గురువు

గురు లేదా గురువు (సంస్కృతంगुरुవిద్యను నేర్పువాడు. గురువును త్రిమూర్తుల స్వరూపంగా భావించడం, ఆరాధించడం హిందూ సంప్రదాయం. ప్రతి వ్యక్తి జీవితంలో గురువు పాత్ర గణనీయంగా ఉంటుంది. సంస్కృతంలో గు అనగా చీకటి/అంధకారం మరియు రు అనగా వెలుతురు/ప్రకాశం అని అర్థం. అనగా గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి బ్రహ్మవిద్య అనే ప్రకాశాన్ని అందించేవాడు. మతపరంగా గురువు అనేది మార్గదర్శి అన్న అర్థం వచ్చే విధంగా సిక్కుబౌద్ధహిందూ మతాలలో మరియు కొన్ని ఆధునిక మత చైతన్యాలలో ఉపయోగంలో ఉన్నాయి. గురు పూర్ణిమ నాడు గురువులను ప్రత్యేకంగా స్మరించి తరించడం మన ఆనవాయితీ. అన్ని జంతువులకు, మనుషులకు తల్లి (Mother) తొలి గురువు. గురుకుల విద్యా విధానంలో గురువు పాత్ర అత్యంత కీలకమైనది.[1]
ఆధునిక కాలంలో ఉపాధ్యాయులు (Teachers) మరియు ఉపన్యాసకులు (Lecturers) వివిధ దశల్లో విద్యాబోధన చేస్తున్నారు.
శాంతో దాంతః కులీనశ్చ వినీతః శుద్ధవేషవాన్
శుద్ధాచార సుప్రతిష్టః శుచిర్దక్షః సుబుద్ధిమాన్
ఆధ్యాత్మ జ్ఞాననిష్ఠశ్చ మంత్రతంత్ర విశారదః
నిగ్రహాన గ్రహేశక్తో గురురిత్యభి ధీయతే.
అనగా శాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, కులీనుడు, వినయవంతుడు, పరిశుద్ధుడు, ఆచార వంతుడు, మంచి వేషధారణగలవాడు, గౌరవనీయుడు, పవిత్రుడు, బుద్ధిమంతుడు, మంత్ర తంత్రములలో నిష్ణాతుడు, నిగ్రహానుగ్రహశక్తుడు అయినవాడు గురువు అనిపించుకుంటాడు.

భారతీయ గురు సంప్రదాయం

భారతదేశంలో ఆధ్యాత్మికంగాను, సామాజికంగాను గురువుకు చాలా ప్రాధాన్యత ఉంది. తల్లిదండ్రుల తరువాత గురువు అంతటివాడని మాతృదేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అనే సూక్తి చెబుతుంది. గురువును ప్రత్యక్ష దైవముగా పూజించుట ఒక ఆచారము. విద్యాభ్యాసం తరువాత గురుదక్షిణ ఇవ్వడం కూడా సనాతన కాలంలో ఆచారంగా ఉంది. నిత్య ప్రార్థనలలో గురువును, గురుపరంపరను స్తుతించడం ఒక ఆచారం.
భారతదేశంలో అనాదిగా గురు పరంపర వస్తూనే ఉంది. గురు సంప్రదాయానికి మూల పురుషుడు సదాశివుడు. ఆయనను దక్షిణామూర్తిఅన్నారు. కుమారస్వామి కూడా గురువు. విశ్వామిత్రుని వద్ద రామలక్ష్మణులు, సాందీపుని వద్ద బలరామకృష్ణులుపరశురాముని వద్ద భీష్ముడుద్రోణుని వద్ద అర్జునుడు, గోవింద భగవత్పాదాచార్యుని వద్ద ఆదిశంకరులువీరబ్రహ్మంగారి వద్ద సిద్దయ్యరామకృష్ణ పరమహంసవద్ద వివేకానంద స్వామి - ఇలా ఎందరో గురుకృపతో ధన్యజివులైనారు. దత్తాత్రేయునిషిర్డీ సాయిబాబాను "గురువు" అని ప్రస్తావించడం సాధారణం.

గురువును స్మరించే కొన్ని ప్రసిద్ధ శ్లోకాలు

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలనం యేన తస్మై శ్రీ గురవే నమః

గురువుపట్ల ఎలా మెలగాలో ఈ పద్యాలు చెబుతున్నాయి.

గురుమూర్తి వచ్చుచో గూర్చుండరాదు గురుశిష్యులొకశయ్య గూర్కరాదు
ముందుగా దనయంత భుజియింపగారాదు పోరి దొంగత్రోవల బోవరాదు
గురునింద వినరాదు కూడి సేయగరాదు గురునికప్రియమును గూర్చరాదు
సద్గురువిడిన శాసనము మీరగరాదు హెచ్చిదా గురుని శాసింపరాదు
గురుడు బోధింపనెంచిన నురుగరాదు అతడు బోధింపకుండిన నడుగరాదు

శ్రీగురుమూర్తి చేరినంతనె నమస్కారము ముందుగా సలుపవలయు
లజ్జాభిమాన కులంబు వీడి పాదచారియై సద్భక్తి చేరవలయు
సుతుడైన హితుడైన సోదరుడైనను గులహీనుడైన కొలువవలయును
గురునాజ్ఞ వర్తించి గురుడిచ్చు తృణమైన మేరువుగా నెంచి మెలగవలయును
గురుని ప్రభువంచు స్వామి దేవర యటంచు బిలుచుచు లోభ గుణముల దొలచవలయును
గురువులలో రకాలు సాయిబాబా జీవిత చరిత్రలో తన గురువుగురించి వ్రాసిన విషయాలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి - "ఆయన నాకేమియు బోధించలేదు. కేవలం నన్ను ప్రేమతో చూసేవాడు. ఆ చూపునకే నాకు సకల విషయాలు అవగతమయ్యేవి"
"శ్రీకైవల్యసారథి" అనే పుస్తకంలో డాక్టర్ క్రోవి సారథి ఇలా వ్రాశాడు[2]. -
"ఏ మహాత్ముని రూపం నీకు మదిలో నిలిచిపోతుందో,
ఏ సన్యాసి నీకు స్వప్నంలో కూడా కనిపించి సన్మార్గాన్ని బోధిస్తాడో,
ఏ సాధువు చెప్పిన ధర్మసూత్రాలు నీ మదిలో నిలిచిపోతాయో,
ఏ మహనీయుని దగ్గరకు వెళ్ళగానే నీ సందేహాలు నివృత్తి అవుతాయో,
ఏ వ్యక్తి దగ్గర నీకు ప్రశాంతత, ఆనందము కలుగుతాయో,
ఏ వ్యక్తిమీద నీకు నమ్మకము, గురి కలుగుతాయో ...
ఆ మహనీయుడే నీకు గురువు"
ఏడు రకాల గురువులు శాస్త్రాలలో చెప్పబడ్డారు.
  1. సూచక గురువు - చదువు చెప్పేవాడు
  2. వాచక గురువు - కుల, ఆశ్రమ ధర్మాలను బోధించేవాడు
  3. బోధక గురువు - మహామంత్రాలను ఉపదేశించేవాడు
  4. నిషిద్ధ గురువు - వశీకరణ, మారణ ప్రయోగాళు నేర్పేవాడు
  5. విహిత గురువు - విషయ భోగముల మీద విరక్తి కలిగించేవాడు
  6. కారణ గురువు - జీవబ్రహ్మైక్యాన్ని బోధించేవాడు
  7. పరమ గురువు - జీవాత్మ, పరమాత్మ ఒకటే అని ప్రత్యక్షానుభవాణ్ని కలిగించేవాడు.
గురువులు ఇచ్చే దీక్ష నాలుగు రకాలని చెబుతారు -
(1) స్పర్శదీక్ష (2) ధ్యాన దీక్ష (3) దృగ్దీక్ష (4) మంత్రదీక్ష.

గురు పూర్ణిమ.. ఆది గురువు ఆవిర్భవించిన తొలి రోజు!

ఏ వ్య‌క్తికైనా మొద‌టి గురువు త‌ల్లే. ఆ త‌ర్వాత‌ మనకు జ్ఞానాన్ని అందించి... ఏది మంచో, ఏది చెడు చెప్పే వారు గురువులు. అలాంటి గురువులని పూజించడం కోసం నిర్ణయించిన తిథి గురు పౌర్ణిమ‌. ‘గు’ అంటే అంధ‌కారం లేదా అజ్ఞానం, ‘రువు’ అంటే నిరోధించుట లేక నశింప చేయుట లేదా పారద్రోలుట అని అర్థం. అంటే గురువు అనే ప‌దానికి అజ్ఞానాన్నినశింప చేయువారు అని అర్థం స్ఫురిస్తుంది. అజ్ఞానం అనే చీకట్లు తొలగించి మనలో జ్ఞానం జ్యోతిని వెలిగించే మహోన్నత వ్యక్తి. ‘గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవేనమః’అంటూ భారతీయ సంస్కృతి గురువును త్రిమూర్తులతో పోల్చింది. 

 

గురువూ, భగవంతుడూ ఒకేసారి దర్శనమిస్తే ముందు ఎవరికి నమస్కరించాలి? అనే ప్రశ్న ఉత్పన్నమైతే భగవంతుణ్ణి చూపించినవాడు గురువు, అందుకే ఆయన పాదాలకే ముందు ప్రణమిళ్లాలని చెబుతోంది. మన సంస్కృతిలో గురువుకి చాలా ఉన్నత స్ధానం ఇచ్చింది. కేవలం తమ గురువునే కాదు, గురు పరంపరని అంటే తన గురువుని (స్వ గురువు), గురువుగారి గురువుని (పరమ గురువు), వారి గురువును (పరమేష్ఠి గురువు) కూడా ఆరాధిస్తారు. సాధారణంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవారిని గురువు అంటారు. ఆ జ్ఞానాన్ని ఆకాంక్షించేవారు తమ గురువులతో జీవితాంతం అనుబంధం కొనసాగిస్తారు. కొన్ని చోట్ల ఈ బంధం తరతరాల వరకూ కొనసాగుతుంది. 

వేదవ్యాసుడిని భారతీయులు తమ ఆది గురువుగా కొలుస్తారు. దీనికి ఆయన మనకు అందించిన ఆధ్యాత్మిక వారసత్వమే కారణం. సత్యవతి, పరాశుర మహర్షి కుమారుడైన వ్యాసుడు అసలు పేరు వైశంపాయనుడు. వేదాలను నాలుగు భాగాలుగా విభజించాడు గనుక వేద వ్యాసుడయ్యాడు. పంచమ వేదంగా పేర్కొనబడే మహా భారతాన్ని రచించాడు. నాలుగు వేదాలను నలుగురు శిష్యుల ద్వారా ప్రచారం చేశాడు. భగవద్గీతను బోధించిన శ్రీ కృష్ణుడు ప్రపంచానికి గురువైతే, శక్తివంతమైన సంస్కృతి, దానికి అవసరమైన వాజ్ఞ్మయాన్నీ ప్రపంచానికి అందజేసిన వ్యాసుడూ గురువే. వేదవ్యాసుడిని శ్రీమహా విష్ణువు అవతారంగా పరిగణిస్తారు. అందుకే వ్యాసుని గురువులందరికీ గురువుగా, ఆది గురువుగా భావించి, ఆయన పుట్టిన రోజైన ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా గుర్తించి, ఆయననీ, తమ గురువులను పూజించి, వారి ఆశీస్సులు తీసుకుంటారు. 

ఆషాఢ మాసం నుంచి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. సన్యాసాశ్రమం స్వీకరించినవారు ఆశ్రమ ధర్మంగా ఎక్కడా ఒక చోట ఎక్కువ కాలం గడపరు. కానీ వర్షాకాలంలో వానల వల్ల ఇబ్బందులు, ఆ సమయంలో అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. అందుకే సాధారణంగా వీరు ఆషాఢ పౌర్ణమి నుంచి నాలుగు నెలల చాతుర్మాసం పాటిస్తారు. అంటే తాత్కాలికంగా ఎక్కడో ఒక చోటే ఉంటారు. ఆ సమయంలో శిష్యులు వీరి దగ్గర జ్ఞాన సముపార్జన చేయడానికి వచ్చేవారు. ఆ సందర్భంగా మొదటి రోజైన ఆషాఢ పౌర్ణమినాడు గురు పూజ చేసేవారు. ఆ ఆచారం ప్రకారం ఈ పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు అని కొందరి అభిప్రాయం.

 





#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!