_*🚩అయ్యప్ప చరితం - 9 వ అధ్యాయం🚩*_

P Madhav Kumar


🕉☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️


స్త్రీ చేతిలో మరణాన్ని నీవే కోరుకున్నావుగనక ఈ దివ్యాంగనను ముందర నిలిపి వాళ్లందరూ ప్రచ్ఛన్నంగా నిలిచి నిన్ను బందీని చేయజూస్తున్నట్లున్నారు. అందుకే నీవు అప్పుడే వెళ్లకు  ముందు మన సైన్యంలోని చిక్షురతామ్రాక్షులు , అసిలోమ బిడాలాక్షులు మొదలైన వారిని పంపు వాళ్లూ అవక్రమ పరాక్రమవంతులే ! వాళ్లు ఆమెను ఓడించి తీసుకురాగలరని నా నమ్మకం ’’  అన్నది మహిషి తమ్ముడిని ఆగమని చెబుతూ !

ఆమె మాటలు సమంజసంగా తోచడంతో సైన్యంలోని ముఖ్యులను తగిన బలగాలతో యుద్ధానికి పంపించాడు మహిషుడు ! వాళ్లందరూ ఆమె చేతిలో మరణించిన వార్త రావడంతో పట్టలేని కోపావేశంతో వూగిపోతూ భయంకర రూపంతో తరలి వెళ్లాడు మహిషాసురుడు సోదరి మాటను లక్ష్యపెట్టకుండా! అల్లంత దూరంలో నుండే దేవి దివ్య రూపాన్ని చూసి అచ్చెరువు పొందుతూ రాక్షస మాయా విద్యతో సుందర యువకుడి రూపు ధరించి ఆమెను సమీపించాడు మహిషుడు.


*‘‘సుందర రూపంతో నన్ను వివశుడిని చేసిన నీకు నా అభివాదనలు ! కాంతామణి !  నీతో యుద్ధం చేయటం నాకు సమ్మతంకాదు ! నన్ను వరించి ,  నా రాణివై నాకు ఆనందాన్ని ప్రసాదించు !’’*  అంటూ ప్రాధేయపూర్వకంగా పలికాడు!

ఆ మాటలకు చిన్నగా నవ్వింది దేవీమాత.


*‘‘మహిషాసురా ! సహజంగా మహిషానివైన నీ పశు ప్రవృత్తికి తగినట్లు ఘోర రూపంతోనే నిన్ను వధిస్తాను! కాచుకో!’’* అంటూ రౌద్ర రూపంతో ప్రకటితమై శంఖం పూరించింది! మహిషాసురుడు సుందర రూపం విడిచి వివిధ క్రూర మృగాల రూపంలో మాతను ఎదుర్కొన్నాడు! అతను ప్రయోగించిన ఆయుధాలను తుత్తునియలు చేసి కొంతకాలం తీలగా యుద్ధం సాగించి చివరకు దేవతలందరి ప్రార్థన మన్నించి త్రిశూలంతో మహిషుని తలను ఖండించివేసింది జగన్మాత! అతని శరీరాన్ని నాటిన బాణాలు ప్రాణాలను హరించివేశాయి.

 తల, మొండెము వేరై రక్తపుటేరులలో దొర్లసాగాయి. నాయకుడి మరణం మిగిలిన కొద్దిమంది రాక్షస భటులు వెనుదిరిగి పారిపోయారు.

మహిషుని వధించి రౌద్రాకారంతో కళ్లనుండి అగ్నివర్షం కురిపిస్తూ యుద్ధ్భూమిలో నిలిచిన దేవీమాతమీద పూల వృష్టి కురిపిస్తూ జయ జయ ధ్వానాలు కావించారు దేవతలు నారదాది మునులు శ్రావ్యంగా గానం చేస్తూ మాతను ప్రస్తుతించారు!

*‘‘అయిగిరి నందిని నందిత మోదిని విశ్వవినోదిని నందనుతే!*

*గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే! భగవతి హే!* *శితికంఠ కుటుంబిని, భూరి కుటుంబిని భూరికృతే!*

*జయ జయహే! మహిషాసుర మర్దిని! రమ్యకపర్దిని శైలసుతే!’’*

మహిషాసురుని సంహరించి లోకాలలో శాంతిని ప్రతిష్ఠించిన దేవీ మాతకు కృతజ్ఞతలు తెలుపుకుని స్వర్గానికి తిరిగి వెళ్లారు దేవతలు.


*‘‘శౌనకాది మునులారా ! మహిషాసుర మర్దినిగా అందరి చేత పూజింపబడసాగింది దేవీమాత ఆనాటినుండి ! ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో అష్టమినాడు మహిషుని మర్దించిన కారణంగా ఆ రోజు మాతను విశేషపూజలతో అర్చించడంవల్ల సర్వశుభాలు ఒనగూడుతాయి ! పాడ్యమి మొదలు నవమి వరకు దేవీ నవరాత్రోత్సవం భక్తిశ్రద్ధలతో జరిపి దుర్గముడు , శుంభ నిశుంభులు , రక్తబీజుడు మొదలైన ఉగ్రదానవులెందరినో వధించి శాంతి భద్రతలు ప్రసాదించిన ఆ జగన్మాత అనుగ్రహాన్ని పొంది జన్మలు ధన్యం కావించుకుంటున్నాము గదా! ఏదీ! అందరూ ఒక్కసారి కన్నులరమోడ్చి జగదంబకు నమస్కరించండి.


*‘‘శివే భవాని ప్రమదౌ షడాననే! మృడాని దుర్గే వరదే మహేశ్వరి!*

*చిదగ్ని కుండాంతర సంభవేంబికే! ప్రయచ్ఛమే మంగళ మంబ సత్వరం!’’* అంటూ స్తుతించాడు సూత మహర్షి.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat