Karthika Puranam | కార్తీక పురాణం - 21వ అధ్యాయము | పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట:
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

Karthika Puranam | కార్తీక పురాణం - 21వ అధ్యాయము | పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట:

P Madhav Kumar

🌷పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట:

ఈ విధముగా యుద్దమునకు సిద్దమై వచ్చిన పురంజయునకు, కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్దము జరిగింది. ఆ యుద్దములో రధికుడు రధికునితోను, అశ్వసైనికుడు అశ్వసైనికునితోను, గజసైనికుడు గజసైనికునితోను, పదాతులు పదాతి సైనికులతోను, మల్లులు మల్లయుద్ద నిపుణులతోను ఖడ్గ, గద, బాణ, పరశువు మొదలగు ఆయుధాలు ధరించి, ఒండొరుల ఢీకొనుచు హుంకరించుకొనుచు, సింహ నాదములు చేసి కొనుచు, శూరత్వవీరత్వములను జూపుకోనుచు, భేరీ దుందుభులు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు, ఉభయ సైన్యములును విజయకాంక్షులై పోరాడిరి.

ఆ రణభూమి నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొ౦డెములు, తొండలు, తలలు, చేతులు, హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు. పర్వతాల వలె పడియున్న ఏనుగుల, గుఱ్ఱముల కళేబరాల దృశ్యములే.

ఆ మహా యుద్దమును వీరత్వమును జూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకువెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్దము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంభోజాది భూపాలుర సైన్యము చాలా నష్ట మై పోయెను. అయినను, మూడు అక్షౌహిణులున్న పురంజయుని సైన్యమునెల్ల అతి సాహసముతో, పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను.

దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రు రాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను.

ఆ సమయములో వశిష్టులు వచ్చి పురంజయుని ఊరడించి "రాజా! మున్నొకసారి నీ వద్దకు వచ్చితిని. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చెస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైననూ సన్మార్గుడవయి వుండుమని హెచ్చరించితిని. అప్పుడు నామాట లానలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తునుడవై వున్నందుననే యీ యుద్దమును ఓడి రాజ్యమును శత్రువుల కప్పగించితిని. ఇప్పటికైనా నామాట లాలకింపుము. జయాపజయాలు దైవాధీనములని యెఱ్ఱి౦గియు, నీవు చింతతో కృంగి పోవుటయేల? శత్రురాజులను యుద్దములో జయించి, నీరాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపుకలదేని, నాహితోపదేశము నాలకింపుము…

ఇది కార్తీకమాసము. రేపు కృత్తికానక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన, స్నాన జపాది నిత్యకర్మలాచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి, భగవన్నామస్మరణమును చేయుచు నాట్యము చేయుము. ఇట్లోనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది.

అంతియేగాదు, శ్రీమన్నారాయణుని సేవించుటవలన శ్రీహరి మిక్కిలి సంతోషమొంది నీ శత్రువలను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును. కనుక, రేపు అట్లు చేసిన యెడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్టసహవాసము చేయుట చేతగదా నీకీ అపజయము కలిగినది? గాన లెమ్ము. శ్రీహరి నీ మదిలో దలచి నేను తెలియ జేసినటుల చేయు" మని హితోపదేశము చేసెను...(22వ అధ్యాయము లో).


అపవిత్రః పవిత్ర వా నానావస్దాన్ గతోపివా l
యః స్మరే త్పుండరీకాక్షం స బాహ్యాభ్యాంతరశ్శుచిః ll


🌷ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి ఏకవింశోధ్యాయము - ఇరవయ్యోకటోరోజు పారాయణము సమాప్తము.


ఓం నమో నారాయణాయ..ఓం నమః శివాయ...🙏🙏


⚜️⚜️⚜️🌷🌷🌷🌷⚜️⚜️⚜️

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow