూపం లింగరూపం అందులోనూ వృత్తాకారం *శివుడు,* పానవట్టం పార్వతీరూపం అని ఆగమ వాక్యం. ఒకప్పుడు హరిబ్రహ్మాదులకు చైతన్యకారకం గురించి స్పర్థ వచ్చినప్పుడు వారిమధ్య ఒక పెద్ద జ్యోతి రూపం ఏర్పడింది. ఆ రూపం పై కొన చూడటానికి హంస రూపంలో బ్రహ్మ , వరాహంగా విష్ణువు వెళ్లారు ఎంతసేపటికీ అంతు తెలియక అలసిపోయి ప్రార్థన చేయగా ఆజ్యోతి శివలింగాకారం ప్రతీకగా ఏర్పడినది. జ్ఞానరూపియైన *శివుడు*  చైతన్యజ్యోతిగా ఆవిర్భవించిన రాత్రి అమావాస్య గా చెపుతారు దానిముందురోజు శివరాత్రిగా చెపుతారు.


కాబట్టే లోకంలో ఇప్పటికీ త్రయోదశి చతుర్దశి కలిసిన రోజుని *శివరాత్రిగా* చెపుతారు. ఇదిప్రతిమాసంలో వస్తుంది. కానీ పాలసముద్రం చిలికినపుడు హాలాహలభక్షణం చేసి ఒక చిన్న రేగుపండు అంతగా చేసి కంఠంలో ధరించినరాత్రి లోకాల్నికాపాడిన శివుని ఆరాత్రి జాగరణతో దేవతలు జనులు ప్రార్థించినరాత్రిగా మహాశివరాత్రి అని చెపుతారు. లోకమంతా శివరక్షణవల్ల మంగళాన్ని పొందుటవల్ల దానికి ప్రతీకగా శివ కళ్యాణాన్ని కూడ జరుపుతారు.


*🌻లింగోద్భవ పుణ్యకాలం శివరాత్రి నాడు చేయవలసిన విధులు ఇవే..🌻*

అన్నం కాకుండా పాలు, పండ్లు పలహారం మాత్రమే తీసుకోవాలి తక్కువ ఆహారం తీసుకోవాలి ఇతరులతో మాటల్లోకూడా దైవసంబంధమైనవే ఎక్కువగా ఉండటం వీలైనంత తక్కువ వమాట్లడటం ఎక్కువసేపు పంచాక్షరీ (ఓం నమశ్శివాయ) జపం చేయటం పండ్లు పలహారాలు దేవునుకి నివేదించటం వాటిని ఇతరులకు పంచిపెట్టటం వీలైనంత వరకు జాగరణచేయటం శివునికి అభిషేకం చేస్తే చాలామంచిది. చాపమీద పడుకోవాలి , స్త్రీ లైనా పురుషులైనా బ్రహ్మచర్యం పాటించాలి. లింగోద్భవపుణ్యకాలం వరకూ మేల్కొని ఉండాలి. వీలైతే మరుసటి రోజువరకూ ఉండాలి.


*🌻శివరాత్రి చేయకూడనివి ఇవే !🌻*

అనారోగ్యంతో ఉపవాసం చేయకండి సాత్విక ఆహారం స్వీకరించి పూజించండి. ప్రాతస్సంధ్య,సాయం సంధ్యలో నిద్రపోకండి, శివ పూజకి మొగలిపూవు వాడకండి . నీటిని అభిషేకానికి ఎక్కువగా వాడండి ఇతరపదార్థాలు (పంచామృతం,పండ్లరసాలు,సుగంధ పరిమళ పదార్థాలు) తక్కువగా వాడండి. సిమెంట్ రాతివంటి అన్నిలింగాలకన్నా పుట్టమన్నుతో చేసినశివలింగానికి అభిషేకిస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. తినాల్సిన స్థితివస్తే పిండిపదార్థాలు తీసుకోవచ్చు. పండ్లు, పాలు తీసుకోండి. అవీ తక్కువ మోతాదులో శరీరానికి అవసరమైన కనీసస్థాయిలో మాత్రమే.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat