"భగవద్గీత - అంతరార్ధ విశ్లేషణ" - 11వ భాగము.

P Madhav Kumar



ఈ రెండవషట్కము(భక్తిషట్కము) విజ్ఞానంతో ప్రారంభమౌతుంది. జ్ఞానమనగా శాస్త్రజ్ఞానం. విజ్ఞాన మనగా అనుభవపూర్వకమైన జ్ఞానము(Practical Knowledge). అనుభవమునకు రాని విద్యవలన ఉపయోగంలేదు. ఆధ్యాత్మికవిద్యకు అనుభవజ్ఞానమే ప్రధానము. ఆత్మను తెలుసుకొనుటకు జీవునికి జ్ఞానముతో పాటు విజ్ఞానము అవసరము. కేవలం శాస్త్రజ్ఞానంతో ఆత్మానుభూతి పొందలేరని శ్రీకృష్ణుని ఉపదేశము.


ఎలాగైతే మామిడిపూతంతా పండ్లుగా మారవో. ఆధ్యాత్మికసాధన చేసిన జ్ఞానులందరు పరమాత్మను తెలుసుకోలేరు. చాలామంది మధ్యలోనే రాలిపోతారు. కొంతమంది అజ్ఞానంతో పూతదశలోనే దూరమౌతారు, ఇంకొంతమంది జ్ఞానంతో ముందుకెళ్లి ఆపిమ్మట విషయవాంఛలతో కాయదశలో పట్టుతప్పుతారు. కారణం వారికి ఎంతో శాస్త్రజ్ఞానం వుంటుంది కానీ అనుభవజ్ఞానము వుండదు. కాబట్టి ఈ రెండింటిని జోడించి అసలు సత్యమును తెలుసుకోనే ప్రయత్నంచేయాలి. దానిని తెలుసుకుంటే ఇంక తెలుసుకోవలసినది ఏమి మిగలదు.


ఈ జ్ఞాన, విజ్ఞానములను జోడించే ప్రక్రియలో ముందుగా మన మనుగడకు సంభందించిన కొన్ని ముఖ్యవిషయాలు తెలుసుకుందాము. మానవులు తరచుగావాడే పదాలు, ఒకటి ప్రకృతి, రెండవది పురుషుడు(పరమాత్మ). వాటిగురించి కొంత విపులంగా తెలుసుకొనే ప్రయత్నంచేద్దాము. వీటినే దృశ్యము,దృక్కు అని కూడా అంటారు. ప్రకృతి జడమైనది, పురుషుడు చైతన్యస్వరూపుడు. ప్రకృతి వికారములతో కూడినది, పురుషుడు వికారము లేనివాడు(నిర్వికారుడు).


ప్రకృతి రెండువిధములుగా వుంటుంది. ఒకటి అపరప్రకృతి, రెండవది పరాప్రకృతి. 


పంచభూతములగు ఆకాశము, గాలి, నిప్పు, నీరు, భూమి, మనస్సు, బుద్ధి, అహంకారము. ఈ ఎనిమిది విధాలైన ప్రకృతిని అపర(తక్కువ) ప్రకృతి అంటారు. జీవరూపమై చిదాభాసస్వరూపమైన దానిని పరా(ఎక్కువ) ప్రకృతి అంటారు. ఈ ప్రపంచంలోని చరాచరప్రాణికోటి అంతా ఈ రెండు విధములైన ప్రకృతిచే ఏర్పడుతున్నాయి.


ప్రకృతి స్వతహాగా జడమైనది కావునా ఏ కార్యము చేయలేదు. చైతన్యవంతమగు ఆత్మతో కలయిక వలన ఈ విశ్వము ఏర్పడుతున్నది. 


అయితే ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. పంచభూతములు జడమైనవని మనకు తెలుసు కానీ మనస్సు, బుద్ధి, అహంకారం(నేను అన్న భావన) కూడా జడము లేనా? అవి చైతన్యమైనవే కదా!!


అవి కూడా జడములే. కారణం అవి చేపలత్వము, చెంచలత్వమును, వచ్చుట, పోవుట కలిగివున్నవే కదా! ఈ మనోబుధ్యాహంకారములను జడపదార్ధములుగా పరిగణించుటలోనే సాధకుని తెలివికి నిదర్శనము. కొంతమంది వీటిలో తాదాత్మ్యము చెంది పిమ్మట వికారము నొంది ఈ సంసారమున బందీలగుచున్నారు. కానీ జ్ఞానులు వాటిని తమనుండి వేఱుగా పరిగణించి శాశ్వతచైతన్యవంతమగు ఆత్మయందే దృష్టిపెట్టి సంసారబంధమునుండి తప్పుకుంటున్నారు. 


జ్ఞానులు మనస్సుతో గాక మనస్సాక్షితో తాదాత్మ్యము నొందుచున్నారు. అంటే జడమైన ప్రకృతికి ఆధారభూతుడై అదే ప్రకృతియందు సర్వత్రావ్యాపించియున్న ఆత్మస్వరూపాన్ని దర్శిస్తారు జ్ఞానులు. ఆ ఆత్మస్వరూపమే "పరమాత్మ" అని చెబుతాడు శ్రీకృష్ణుడు. పరమాత్మ ఈ చరాచర జగత్తులోని అన్ని పదార్ధములలో సూక్ష్మరూపంలో వ్యాపించియున్నాడు. ఆధారము లేనిదే ఆధేయము వుండలేదు కదా! పాలలో నెయ్యి వున్నట్లు, గింజలో నూనె వున్నట్లు, కట్టెలో నిప్పు వున్నట్లు!! పరమాత్మా లేని వస్తువు ఈ సృష్టిలో లేదు.


ఈ సత్యమును తెలుసుకుంటే, మానవుడు ఏ పాపకార్యము చేయలేడు. ఒకవేళ చేస్తే అంతా వ్యాపించియున్న పరమాత్ముడు చూస్తున్నాడని భయముంటుందిగనుక. అంటే మనలో వున్న మనల్నే మోసంచేస్తున్నాము గనుక. ఆహా ఎంత సులభంగా చెప్పాడు పరమాత్మయైన శ్రీకృష్ణుడు.


అనుభవపూర్వకమైన జ్ఞానము(Practical Knowledge)నకు ఇది పునాది.

శాస్త్రి ఆత్రేయ(ఆకుండి శ్రీనివాస శాస్త్రి).

తదుపరి భాగంలో మళ్ళీ కలుసుకుందాము...🌹                                                     🪷⚛️✡️🕉️🌹

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat