09. పాదపూజా విధానము | Paada Pooja Vidhanam | Veerashaiva Purohitam,
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

09. పాదపూజా విధానము | Paada Pooja Vidhanam | Veerashaiva Purohitam,

Madhav
4. వ. ది.

ప్రతి యొక్క వీరశైవుడు ఈ మొదలు వివరించిన ప్రకారముగా ప్రతి దినము తప్పకుండా లింగార్చన జేసికొని, పరిశుద్ధుడైన సద్గురువును తన గృహమునకు రప్పించుకొని, వేదికపై గూర్చుండబెట్టి ఆ గురువు యొక్క పాద ప్రక్షాళన మొనర్చి, మొదట ధూళిపాదోదకమును స్వగృహమంతటను సంప్రోక్షించి పిదప నా పాదములను మడిగుడ్డతో బాగుగా తడియొత్తి, గురువు ఎదుట సమస్త పూజా ద్రవ్యములను (నీరు-భస్మము-గంధము-అక్షతలు - పత్రి - పుష్పులు - ధూప - దీప - నైవేద్యములను) సమకూర్చుకొని, ఒక గ్లాసు (పాత్ర) నిండ నీరును దీసికొని, అందులో మంగళకరమైన (ఓం) అను ప్రణవమును వ్రాసి, ఆ పాత్రను బూజించి తరువాత నా గురుమూర్తి యొక్క పాద ద్వయమును ఆ నీటి పాత్రపై నుంచి తన ఐదు వ్రేళ్ళతో

మంత్రము :- 
ప్రథమం భస్మ సంస్కృతృ-ద్వితీయం మంత్రసం యుతాః । 
తృతీయం పాదస్పర్శాంచ - త్రివిధోద మితిస్మృతాః ॥

అను విధముగా వెనుక మడమ నుండి కుడిపాదంగుష్ఠము వరకు 3 సార్లు ఎడమ పాదంగుష్ఠము వరకు 3 సార్లు ఉదకమును స్పర్శించి, అట్టి పాదోదక పాత్రను (గ్లాసును) ప్రత్యేకించి ఉంచి, పిదప గురువు యొక్క ఇష్టలింగమును బూజించి, తరువాత పాదపూజను జేసికొనవలెను.

మంత్రము :- 
"అంగుష్ఠ భావయే ద్రుద్రం, తర్జన్యాం శంకరం స్మరేత్ । 
మధ్యమేచ మహాదేవం అనామికాయాం త్రియంబకం । 
కనిష్ఠ కామనాశంతు, పాదోపరి కపర్దినం ॥ 
పాదోధః పంచవదనం, గుల్ఫయోర్భిమభర్గకా । 
సర్వం లింగమయం ధ్యాత్వా, పాదం జంగమలింగినః" ॥

ఈ విధముగా భావించి తన ఎడమ హస్తమందు "ఓం" కారప్రణవమును వ్రాసికొని, గురువు యొక్క రెండుపాదములను ఎడమ హస్తముపై ఉంచుకొని, గురువు యొక్క కుడి పాదమును 5 వ్రేళ్ళపైన, ఎడమపాదము 5 వ్రేళ్ళపైన (నమఃశివాయ) అను పంచాక్షరములను వ్రాసి, పాదంగుష్ఠముల మధ్యలో (ఓం బసవ) అని వ్రాసి, ఆ గురుమూర్తి పాదములను భస్మము, గంధము, పత్ర పుష్పాక్షతాదులతో పూజ యొనర్చి, ముమ్మారు నమస్కారము గావించి, మంగళాష్టకముల నుచ్చరిస్తూ కర్పూరముతో నీరాజనలు మొనర్చి, టెంకాయనుగొట్టి నైవేద్యమును నివేదించి తదుపరి ధరించిన పుష్పములను దీసి మరల నమస్కార మొనర్చి క్రియాగిన్నెలో భస్మముతో షడక్షరీ మంత్రమును (ఓం నమశ్శివాయ) వ్రాసి ప్రత్యేకముగా ఉంచిన పాదోదకపాత్రను జేతిలోకి దీసికొని కుడి పాదంగుష్ఠముపై ఆరుసార్లు. "షడక్షరిమంత్రము" చేత ఈ పాదోదకమును ఎరచి, తదుపరి ఎడమ పాదంగుష్ఠముపైన 5 సార్లు పంచాక్షరీమంత్రముతో ఎరచి, ఆ మీదట పాదంగుష్ఠముల రెండిటి మధ్యన 3 సార్లు (బసవా) అను మంత్రముతో పాదోదకమును ఎరచి (పోసి-వడ్డించి) బాగుగా ద్రవమును దూడ్చి, ఒకే ఒక పుష్పాన్ని సమర్పించి పాదంగుష్ఠములపై న బెట్టి పూజించి నమస్కరించి, క్రియా పాదోదకము యొక్క పాత్రను (గిన్నెను) చేతితో మూసి యుంచుకొనవలెను. తరువాత గురువు 5 వ్రేళ్ళతో శివమంత్రము నుచ్చరించుచు పాదోదకమును 3 సార్లు తన లింగముపై యెరచి (పోసి-వడ్డించి) సావధానముతో స్వీకరించవలెను.

అథ గురుప్రార్థన

"హరహర ! కాలహర ! కర్మహర ! 

దురితహర ! మహా ప్రసాద, పూర్వజన్మ- 
కర్మ నివారణ, దీక్షా గురో, మోక్ష గురో; 
గురోర్గురో, వరమగురో, పరమారాధ్య, 
భో! మహాస్వామిన్ ! ప్రసీద, భవతః, 
పాదపద్మయోః, సాష్టాంగ నమస్కారం, 
కరోమి, దేహి తీర్థ స్వీకారార్థం అనుజ్ఞాం ॥

అని ప్రార్థించి ప్రణామం బాచరించి, పాదతీర్థమును స్వీకరించవలెను. అక్కడున్న వారందరు ఇదేవిధముగా ప్రార్థించి సాష్టాంగ ప్రణామం బాచరించి పాద తీర్థమును స్వీకరించవలెను.

శ్లో॥ 
ఉచ్ఛిష్టం కల్ప్యతే తస్మిన్, సోయా తినరకార్ణవం । 
గంగా ఇవ పవిత్రంతు, నిత్యం కైవల్యదాయకం ॥

తా॥ ఎవరైతే ఇట్టి పవిత్రమైన పాద తీర్థమునందు ఉచ్ఛిష్టమని (ఎంగిలి అని) భావింతురో అట్టివారు తప్పకుండా నరకమును బొందుదురు. ఈ పాదతీర్థము గంగా తీర్థమునకంటెను పవిత్రమైనదిగాను, శాశ్వతమైన ముక్తి నొసగునదిగాను, భావించవలెను.

ఇది పాదపూజా విధానము సమాప్తము.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow