Karthika Puranam | కార్తీక పురాణం - 11 వ అధ్యాయము | మంథరుడు - పురాణ మహిమ:
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

Karthika Puranam | కార్తీక పురాణం - 11 వ అధ్యాయము | మంథరుడు - పురాణ మహిమ:

P Madhav Kumar

🌷మంథరుడు - పురాణ మహిమ:

ఓ జనక మహారాజా! ఈ కార్తిక మాసవ్రతము యొక్క మహత్మ్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని. ఇంకనూ దీనిని గురించి యెంత చెప్పినను తనివి తీరదు.

ఈ మాసమునందు విష్ణువును అవిసె పూలతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసిన౦త ఫలము కలుగును. శ్రీ మహా విష్ణువు అర్చనానంతరం పురాణ పఠనం చేసినా, చేయించినా, వినినా, వినిపించినా అటువంటి వారూ తప్పని సరిగా వైకుంఠాన్నే పొందుతారు. దీనిని గురించి మరి ఒక ఇతిహాసము చెప్పెదను. శ్రద్దగా అలకి౦పుము అని వశిష్టుల వారు ఈ విధముగా చెప్పసాగిరి…

పూర్వము కళింగ దేశమునకు మంధరుడను విప్రుడు గలడు. అతడు ఇతరుల యిండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు, మద్యమా౦సాది పానీయములు సేవించుచూ తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నానజప, ధీపారాధనాదికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెలగుచుండెను.

అతని భార్య మహా సాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు, భర్త ఎంత దుర్మార్గుడు అయిననూ, పతినే దైవముగానెంచి విసుగు చెందక సకలోపచారములు చేయుచు, పతి వ్రతాధర్మమును నిర్వర్తించుచుండెను. మంధరుడు ఇతరుల ఇంటియందు వంటవాడుగా పని చేయుచున్ననూ ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవక పోవుటచే దొంగతనములు చేయుచూ, దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద నున్న ధనము, వస్తువులు అపహరించి జీవించుచుండెను.

ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని బడి పోవుచుండు అతనిని భయపెట్టి కొట్టి ధనమును అపహరించు చుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారు ఇద్దరినీ చంపి ధనము మూట కట్టుకొని వచ్చుచుండెను.

సమీపము నందున్న ఒక గుహ నుండి వ్యాఘ్ర మొకటి గాడ్రించుచు వచ్చి కిరాతుకునిపై బడెను. కిరతకుడు దానిని కూడా చంపెను. కానీ అ పులి కూడా తన పంజాతో కిరాతకునికి కొట్టి ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను.

ఈ విధముగా ఒకే కాలమున నలుగురూ నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమ లోకమున అనేక శిక్షలు అనుభవి౦చుచు రక్తము గ్రక్కుచు బాధపడుచు౦డిరి.

మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యమూ హరినామ స్మరణ చేయుచు సదాచార వర్తినియై భర్తను తలచుకోని దుఃఖించుచు కాలము గడుపుచు౦డెను.

కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి ‘స్వామి! నేను దీనురాలను, నాకు భర్త గాని, సంతతిగాని లేరు. నేను సదా హరి నామ స్మరణ చేయుచు జీవించుచున్నదానను, కావున, నాకు మోక్ష మార్గము ప్రసాదించు’ అని బ్రతిమాలుకొనెను.


ఆమె వినయమునకు, ఆచారమునకు ఆ ఋషి సంతసించి “అమ్మా! ఈ దినము కార్తీక పౌర్ణమి, చాల పవిత్రమైన దినము. ఈ దినమును వృథాగా పాడు చేసుకోనవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చుదువుదురు. నేను చమురు తీసికొనవచ్చెదను. నీవు ప్రమిదను, వత్తిని తీసికొని రావాలయును. దేవాలయములో ఈ వత్తిని దెచ్చిన ఫలమును నీవందుకొనుము” అని చెప్పినతోడనే అందుకామె సంతసించి, వెంటనే దేవాలయమునకు వెళ్లి శుభ్రముచేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తిచేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనే ప్రమిదెలో పోసి దీపారాధన చేసెను.

అటు తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినందరిని “ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని” చెప్పెను. ఆమె కూడా రాత్రి అంతయూ పురాణమును వినెను.

ఆనాటి నుండి ఆమె శ్రీ మహా విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంత కాలమునకు మరణించెను. ఆమె పుణ్యత్మురాలు అగుట వల్ల విష్ణు దూతలు వచ్చి విమాన మెక్కించి వైకుంఠమునకు తీసికోనిపోయిరి. కానీ, ఆమెకు పాపత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచము దోషముండుట చేత మార్గ మధ్యమున యమ లోకమునకు తీసికోని పోయిరి.

అచట నరక మందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి “ఓ విష్ణు దూతలారా! నా భర్తా, మరి ముగ్గురునూ ఈ నరక బాధపడుచున్నారు. కాన, నాయ౦దు దయయుంచి వానిని వుద్దరింపు” డని ప్రాధేయపడెను.


అంత విష్ణుదూతలు “అమ్మా! నీ భర్త బ్రాహ్మణుడై యుండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైననూ అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనమును అపహరించెను. మూడవ వాడు వ్యాఘ్రము నలుగవ వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైల లేపనము, మద్య మాంస భక్షణ చేసినాడుగాన పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురును నరక బాధలు పడుచున్నారు”, అని వారి చరిత్రలు చెప్పిరి.

అందుల కామె చాల విచారించి “ఓ పుణ్యాత్ములారా! నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురునూ కూడా ఉద్ధరింపు” డని ప్రార్ధించగా, అందులకు ఆ దూతలు “అమ్మా! కార్తిక శుద్ధ పౌర్ణమినాడు నీవు వత్తి చేసిన ఫలమును ఆ వ్యాఘ్రమునకు, ప్రమిదెఫలము కిరాతకునకు, పురాణము వినుటవలన కల్గిన ఫలము ఆ విప్రునికి ధారపోసినచో వారికి మోక్షము కలుగు” నని చెప్పగా అందులకామె అట్లే ధారపోసెను. అ నలుగురును ఆమె వద్దకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్లిరి.

కావున, ఓరాజా! కార్తిక మాసమున పురాణము వినుట వలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగినదో వింటివా? అని వశిష్టుల వారు నుడివిరి.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి ఏకాదశాధ్యాయము – పదకొండవ రోజు పారాయణము సమాప్తము.

ఓం నమో నారాయణాయ... ఓం నమః శివాయ...🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow