లింగధారణవిధి: ప్రారంభః
“పంచాచార్యాః ప్రసీదంతు”
లింగధారణ విధిః
శ్లో|| వీరశైవ స్థితానాంచ, స్త్రీణాం గర్భాష్ట మేగురుః |
పంచసూత్ర కృతం లింగం, ధారయేద్విధివచ్ఛుభం ||
అర్ధోదయేవాప్యధవా స్యాత్పతనే చైవ దేశికః |
పూర్వం సంస్కారితంలింగం, శిశోః కంఠేచ ధారయేత్ ||
శ్లో|| లింగవృత్త సమాంపీఠం, దీర్ఘం విస్తారమేవచ |
తదగ్ధం గోముఖంచైవ, పంచ సూత్రము దాహృతం ||
తా|| ఈ ప్రకారముగా లింగ ధారణమొనర్చిన పిదప ఆ లింగమును విధి పూర్వకముగా ధరించవలెను. మరియు ప్రసవ కాలమునందుగాని, అధవా అర్ధపిండోదయ కాలమునందుగాని, మరియు భూపతమైన తరువాతగాని, ఈ మొదలే గర్భాష్టమ మాసమున ధరింపజేసిన లింగమును మరల సంస్కరించి దానినే శిశువు కంఠమునందు ఈ దిగువ వ్రాయబడిన లింగధారణ విధి మేరకు ధరించవలెను, ఇది సాధ్యముగాని పక్షమున శిశువు జన్మించిన 3.వ. దినమునందు తప్పకుండా లింగధారణ జేయవలెను. వీరశైవుల గృహములలో శిశువు జన్మించిన 3.వ. దినములో శివపూజ గృహమును షట్సమ్మార్జనము గావించి రంగవల్లితో ముగ్గులువేసి, గురువేదికను సిద్ధ పరచి సమస్త పూజాసామగ్రిని ఆయత్త పరచికొని, శ్రీగురువును రప్పించి, ఆ వేదికపై కూర్చుండబెట్టి, పాదార్చన యొనర్చి అట్టి ధూళిపాదోదకమును గృహములోని అన్ని వైపుల ప్రోక్షించి ముందు ధరించబోవు పంచసూత్ర ఘటితంబైన లింగముపై న యెరచి ఆలింగముయొక్క పీఠము కదలకుండ భద్రముగ ఒక దారమును జుట్టి వేదిక (గద్దె)పై నిడుకొన వలయును. తదుపరి గురువు యొక్క కుడి ప్రక్కన క్రింద బియ్యమును పరచి ఒక కలశమును స్థాపించి ఆ కలశమునకు సూతికా గృహమునందలి శిశువు ఉండిన స్థానమునకు సూత్రమును తగిలించి (బంధించి) ఆ పిదప నాయుంటి యజమానిగాని అధవా ఇతరులెవరైనను సరె వారు గురువునకు సాష్టాంగ ప్రణామంబు నాచరించి గురువు ఎదుట గూర్చుండి దిగువ (క్రింద) అభిషేక పాత్రను బెట్టించి ధరింపజేయు లింగమును ఎడమ హస్తతలమున ఉంచి, పంచామృతము మున్నగు వాటితో ౫ సార్లు అభిషేకమును జేసి భస్మము, గంధము, పత్రి, పుష్పము, అక్షతలు-ధూప-దీప-నైవేద్యాదులతో ౫ సార్లు పూజింపవలెను.