*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 26*

P Madhav Kumar


కొన్ని రోజుల తరువాత నారాయణపురం నుండి ఒక సేవకుడు పద్మావతీ శ్రీనివాసుల వద్దకు వెళ్ళి ‘‘ఆర్యా! ప్రభువులైన మా ఆకాశరాజుగార్కి అకస్మాత్తుగా జబ్బుచేసినది. వారు ప్రమాద పరిస్థితిలో ఉన్నారు. మహారాజుగారు మీ యిద్దరినీ చూడాలని ఉందని కలవరిస్తున్నారు’’ అన్నాడు. 


పద్మావతీ, శ్రీనివాసులు చాలా అందోళన పడ్డారు. అగస్త్య మహామునిని వెంటబెట్టుకొని వారిరువురూ విచారముతో నారాయణపురానికి వెళ్ళారు.


నారాయణపురము పద్మావతి, శ్రీనివాసులు చేరేటప్పటికి ఆకాశరాజు స్పృహకోల్పోయి ఉన్నాడు. శ్రీనివాసుడు మామగారిని సంబోధించి మాట్లాడడంతో ఆకాశరాజు తేరుకొని కళ్ళువిప్పి చూసాడు. చూస్తే ఎదురుగా పద్మావతి, శ్రీనివాసులు కనిపించారు. అందోళన నిండిన ముఖముతో ధరణీదేవి కూడా కనిపించింది.


అంతమ ఘడియలలో ఉన్నప్పటికీ ఆకాశరాజు లేని ఓపిక తెచ్చుకొన్నాడు. శ్రీనివాసునితో ఆకాశరాజు సర్వసృష్టినీ సృష్టించిన సృష్టికర్తనే సృష్టించిన ఓ ఆదిపురుషా! జగన్నాథా! గోవిందా! నారాయణా! అంతిమ కాలములో నిన్ను నేను దర్శించడము జరిగినది. 


ఇంతకన్న నాకు కావలసినది మరియొకటి యేముంటుంది? సర్వేశ్వరా నాకు కోరికలేమీ లేవు. ఒక్క విషయములో మాత్రమే నిన్ను ప్రార్థిస్తున్నాను. 


నా కుమారుడైన వసుదాముడూ, నా సోదరుడైన తొండమానుడూ అభమూ, శుభమూ తెలియనివారు. 


వారి విషయమై మాత్రమే నాకు బెంగ, నీవు వారిద్దరినీ జాగ్రత్తగా చూచుకొనుమని కోరుచున్నాను’’ అని పలికి కుమార్తె అయిన పద్మావతిని ‘‘అమ్మా! ఇలారా నా జన్మ తరించిపోయినది నీవంటి కుమార్తెను పొందగలిగినందులకు నేనే అనేక విధాలుగా గర్విస్తున్నాను. ఇంక మనకు ఋణము తీరిపోయిందమ్మా! సుఖముగా శాంతిగా ఉండమ్మా అని అంటూ, ప్రాణాలు విడిచి కీర్తిశేషుడయ్యాడు.


పద్మావతీ, ధరణీదేవి ఒక్కసారిగా గొల్లుమన్నారు. ఆకాశరాజునకు దహన సంస్కారము చేశారు. ధరణీదేవి స్వర్గానికి వెళుతూన్న భర్తను అనుసరించడానికి నిశ్చయించుకొని సహగమనము చేసినది. తరువాత పద్మావతీ శ్రీనివాసులు అగస్త్యునితో ఆయన ఆశ్రమమునకు వెళ్ళిపోయారు.


*తొండమానుని పూర్వజన్మ వృత్తాంతము:*


తొల్లి వైఖానసుడు అనే ఒక భక్తుడుండేవాడు. అతడు శ్రీకృష్ణభగవానుని స్వయముగా చూడాలనే కోరికతో ఉండేవాడు. 


నిద్రాహారములు లేక, అచంచలదీక్షతో కృష్ణభగవానుని గూర్చి ఎన్నోయేండ్లూ తపస్సు చేశాడు. శ్రీమహావిష్ణువు ఆతనికి దర్శనభాగ్యము కలుగజేశాడు. ప్రత్యక్షమై భక్తశ్రేష్ఠా! నీకు కావలయునదేమిటో కోరుకొను మిచ్చెదను’’ అన్నాడు. 


కన్నులు తెరచి వైఖానసుడు శ్రీమన్నారాయణుని దివ్యదర్శనముచేసి స్వామి పాదములకు సాష్టాంగ దండప్రణామము లాచరించి ’’స్వామీ! కరుణాసాగరా! నాకు యితరమైన కోరికలేమీ లేవు కాని, నీ శ్రీకృష్ణావతారము నేత్రానందముగా చూచి తరించాలని ఉన్నది’’ అనెను.


 అందులకు శ్రీమహావిష్ణువు ‘‘నాయనా వైఖానసా నీవు యిప్పుడు శ్రీకృష్ణదర్శనము చేయాలని కోరుకుంటే వీలుపడదు. కాని, యిప్పుడు శేషాచలముపై కృష్ణుడే శ్రీనివాస రూపములో ఒక పుట్టలో నున్నాడు. నీవు అతనిని పూజించవలసినది’’ అన్నాడు.


తరువాత శ్రీమహావిష్ణువు అంతర్థానమయ్యాడు. వైఖానసుడు అక్కడ నుండి శేషాచలానికి బయలుదేరాడు. మార్గములో అతనికి రంగదాసుడనే ఒక భక్తుడు కలసినాడు. వైఖానసుడు తాను శేషాచలము మీదనున్న శ్రీనివాసుని సేవించ వెడుతున్నాననీ చెప్పగా, రంగదాసు తానున్నూ శ్రీనివాసుని సేవించ వెడుతున్నానని చెప్పెను.


వారిరువురు కలసి శేషాచలాన్ని అధిరోహించారు. వైఖానుసుడు ఒక పుట్ట దగ్గరకు వెళ్ళి అందున్న భగవానునీ పూజించాలనుకొన్నాడు. పూవులు కావలసివచ్చాయి. అప్పుడు వైఖానసుడు రంగదాసునితో ‘‘శ్రీనివాసుని పూజించడానికి పూవులు కావాలి కదా! అందుచే నీవు ఒక పూలతోటను పెంచవలసినది’’ అని కోరాడు.


రంగదాసు అలాగేనని పూలతోటకు నీరు చాలా ముఖ్యము కనుక, నీటికై ఒక బావిని త్రవ్వించాడు. దాని పేరు పూలబావిగ అయింది, ఆ బావిలోని నీటితో మొక్కలను పెంచి, ఆ మొక్కలను పూలను ప్రతి దినమూ శ్రీనివాసుని పూజకొరకై వైఖానసునకు యిచ్చుచుండెను. 


ఒకనాడు ఒకానొక గంధర్వరాజు స్వామి పుష్కరిణిలో జలక్రీడ లాడడానికై తనసతులతో సహితము వచ్చినాడు. అక్కడికి పూవుల కొరకై వచ్చిన రంగదాసు ఆ జలక్రీడలను చూచి చిత్తచాంచల్యము పొందినవాడై స్వామి పూజా సమయము కూడా మరచిపోయాడు.


గంధర్వులు వెళ్ళిన తరువాత, రంగదాసు తన పని గ్రహించినవాడై పూవులు తీసుకొని వైఖాసముని వద్దకు వచ్చాడు.


వైఖానసముని ‘‘ఏమిటి యింత ఆలస్యమయిన’’దని గద్దించి అడిగాడు. ఉన్నదున్నట్లు చెప్పాడు రంగదాసు పూజకు తాను చేసిన ఆలస్యానికి బాధపడుతూ క్షమించమని వేడుతూ రంగదాసు శ్రీనివాసుని అనేక విధాల ప్రార్థించాడు. ప్రార్థించగా శ్రీనివాసుడు ప్రత్యక్షమయి ‘‘ఓయీ రంగదాసా! చేసిన దానికి విచారింపకుము. నీవు నాయొక్క మాయా మోహము వల్లనే గంధర్వుల జలక్రీడల్ని చూసి భ్రాంతిలో పడినావు. యీ శరీరము విడిచి నారాయణపురము రాజైన సుధర్ముడికి కుమారుడవు అయ్యెదవు గాక, తొండమానుడు అను నామధేయముతో రాజ్యసుఖములన్నీ అనుభవింతువు గాక’ అని చెప్పాడు.


ఆ రంగదాసే ఆకాశరాజునకు తమ్ముడైన తొండమానుడుగా పుట్టాడు.*నిత్య శుభ ప్రద గోవిందా, నిత్య కళ్యాణ గోవిందా, ఆనంద రూప గోవిందా, ఆద్యంత రహిత గోవిందా; |* 


 *గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా. ||26||* 


శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలలలో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.


*జై శ్రీమన్నారాయణ*

*ఓం నమో వేంకటేశాయ*

🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat