అతనికి గురువర్యులు దత్తత్రేయులు, ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి “గురువర్యా! మీ అనుగ్రహమువలన అనేక విషయాలు తెలుసుకొని వుంటిని, కాని మాఘమాసము యొక్క మహత్మ్యమును వినియుండలేదు. కావున, మాఘమాసము యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను, అని దత్తాత్రేయుని కోరెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను.
“భూపాలా! భరత ఖండములో ఉన్న పుణ్య నదులకు సమస్తమైన నదులు ప్రపంచమునందు ఎచ్చట లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి పండ్రెండు. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ప్రతి ఒక్క సంవత్సరము ఒక్క ఒక్క రాశి యందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కర ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దాన ధర్మములు ఆచరించిన యెడల దానివలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడ సాధ్యము కాదు.
అందునా మాఘమాస మందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కలుగుటయే కాక జన్మ రాహిత్యము కూడ కలుగును. గనుక, ఏ మానవుడైననూ మాఘమాసములో సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘ స్నానము చేసి, ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచ మహపాతకములు చేసిన వాడైనను ముక్తి పొందగలడు”, అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి తెలుపుచుచూ ఇంకనూ యీవిధముగా చెప్పుచున్నాడు.
“పూర్వ కాలమున గంగానదీ తీరపు ఉత్తర భాగమున భాగ్యపురమను పట్టణము కలదు. అందు నివసించు జనులు కుబేరులు వలెనున్నారు. ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు కలడు. అతడు గొప్ప ధనవంతుడు, బంగారు నగలు, నాణేములు రాసుల కొలది ఉన్నవాడు. కొంత కాలమునకు హేమాంబరుడు చనిపోయెను, తండ్రి చనిపోగానే అతని కుమారులు ఇద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని, యిష్టము వచ్చినటుల పాడు చేయుచుండిరి. ఇద్దరు చెరొక ఉంపుడుకత్తెనూ చేరదీసి, కుల భ్రష్టులైరి.
ఒకనాడు పెద్ద కుమారుడు వేశ్యతో ఉద్యానవనములో విహరించు చుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరచుటచే నోటివెంట నురుగలు గ్రక్కుచూ చనిపోయినాడు, ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమ దూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకొని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి, పెద్ద వానిని నరకంలో పడవేయమన్నాడు. రెండవ వానిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిత్రగుప్తునితో యిలా అన్నాడు.
“అయ్యా! మేము ఇద్దరూ ఒకే తండ్రి బిడ్డలము. ఇద్దరమూ ఒక విధముగానే పాపములు చేసియున్నాము. అయినా అతనికి నరకమును, నాకు స్వర్గమును యేల ప్రాప్తించును” అని అడిగెను. ఆ మాటలకు చిత్రగుప్తుడు ” ఓయీ వైశ్య పుత్రా! నీవు నీ వేశ్యను కలుసు కొనుటకు ప్రతి దినము యామెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని యింటికి వెళ్ళి వచ్చుచుండెడివాడవు. అటులనే మాఘమాసములో కూడా నదిని దాటుతుండగా కెరటాల జల్లులు నీశిరస్సుపై పడినవి. అందు వలన నీవు పవిత్రుడవు అయినావు మరొక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు, ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహా పాపములు కూడ నశించును.
కాన విప్రుని చూచుట వలన నీకు మంచిఫలితమే కలిగినది. అదియునూ కాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రీ మంత్రమును కూడా నీవు వినియున్నావు. గంగానదిలోని నీరు నీ శరీరము మీదపడినది. గనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను” అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా! ఏమి నా భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షము కలిగినదా” అని వైశ్య కుమారుడు సంతసించి, దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను.
మాఘపురాణం 8వ అధ్యాయం పారాయణం సంపూర్ణం..
