Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 1


*ప్రథమ చరిత్రము*


*మహాకాళీ ధ్యానమ్*


ఖడ్గం చక్రగదేషుచాపపరిఘాన్ శూలం భుశుభ్రం శిరః

శబ్దం సన్దధతీం కరైస్తినయనాం సర్వాజ్ఞభూషావృతామ్ |


యాం హద్దుం మధుకౌటభౌ జలజభూస్తుష్టావ సుపై హరౌ

నీలాశ్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికామ్ ||


ఖడ్గము, చక్రము, గద, ధనుర్బాణములు, ఇనుపకట్ల గుదియ, శూలము, భుశుండి, (మానవ) శిరస్సు, శంఖము: వీటిని (పది) హస్తములలో ధరించి, మూడు కన్నులతో, ఆభరణాలతో కప్పబడిన సర్వాంగాలతో భాసించే తల్లి; శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు మధుకైటభులు అనే అసురులను వధించడానికి బ్రహ్మదేవునిచేత స్తుతింపబడిన దేవి; ఇంద్రనీలమణి వంటి శరీరకాంతి కలిగి, పది ముఖాలు, పది పాదాలతో విరాజిల్లే తల్లీ అయిన మహాకాళికా దేవిని నేను సేవించుచున్నాను.


*అధ్యాయము - 1*


*మధు కైటభుల వధ వర్ణనము - 1*


మార్కండేయుడు తన శిష్యుడగు క్రసుష్టుకి భాగురితో పలికెను :


సూర్యపుత్రుడైన సావర్ణిని ఎనిమిదవ మనువు  అంటారు. విఖ్యాతుడైన ఈ సావర్ణి యొక్క ఉత్పత్తిని సవిస్తరముగా తెలియజేస్తాను. మహామాయ* యొక్క అనుగ్రహంతో ఇతడు ఎనిమిదివ మన్వంతరానికి ఏ విధంగా అధిపతి అయ్యాడో విను. 


పూర్వం, స్వారోచిష మన్వంతరంలో చైత్ర  వంశీయుడైన సురథుడు అనే ఒక రాజు భూమండలం అంతటిని పరిపాలిస్తుండేవాడు. సర్వ జనులను తన సొంత బిడ్డలవలే పాలిస్తూ ఉండగా, కోలలను విధ్వంసమొనర్చిన రాజులు ఈ సురథునికి శత్రువులైయ్యారు.


ప్రబలాయుధాలు గల ఈ సురథుడు కోలా విధ్వంసులతో యుద్ధం చేసాడు. కాని వారు అల్పసంఖ్యాకులు అయినా కూడా సురథుణ్ణి ఓడించారు. అప్పుడు అతడు తన పురానికి తిరిగివచ్చి తన దేశాన్ని పాలిస్తుండుగా, ఆ ప్రబల శత్రువులు ఈ రాజపుంగవుణ్ మళ్ళీ

ఓడించారు. 


పిమ్మట తన పురంలో కూడా దుర్బలుడై ఉన్న ఈ రాజు వద్దనుండి ప్రబలులు, దుష్టులు, దురాత్ములు అయిన అతని మంత్రులు రాజకోశాగారాన్ని (బొక్కసాన్ని), సైన్యాన్ని కూడా అపహరించారు. అంతట రాజ్యాన్ని కోల్పోయిన ఈ భూపాలుడు వేటాడే మిషతో గుఱ్ఱం ఎక్కి దట్టమైన అరణ్యానికి ఒంటరిగా వెళ్ళిపోయాడు. 


ఆ అరణ్యంలో అతడు ప్రశాంతమైన, అడవి మృగాలకు నిలయమై మునిశిష్యులతో విరాజిల్లుతున్న, బ్రాహ్మణశ్రేష్ఠుడైన మేధసుని ఆశ్రమాన్ని చూసాడు. మునీంద్రునితో సత్కరించబడి, సురథుడు ఆ ఆశ్రమంలో సంచరిస్తూ కొంతకాలం గడిపాడు. 


అప్పుడు మమత్వంచేత ఆకర్షింపబడ్డ మనస్సు ఆకర్షింపబడ్డ మనస్సు గలవాడై అతడు తలపోయసాగాడు : ఇలా 


నా పూర్వుల పరిపాలనలో ఉండి ఇప్పుడు నేను కోల్పోయిన పురం దుశ్చరితులైన నా భృత్యుల చేత ధర్మమార్గంలో పాలింపబడుతున్నదో లేదో ఎరుగను. 


శౌర్యశీలమై సదా మదించి ఉండే నా ప్రధానహస్తి (పట్టపుటేనుగు) నా వైరులకు చిక్కి ఇప్పుడు ఎట్టి భోగాలను పొందుతున్నదో ఎరుగను. 


నాకు నిత్యానుగతులై (ఎల్లప్పుడు నా వెంటనుండి సేవిస్తూ) నా పద్ద అనుగ్రహాన్ని, ధనాన్ని, భోజనాన్ని పొందినవారు ఇప్పుడు ఇతర రాజులను సేవించడం తథ్యం.  నేను అతికష్టంతో ఆర్జించిన కోశాగారం (ద్రవ్యము) అంతా దుర్వ్యయశీలురైన వారిచే నాశనం చేయబడుతుంది.”


ఎల్లప్పుడూ ఈ విషయాలను గూర్చి, అన్య విషయాలను గూర్చి చింతిస్తూ ఉన్న రాజు ఆ విప్రుని ఆశ్రమ సమీపంలో ఒక వైశ్యుణ్ణి చూసాడు. 


 *సశేషం.........*

📢 Follow