తిరుమల హుండీ

P Madhav Kumar


Part - 37


⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️

తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న హుండీ తిరుమల హుండీగా సుప్రసిద్ధం. వడ్డీకాసుల వాడు, ఆపదమొక్కుల వాడు అని పేరొందిన తిరుమల వేంకటేశ్వరునికి భక్తులు ధనకనకాలను గురించి మొక్కుకుని వాటిని తీర్చుకునేందుకు వచ్చి హుండీలో వేయడం పరిపాటి. 


ప్రపంచవ్యాప్తంగా వాటికన్ తర్వాత అంతటి ఆదాయం కలిగిన ప్రార్థనాస్థలంగా తిరుమల ప్రసిద్ధి కలిగింది.


తిరుమలలో కొలువైన వేంకటేశ్వరస్వామికి భక్తుల్లో ఉన్న వడ్డీకాసులవాడు, ఆపదమొక్కులవాడు వంటి పేర్లు ధనరూపంగా ఆయన హుండీలో మొక్కు చెల్లించుకోవడాన్ని సూచిస్తాయి. 


పౌరాణిక గాథల ప్రకారం శ్రీనివాసుడు పద్మావతిదేవిని వివాహం చేసుకునేందుకు తన వద్ద డబ్బులేకుంటే పెళ్ళిఖర్చుల కోసం ఇక్కట్లు పడ్డాడు. 


లక్ష్మిదేవిని వైకుంఠంలో విడిచి రావడంతో ఆయనకు సంపదలేకపోయింది. పెళ్ళికి అవసరమైన డబ్బు కుబేరుడు వేంకటేశ్వరునికి అప్పుపెట్టారు. వేంకటేశ్వరస్వామి ఆ బాకీ తీర్చలేకపోగా ఏటేటా వడ్డీ మాత్రం తీరుస్తున్నాడు. ఆ వడ్డీ డబ్బును ఈ హుండీ సొమ్ములోంచే ఇస్తున్నాడని ప్రతీతి.


ఆపదలు వచ్చినప్పుడు మొక్కులు మొక్కుకుంటే ఆయన తీరుస్తాడని నమ్మిక. ఒంటిపై వేసుకుని వచ్చిన బంగారం, సొమ్ముతో పళంగా పర్సు మొత్తం హుండీలో వేసేయడాన్ని నిలువు దోపిడీ అని వ్యవహరిస్తారు. 


తిరుపతిలో నిలువు దోపిడీ చెల్లించుకుంటానని మొక్కుకుని, మొక్కు తీర్చుకుంటూంటారు. శంకరాచార్యులవారు తిరుమల యాత్రలో శ్రీవారి హుండీ క్రింద 'శ్రీచక్రం' ప్రతిష్టించారని ఒక ప్రతీతి. 


1950 వ దశకం లో ఆలయ జీర్ణోద్దారణ సమయంలో పూర్వం నేలపై వున్న రాళ్ళను (ప్లోరింగ్) తొలగించి కొత్త రాళ్ళను వేసే సమయం లో ఆ శ్రీచక్రాన్ని అలానే వుంచి దానిపై రాళ్ళను పేర్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానాల పత్రిక "సప్తగిరి" పేర్కొంది


కొప్పెర


కొప్పెర అంటే మూతి వెడల్పుగా ఉండే లోహపాత్ర అని అర్థం.  తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీ గబగబా నిండిపోతూ ఉంటుంది కాబట్టి పెద్ద గంగాళంలా ఉండే పాత్రను హుండీగా తెల్లనిగుడ్డ అడుగు భాగంలో ఉంచుతారు.


 ఆ హుండీ పాత్రను కొప్పెర అంటారు.  తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ కొప్పెరలను హుండీలుగా వాడతారు. హుండీ నిండిందని తెలుస్తూనే అక్కడే ఉన్న సిబ్బంది మరొక హుండీని ఏర్పాటు చేస్తారు.


 కొంతమంది వంశపారంపర్యంగా ఈ హుండీల దగ్గర పనిచేయడం, హుండీలు నిండిన వెంటనే వాటిని అలాగే కర్రల సహాయంతో మోసుకొని తిరుపతిలోని హథీరాంజీ మఠానికి తీసుకురావడం జరిగేది. 


పూర్వం తిరుమల ఆలయ నిర్వాహకులైన మహంతులు ఈ మఠంలో హుండీలోని డబ్బును లెక్కించేవారు. అలా హుండీల దగ్గర పనిచేసే వాళ్ళని కొప్పెరవాళ్ళని, వాళ్ళు నివశించే పల్లెకు "కొప్పెరవాండ్ల పల్లి'' అనే పేరు వచ్చిందంటారు. 


శ్రీనివాసా మంగాపురం వెళ్ళేదారిలో కొప్పెరవాండ్ల పల్లి ఉంది.

 

హుండీలో భక్తులు వేసిన డబ్బును, నగలను వేరు చేసి లెక్కించే దేవస్థానం ఖజానాకు పంపించే తంతును "పరకామణి'' అంటారు.


ఇది రెండు విడతలుగా జరుగుతుంది. రాత్రి హుండీని దేవస్థాన ఉద్యోగులు ఉదయం లెక్కిస్తారు. ఉదయం విప్పిన హుండీని మధ్యాహ్నం లెక్కిస్తారు. రాత్రి నిద్రించిన హుండీని "తోకముల్లె'' అని అంటారు. 


 కొప్పెరలో మనడబ్బే కాదు విదేశీ కరెన్సీ, నాణేలు కూడా భక్తులు వేస్తుంటారు. హుండీ ద్వారా వచ్చే పట్టువస్త్రాలను దేవస్థానం వారు తమ పరధిలోని ఆలయాలలో కావలసిన సేవలకు, పండుగలకు ఉపయోగించుకుంటారు. 


అలా ఉపయోగించలేక పోయిన పట్టువస్త్రాలను, నగలను, బంగారు వస్తువులను, వజ్రాలు పొదిగిన ఆభరణాలను, వెండి వస్తువులను వేలం వేస్తారు లేకపోతే విలువైన, నాణ్యమైన వాటిని శ్రీవారి ఖజానాలో భద్రపరుస్తారు.


ఓం నమో వేంకటేశాయ 🙏🏻


⚜️⚜️⚜️🌷🌷⚜️⚜️⚜️

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat