బిందుమండలవాసినీ

P Madhav Kumar

 ఎనిమిది అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు”బిందుమండలవాసిన్యై నమః” అని చెప్పాలి.

బిందుమండల = బిందువును పరివేష్టించి యుండు స్థానము,

వాసినీ – వసించునది.


శ్రీ చక్రంలోని కేంద్ర గతమైన బిందువు సర్వానందములకు, సర్వచక్రాలకు, మాతృకావర్ణాలకు కారణ స్వరూపము. ఇక్కడ వసించే అమ్మవారిని ‘ బిందు మండలవాసినీ’ ఆంటారు.

మనలో బ్రహ్మరంధ్రానికి క్రిందుగా వుండే చంద్రమండలాన్నే బిందుమండలం అంటారు. అక్కడ వుండే అమ్మవారినే ‘ బిందుమండల వాసినీ’ అంటారు.

జాలంధర, ఓడ్యాణ పీఠ, బిందుమండలాలు సూచించే స్థానాలు వరుసగా ప్రేమకు, జ్ఞానానికి, ఆనందానికి నిలయాలు. ఇవే – హృదయము, భ్రూమధ్యము, బ్రహ్మరంధ్ర ప్రాంతాలు. వీటినే సత్, చిత్, ఆనంద స్థితులుగా సమన్వయ పరచుకోవచ్చును.


నిరాకారుడు నిర్గుణస్వరూపుడు పరబ్రహ్మ. అతడు బిందురూపంలో ఉన్నాడు. ఆ బిందువే కాలవశమున భిన్నమై వివిధ రూపాలు పొందింది. రహస్యాగమములో ఈ విషయాన్ని వివరిస్తూ “కాలవశమున భిన్నమైనటువంటి ఆ బిందువు మూడు భాగాలయింది. అవే 1. స్థూల 2. సూక్ష్మ 3. పరములు. అవి కారణబిందువుతో కలిసి నాలుగు భాగాలవుతున్నాయి. అవి. 1. ఆదిదైవము 2. అవ్యక్తేశ్వరము 3. హిరణ్యగర్భుడు 4. విరాట్స్వరూపము


1. శాంతా 2. వామా 3. జ్యేష్టా 4.రౌద్రీరూపములు

1. అంబిక 2. ఇచ్చా. 3.జ్ఞాన 4. క్రియాశక్తులు

1. ఆదిదైవము 2. అవ్యక్తేశ్వరము 3. హిరణ్యగర్భుడు. 4. విరాట్స్వరూపము

1. కామగిరిపీఠము 2. పూర్ణగిరిపీఠము 3.జాలంధరపీఠము 4. ఓడ్యాణపీఠము అని చెప్పబడింది.


ఆధారచక్రంలో ఉండేది కుండలినీశక్తి. అదే చరాచర జగత్తుకూ కారణము అని తెలిసినవాడికి మరుజన్మ ఉండదు అని నిత్యాహృదయంలో చెప్పబడింది. ఇప్పుడు ఆ పరమేశ్వరి కామగిరి, పూర్ణగిరి,జాలంధర, ఓడ్యాణ పీఠాల యందు ఉంటుంది. మానవదేహంలోని షట్చక్రాలలోను, శ్రీచక్రంలోని ఆవరణలలోనూ ఈ పీఠాలు నిరూపించబడ్డాయి.


గౌడపాదులవారు తమ సుభగోదయస్తుతిలోని 10వ శ్లోకంలో

త్రికోణం చాధారం త్రిపురవినుతే ! షారమనఘే !

భవే త్స్యాధిష్టానం పున రపి దశారం మణిపురం

దశారం తే సంవిత్కమల మథమన్వస్రక ముమే

విశుద్ధం స్వాధాజ్ఞ శివితి తతో బైందవగృహమ్

షట్చక్రాలకి శ్రీచక్రంతో ఐక్యత చెప్పబడింది.


1. ఆధారచక్రానికి – త్రికోణంలో ఐక్యత

2. స్వాధిష్టానానికి అష్టకోణంలో ఐక్యత

3. మణిపూరానికి అంతర్దశారంతో ఐక్యత

4. అనాహతానికి బహిర్ధశారంతో ఐక్యత

5. విశుద్ధిచక్రానికి చతుర్దశారంతో ఐక్యత

6. ఆజ్ఞాచక్రానికి అష్టదళము, షోడశ దళములతో ఐక్యత

7. సహస్రారానికి భూపురంలో ఐక్యత ఇందులో బ్రహ్మరంధ్రమే బిందువు. కాబట్టి

కామగిరిపీఠం – ఆధారచక్రం –

త్రికోణం పూర్ణగిరిపీఠం –

అనాహతము – బహిర్గశారం

జాలందరపీఠం – ఆజ్ఞాచక్రము –

అష్టదళ, షోడశదళాలు ఓడ్యాణపీఠం –

బ్రహ్మరంధ్రం – బిందువు

ఈ విషయాన్ని యోగినీహృదయంలోని చక్రసంకేతంలో 41వ శ్లోకంలో వివరిస్తూ భాసనాద్విస్య రూపశ్య స్వరూపే బాహ్యతో పిచ ఏతాశ్చ తస్రః శక్తస్తుకా – పూ – జా – ఓ – ఇతిక్రమాత్ పీఠాః కందే పదే రూపే రూపాతీతే క్రమాస్థితాః

విశాల విశ్వానికి మానవదేహానికి సమానరూపత్వమున్నది. బ్రహ్మాండమే – విశాలవిశ్వము, పిండాండమే – మానవశరీరము. ఈ రెండు సమిష్టి, వ్యష్టి శరీరాలు. బ్రహ్మాండంలో ఉన్న అవయవాలే పిండాండంలో కూడా ఉన్నాయి. అందుచేత అంబికా, ఇచ్ఛా,జ్ఞాన, క్రియాశక్తులు

కా – పూ – జా – ఓ అనే పేర్లు గల పీఠాలయినాయి.

1. కా – కామగిరిపీఠము 2. పూ – పూర్ణగిరిపీఠము

3. జా – జాలంధరపీఠము 4. ఓ – ఓడ్యాణపీఠము

ఈ పీఠాలన్నీ నదీతీరాలయందున్నాయి. ఇప్పుడు పిండాండమందు అంటే మానవశరీరంలో

1. కందం – సుషుమ్నానాళము – మూలాధారము

2. పదం హృదయము – అనాహతము

3. రూపం – బిందువు – ఆజ్ఞాచక్రము

4. రూపాతీతం – కళలకు అతీత – బ్రహ్మరంధ్రము

ఈ పీఠాలలోనే అంబికా మొదలైన శక్తులున్నాయి.


1. కామగిరి పీఠం వాగ్భవబీజము, త్రికోణంలోని అగ్రకోణం వామాశక్తి ఆధారచక్రము

2. పూర్ణగిరిపీఠము త్రికోణంలోని దక్షిణ కోణము. కామరాజు బీజము, జ్యేష్ఠాశక్తి అనాహతము

3. జాలంధరపీఠము త్రికోణంలోని ఉత్తరకోణము. శక్తి బీజము, రౌద్రిశక్తి, ఆజ్ఞాచక్రము

4. ఓడ్యాణపీఠము త్రికోణంలోని బిందువు. అన్నిబీజములు,అంబికాశక్తి, బ్రహ్మరంధ్రము


చతురస్రం తథా బిందు షట్క యుక్తం చ వృత్తకమ్ |

అర్ధ చంద్రం త్రికోణం చ రూపాణ్యేషాం క్రమేణతు |

పీతో ధూమ్ర స్తథాశ్వేతో రక్తో రూపం చ కీర్తితమ్ ||


ఈ పీఠాలు క్రమంగా పృథివీ, వాయు, జల, అగ్ని రూపాలని వివరించబడుతోంది.

1. కామగిరి పీఠము – భూపురము, భూతత్త్వము, పీతవర్ణము

2. పూర్ణగిరి పీఠము – షడ్భిందువులచే ఏర్పడిన వృత్తము, వాయుతత్త్వము,ధూమ వర్ణము

3. జాలంధర పీఠము – అర్థచంద్రాకారము, జలతత్వము, శ్వేత వర్ణము.

4. ఓఢ్యాణ పీఠము – త్రికోణము, అగ్ని తత్త్వము, రక్త వర్ణము.


మనలో పెరిగే ఔన్నత్యం కి సంస్కారానికి బిందు రూపంలో ఉంటుంది. దానిని వినియోగించుకోవడం మన వివేకం, క్రమశిక్షణ మీద ఉంటుంది. ఆ పరాశక్తి సర్వానందమయస్థానం మనలోని బ్రహ్మరంద్రం..

శ్రీ చక్రంలోని అన్ని కోణాలు, దళాలు, మాతృకావర్ణాలు ,సమస్తం బిందువు నుండే ఉంద్భవించింది సృష్టి కార్యం కోసం తననే పరమేశ్వరుడు గా ,ప్రకృతిగా విభజన చేసుకుని సృష్టిలోనికి వ్యక్త పరంగా మానవ దేహం లోనికి ప్రవేశించిన పరాశక్తి స్థానం అది…మనిషిలో బ్రహ్మరంద్రానికి కింద ఉండే చంద్ర మండలాన్ని బిందు మండలం అంటారు..ఈ మండలంలో ఉండి బ్రహ్మానందమును ,జయ విజయములు ప్రేమను లోక కళ్యాణముతో కూడిన దక్షతను కార్యసాధన సమర్థతను, అందించే శక్తిగా చైతన్యం గా నివసిస్తుంది. ఒక సంకల్పమ్ కలగడం దగ్గర నుండి అది నెరవేరే వరకు ప్రాణాళికగా ఉంటూ సాధకునికి ఉత్కృష్ట స్థానం పొందే మార్గం చూపిస్తూ నడిపించే శక్తే బిందుమండలవాసిని.


🌷ఫలస్తుతి🌷


ఎంతో విలువైన నామ మంత్రం,ఈ నామ జపం వల్ల జ్ఞానం పెరుగుతుంది ఏకాగ్రత ప్రశాంతత.. శాశ్వత మైన సంపద దక్కుతుంది. చక్కటి సంతానాన్ని పొందడానికి కానీ ఒక కార్యాన్ని సమర్ధవంతంగా నిర్వహించడానికి.. ఈ నామ మంత్రాన్ని ధ్యానం చేయాలి. గుర్తింపు కోసం పదోన్నతి కోసం , ఉపాసకులకు త్వరగా ఏకాగ్రత కలగడం కోసం ఈ నామ మంత్రాన్ని ధ్యానం చేయాలి..కుటుంబ లో విలువలేదు ఎవరు తమ కష్టాన్ని గుర్తించడం లేదు అని బాధపడే వారు ప్రతి శుక్రవారం పానకం నైవేద్యం పెట్టి సహాస్ర నామంతో సంపుటికరణ చేస్తే కుటుంబ పరిస్థితి చక్కబడి మనశాంతి కలుగుతుంది.


🙏ఓం ఐం హ్రీం శ్రీo బిందుమండలవాసిన్యై నమః🙏


🌷శ్రీ మాత్రే నమః🌷

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat