23. శ్రావణమాస మహాత్మ్యము - 23వ అధ్యాయం - Sravana Masam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

23. శ్రావణమాస మహాత్మ్యము - 23వ అధ్యాయం - Sravana Masam

P Madhav Kumar


🍃🌷త్రయోవింశోధ్యాయము - శ్రీ కృష్ణ జన్మాష్టమీ వ్రతకథనం:

(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll


🌻ఈశ్వర ఉవాచ:

సాంబమూర్తి చెప్పుచున్నాడు...

ఓ మునీశ్వరుఁడా! శ్రావణమాసము నందు సూర్యుఁడు సింహరాశి యందు ప్రవేశించియుండగా బహుళాష్టమి దినంబున చంద్రుఁడు వృషభరాసి యందుండు సమయంబున రాత్రి నిశీధి దమయమందు దేవకీవసుదేవుల వలన కృష్ణస్వరూపుడై భగవంతుడు ఆవిర్భవించెను. కావున, ఈ దినము మంచి పుణ్యప్రదమగు కాలము. ఇటువంటిదినంబున విశేషమహోత్సవము చేయతగినది.


సప్తమి దినంబున దంతధావనాది కృత్యములను దీర్చి, స్నానసంధ్యావందనాది నిత్యకర్మలను చేసినవాడై, పండ్లు మొదలగువానిని కొంచెముగా భుజించి, నియమము కలవాడై, ఇంద్రియములను జయించి, లఘు ఉపవాసముతో ఆ రాత్రిని వెళ్ల బుచ్చవలయును, మఱియు ఏమియు భక్షింపక శుష్కోపవాసముతోనైనా, కృష్ణాష్టమి దినంబును వెళ్లబుచ్చవలయును.


ఇందువలన ఏడు జన్మంబుల ముందు చేసిన పాపమైనను నశించిపోవును. ఇందు విషయమై సందేహము లేదు. ఉపవాసమనగా పాపమువలన విడువబడి సద్గుణములు కలవాడై సమస్త భోగములను విడిచి యుండుట ఉపవాసమని చెప్పబడునని మునీశ్వరులు వక్కాణించిరి.


అనంతరము నువ్వుల నూనెతో తలంటుకొని, నిర్మలమగు నదీజలములో స్నానము చేసి పరిశుద్ధుడై, శుభ్రవస్త్రములను ధరించి, శుచియగు ప్రదేశమందు దేవకీ దేవియొక్క పురిటి గృహమును లిఖించి, అనేక వర్ణములు కలవియు, పరిమళము కల పుష్పములు, కలశములు, ఫలములు, దీపపంక్తులు మొదలగువానిచే మనోహరంగా అలంకరించి, అగరు, కస్తూరి, చందనము, మొదలగు పరిమళద్రవ్యములచే పరిమళింప చేసి, విష్ణువంశమును గోపాల కులవంశము అచ్చట లిఖించవలెను.


వాద్యములు, నృత్యము, గీతము, నాట్యము మొదలగు మంగళధ్వనులను మ్రోగింపుచు, బంగారము వెండి రాగి యిత్తడి మొదలగు లోహములతో గాని, మట్టితో గాని కొయ్యతో గాని మణులతో గాని విష్ణుమూర్తి ప్రతిమను పూతకియను రాక్షసియు బాలహంతయు షష్టియను దానితోగూడ నిర్మించి, లేక రంగులతోనైన నిర్మించి, ఆ ప్రతిమను అక్కడ ఉంచవలయును. మఱియు అచ్చట పందిరి పట్టిమంచమును, దాని పైన ఎనిమిది బొమ్మలతో గూడిన పరుపును దానియందు సర్వలక్షణ సంపన్నురాలును బాలింతరాలు అగు దేవకీ ప్రతిమను ఉంచవలయును.


ఆ శయ్యయందు పాలు తాగుచున్నట్లును, నిద్రించుచున్నట్లును, బాలుడగు కృష్ణుని విగ్రహమును వేయవలయును. ఆ పురిటి గృహమునందే మఱియొక ప్ర్రదేశంబున ఆడ శిశువును కనినట్లుగా యశోదా దేవి యొక్క విగ్రహమును కృష్ణ విగ్రహమునకు సమీపముగా లిఖించవలయును, మఱియు యక్షులు విద్యాధరులు దేవతలు మొదలగువారు దోసిలిపట్టుకొని కృష్ణమూర్తిని ధ్యానించుచున్న వారలనుగా లిఖించవలయును.


మఱియు అచ్చట ఖడ్గము చర్మము మొదలగు ఆయుధములను ధరించియున్నట్లుగా వనుదేవ విగ్రహమును లిఖించవలయును, మఱియు కాశ్యపముని అంశమగు వసుదేవుని, అదితి యొక్క అంశమగు దేవకీయశోదలను, ఆదిశేషుని అంశమగు బలరాముని, దక్షప్రజాపతి అంశమగు నందుని, చతుర్ముఖ బ్రహ్మ యొక్క అంశమగు గర్గమునీశ్వరుని, అప్సరసల యొక్క అంశమగు గోపికా స్త్రీలను, సమస్త దేవతల అంశమగు గోపాలకులను, కాలనేమి అంశమగు కంసుని, వానిచే నియోగింపబడిన సమస్త రాక్షసుల యొక్క అంశజులగునట్టియు హస్తమందు ఆయుధధారు అయినటువంటి, గార్ధభాసురుడు, ధేనుకాసురుడు, గజాసురుడు, అశ్వాసురుడు మొదలగువారిని లిఖించవలయును, మఱియు అచ్చటనే యమునానది యందు మడుగులో కాళీయుడను సర్పవిగ్రహము ఉండునట్లుగాను లిఖింపవలయును.


ఈ ప్రకారము కృష్ణమూర్తి అవతారములో జరిగిన చరిత్రనుగురించిన హరి యొక్క విగ్రహములనన్నియు లిఖించి, భక్తి కలవాడై ప్రయత్నముచే పూజాద్రవ్యములన్నియు సంపాదించి, దేవకీ అనుమంత్రమును జెప్పుచు షోడశోపచారములచే పూజింపవలయును.


 వేణువు, వీణ మొదలగు సాధనములతో సంగీతము పాడుచుండెడి గంధర్వులతో చుట్టుకొనబడినదియు,  బంగారపు దర్పణము, గరికలు పెరుగు కలశములు మొదలగునవి హస్తములయందు ఉంచుకొనిన కింకరులచే సేవింపబడినదియు, కుమారుడగు కృష్ణుని తొడల యందుంచుకొని, ఆనందయుక్తమగు ముఖముకలదియై శోభస్కరమగు శయ్యయందు గూర్చున్నదియు, దేవమాతయగు అదితి యంశము వలన బుట్టిన దేవకీదేవి పెనిమిటియగు వసుదేవునితో కూడియుండి సర్వోత్కృష్టము గా ప్రకాశించుగాక యని ధ్యానము చేయవలయును.


నేరుగా నామములను జెప్పుచు, మొదట 'ఓం' కారమును చివర 'నమః' అను పదమును జెప్పవలయును. పూజావిధిని తెలిసుకొనినవాడగుచు,  సమస్త పాపములు నశించుట కొఱకు దేవకీదేవి, వసుదేవుడు, కృష్ణమూర్తి, బలరాముడు, యశోద, నందుడు మొదలగువారలకు వేరువేరుగా పూజచేయవలయును.


పాలసముద్రమునందు జన్మించినవాడును, అత్రి మునీశ్వరుని వంశమునందు జన్మించిన వాడును, రోహిణీదేవికి పెనిమిటియగు ఓ చంద్రుడా ! నీకు నమస్కారముచేసెదను. నాచే ఇవ్వబడిన అర్ఘ్యమును గ్రహింపుమని ప్రార్థించి, భగవంతుని మనస్సున దలచుచు చంద్రోదయ కాలమునందు చంద్రునకు అర్ఘ్యము విడువవలెను.


దేవకీయుక్తుండగు వసుదేవుని,  యశోదాయుక్తుండగు నందుని, రోహిణీ యుక్తుండగు చంద్రుని, బలరాముని, కృష్ణుని యధావిధిగా పూజించినవానికి పొందశక్యముగానిదేమియు లేదు. అనగా, సమస్తమును పొందును. కావున, ఈ కృష్ణాష్టమి అనువది కోటి ఏకాదశులను చేసిన ఫలమునొసగును. గాన,  కృష్ణాష్టమీ దినంబున రాత్రి పూర్వమందు చెప్పినరీతిగా పూజించి, తెల్లవారిన పిమ్మట, నవమీ దినంబున కృష్ణునకును భగవత్స్వరూపిణియగు శక్తికిని సమానముగా ఉత్సవము జేయవలెను.


అనంతరము కృష్ణమూర్తి, నాయందు అనుగ్రహము కలవాడగు గాక అని గోవులు, ధనము, బంగారము, భూములు మొదలగు తనకిష్టమగు వానినన్నియు దానములనిచ్చి, పిమ్మట బ్రాహ్మణులకు భోజనం పెట్టవలెను.


 గోవులకును,  బ్రాహ్మణులకును మేలును చేయునటువంటి వాసుదేవునకు నమస్కారము, శాంతియు శుభమును నాకు కలుగుచునుండుగాకయని దేవతకు ఉద్వాసన చెప్పవలయును.


అనంతరము మౌనము కలవాడై బంధువులతో గూడుకొని భుజింపవలయును. ఈ ప్రకారము ప్రతిసంవత్సరము కృష్ణునకు శక్తికి పూజగావించి, ఉత్సవమును చేసినవాడు పుత్రసంతానము ఆరోగ్యము సామ్యములేని ఐశ్వర్యము మొదలగు చెప్పిన ఫలముల నన్నియుపొందగలడు.


ఈ లోకంబున ఉండునంతకాలము, ధర్మమునందు ఆసక్తి కలవాడై, జన్మాంతమునందు వైకుంఠలోకమున కేగును.


ఇకముందు, ఉద్యాపనమును చెప్పెదను వినుము. పంచాంగ శుద్ధిగల దినమునందు ఉద్యాపనము చేయదలచినవాడై పూర్వదినమునందు ఒక్క పర్యాయమే భుజించి, మనస్సున భగవంతుని ధ్యానింపుచు, ఆ రాత్రి నిద్రించవలయును. మరునాడు ప్రాతః కాలంబున స్నానసంధ్యాది నిత్యకర్మలను నెరవేర్చుకొని వ్రతమును ప్రారంభించుటకు బ్రాహ్మణులను పిలచి, పుణ్యాహవాచనాది క్రియలను చేయించుకొనవలయును.


అనంతరము ఆచార్యునకు, ఋత్విక్కులకు వరుణలను ఇవ్వవలయును. నవటాకు గాని, అందులో సగముగాని, అందులో నాలుగవ వంతుగాని, తనశక్తి కలిగినట్లు బంగారముతో ప్రతిమను చేయించవలెను. శక్తికి లోపము చేయకూడదు. ఆ ప్రతిమను మంటపమునందు ఉంచి, పిమ్మట బ్రహ్మ మొదలగు దేవతలనందరిని ఆవాహనము చేయవలయును.


ఆ మంటపము నందే రాగి కలశమును గాని, మట్టికుండను గాని, బియ్యముతో నిండించి యుంచవలయును. దానిపైన వెండిపళ్లెము గాని, రాగిపళ్లెము గాని, వెదురు పాత్రగాని యుంచవలయును.


విద్వాంసుడగువాడు ఆ మంటపమందు ఉన్న విష్ణు ప్రతిమ యందు అఖండితమగు నూతన వస్త్రమునుంచి పిమ్మట వేదోక్తమంత్రములతోను, కల్పోక్తమంత్ర ములతోను షోడశోపచార పూజలను గావింపవలెను.


అనంతరము, దేవకీ సహితుడైన కృష్ణునకు అర్ఘ్యం ఇవ్వవలయును. అది ఏవిధముగా అనగా, శంఖములో జలము నుంచి పుష్పములు ఫలములు మంచిగంధము మొదలగువానితో ఆ శంఖమును అలంకరించి, కొబ్బరికాయను, ఆ శంఖమును చేతనుంచుకొని మోకాళ్లను భూమిమీద ఉండునట్లుగా వంచి దేవకీ సహితుడవగు ఓ కృష్ణమూర్తీ ! నీవు కంసుని సంహరించుటకును, భూభారమును హరించుటకును, కౌరవులను నశింపుచేయుటకును, రాక్షసులను వధించుటకును, జన్మించితివి కావున నేనిచ్చునట్టి అర్ఘ్యమును గ్రహింపుము, అని ప్రార్ధించి, అర్ఘ్యము ఇవ్వవలెను. విద్వాంసుడు పూర్వమునందు చెప్పబడిన రీతిగానే చంద్రునకు అర్ఘ్యము ఇవ్వవలెను.


దేవకీ వసుదేవులకు కుమారుడవును, మూడులోకములకు ప్రభుడవునగు ఓ కృష్ణమూర్తీ! నీకు నమస్కారము చేసెదను సంసార సముద్రమునుండి నన్ను రక్షింపుము.


ఈ ప్రకారము, భగవంతుని ప్రార్ధించి, రాత్రి జాగరణము చేసి, మరునాడు ఉదయంబున నిర్మలమగు జలములో స్నానము చేసి, కృష్ణుని పూజించి, మూలమంత్రమును ఉచ్చరింపుచు, పరమాన్నము, తిలలు, నెయ్యి మొదలగువానిచే నూట యెనిమిది పర్యాయములు హోమము చేసి, పిమ్మట పురుషసూక్తముతోను, 'ఇదంవిష్ణుః,' అను మంత్రముతోను ఆజ్య హోమము భక్తితో చేయవలెను.


అనంతరము పూర్ణాహుతి మొదలగు హోమములు అన్నియు సమాప్తినొందించి, అనంతరము ఆచార్యునకు వస్త్రములు ఆభరణములు మొదలగువానినిచ్చి పూజించి వ్రతము పూర్తినొందుటకు కపిలగోవును దానమివ్వవలెను.


ఎటువంటి గోదానము చేయవలయుననగా, పాలునిచ్చునదియు, మంచి స్వభావముగలదియు, దూడగలదియు, సుగుణములు కలదియు, బంగారపు కొమ్ములు కలదియు, వెండి డెక్కలుగలదియ, కంచుపొదుగుతో కూడినదియు, తోకయందు ముత్యములు ఉంచబడినదియు, రాగివీపుతో నుండునదియు, బంగారపు ఘంటలు కలదియు, నూతన వస్త్రముచే గప్పబడినదియు, అగు గోవును సంపూర్ణణమగు దక్షిణతో కూడ ఇచ్చినయెడల వ్రతము సంపూర్తినొందును.


కపిలగోవు సంభవించనప్పుడు, మఱియొకటి, ఏ గోవునైనను దానమివ్వవచ్చును. అనంతరము ఋత్విక్కులకు వారికి తగినట్లుగా దక్షిణ ఇవ్వవలయును. 


అనంతరము ఎనమండుగురు బ్రాహ్మణులకు భోజనము పెట్టి, నిర్మలనుగు మనస్సు కలవాడగుచు - జలముతో నిండియుండిన నూతన కలశములను దక్షిణలతో సహితముగా వారికి ఇవ్వవలెను.అనంతరము వారివలన అనుజ్ఞ తీసికొని తాను బంధువులతో కూడ భుజింపవలయును. 


బ్రహ్మ మానసపుత్రుడవగు ఓ సనత్కుమారా! ఈ ప్రకారము వ్రతమునకు ఉద్యాపనము చేసిన బ్రాహ్మణుడు ఆ క్షణమునందే పాపము వలన విడువబడును. ఇహలోకంబున పుత్రులు పౌత్రులతో కూడినవాడై ధనము ధాజ్యం మొదలగు ఐశ్వర్యము కలవాడగుచు చాలా కాలము సమస్త సుఖములను అనుభవించి, అంత్యకాలమందు శాశ్వతమగు వైకుంఠలోకమునకేగును, అని సాంబమూర్తి సనత్కుమారునితో చెప్పెను.


ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే -- "శ్రీ కృష్ణ జన్మాష్టమీ వ్రతకథనం" నామ త్రయోవింశోధ్యాయస్సమాప్తః..            


ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏


🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow