5. వ. ది.
లగ్న కార్యమును జరిపే గృహములో యోగ్యమైన (పరిశుద్ధమైన) స్థలమునందు వివాహ మండపమును నిర్మించి, ఆ మండపములో గోమయముతో సమ్మార్జనము (అలికి) రంగవల్లి ముగ్గులతో నలంకరించి, దాని మధ్యభాగమున బియ్యము పరచి, పంచ కలశములను స్థాపించి, పిదప నా కలశములను మామిడి యాకులతో బొందుపరచి, దారముతో కలశములకు జుట్టి అందుండి ఒక సూత్రమును గురువు గూర్చుండే వేదిక (గద్దె) వరకు మరో సూత్రమును పెండ్లి పిల్లలు గూర్చుండే స్థలమునకు దీసికెళ్ళి అట్టి సూత్రములకు దర్భ ఉంగరములను గట్టి సిద్ధగించి మంత్రోక్తముచేత ఆ కలశములను నింపి, క్రొత్త వస్త్రముతో గప్పి యుంచవలెను. తరువాత ముత్తయిదువలు వచ్చి పెండ్లిపిల్లలు గూర్చుండిన చోట ఒక కంబలము (గొంగడిని) పరచి దానిపై తెల్ల ఆవాలు కొద్దిగా వేసి వధూవరులను తోడ్కొని వచ్చి కలశము ఎదుట గూర్చుండబెట్టి మతాధికారులు కలశమునకు గప్పిన వస్త్రమును దీసి సూత్రమును వరుని చేతికిచ్చి వధువు హస్తమును వరుని చేతిక్రింద ఉంచి, మంత్రోక్తముగా హస్తపూజ కంకణపూజ యొనర్చి, తరువాత క్రమముగా దశకర్మలను ఆచరింప జేయవలెను.
శ్లో॥ తదేవలగ్నం సుదినం తదేవా । తారాబలం చంద్రబలం తదేవా । విద్యాబలం దైవబలం తదేవా । గౌరీపతే తేంఘ్రియుగం స్మరామి॥
ఈ మంత్రమును లగ్న కార్యము పూర్తి అయ్యేవరకు చెప్పవలెను.