Karthika Puranam | కార్తీక పురాణం - 28వ అధ్యాయము | విష్ణు సుదర్శన చక్ర మహిమ:
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

Karthika Puranam | కార్తీక పురాణం - 28వ అధ్యాయము | విష్ణు సుదర్శన చక్ర మహిమ:

P Madhav Kumar

🍃🌷విష్ణు సుదర్శన చక్ర మహిమ:


జనక మహారాజా! వింటివా దుర్వాసుని అవస్ధలు! తాను ఎంతటి కోపవంతుడైనను, వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని శుద్దిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున, ఎంతటి గొప్ప వారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోనవలెను.

అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచూ తిరిగి మళ్లి భూలోకానికి వచ్చి, అంబరీషుని కడకేగి “అంబరీషా, ధర్మపాలకా! నా తప్పులను క్షమించి నన్ను రక్షింపుము, నీకు నాపై కల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్ను ఆహ్వనించితివి, కాని నిన్ను కష్టములు పాలు చేసి, వ్రత భంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేయతల పెట్టితిని. కాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్దమైనది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్ధించితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీవద్దకు ఏగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపశ్శాలి ఐనను, ఎంత నిష్ట గలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందు అవి ఏమియు పనిచేయలేదు.

నన్నీ విపత్తు నుండి కాపాడు”మని అనేక విధాల ప్రార్ధిచగా, అంబరీషుడు శ్రీ మన్నారాయణుని ధ్యానించి, “ఓ సుదర్శన చక్రమా! నీకివే నా మనఃపూర్వక వందనములు. ఈ దూర్వాస మహాముని తెలిసియో, తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను ఈతడు బ్రాహ్మణుడు కావున, ఈతనిని చంపవలదు, ఒక వేళ నీ కర్తవ్యమును నిర్వహింప తలచితివేని, ముందు నన్ను చంపి, తర్వాత ఈ దుర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు, దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్దములలో , అనేక మంది లోక కంటకులను చంపితివి కాని శరణు కోరువారిని ఇంత వరకు చంపలేదు. అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుట లేదు. దేవా! సురాసురాది భూతకోటులన్నియు ఒక్కటిగా ఏకమైననూ నిన్నేమియు చేయజాలవు, నీ శక్తికి ఏ విధమైన అడ్డునూలేదు. ఈ విషయము లోకమంతటికి తెలియును. అయినను ముని పుంగవునికి ఏ అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్థించుచున్నాను.

నీ యుందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడియున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును, శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము” అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి “ఓ భక్తాగ్రేశ్వరా! అంబరీషా! నీ భక్తిని పరీక్షించుట కిట్లు చేసితిని గాని వేరుగాదు. అత్యంత దుర్మార్గులు, మహా పరాక్రమవంతులైన మధుకైటభులను – దేవతలందరు ఏకమై కూడ – చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా! ఈ లోకము నందు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్దాపించుచుండును. ఇది ఎల్లరకు తెలిసిన విషయమే, ముక్కోపియగు దుర్వాసుడు నీ పై పగ బూని నీ వ్రతమును నశింపజేసి, నానా ఇక్కట్లు పెట్టవలెనని కన్నులెఱ్ఱ చేసి నీ మీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి, ఈ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను.

ఈతడు కూడా సామాన్యుడు గాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మ తేజస్సు గలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భులోకవాసుల నందరను చంపగలదుగాని, శక్తిలో నా కంటె ఎక్కువేమియుగాదు. సృషి కర్తయగు బ్రాహ్మ తేజస్సు కంటెను, కైలాసవతియగు మహేశ్వరుని తేజశ్శక్తి కంటెను ఎక్కువయైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని, క్షత్రియ తేజస్సుగల నీవు గాని తులతూగరు. నను ఎదుర్కొనజాలరు. తనకన్న ఎదుటి వాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించువారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు. ఇంత వరకు జరిగినడది అంతయు విస్మరించి, శరణార్థియై వచ్చిన దుర్వాసుని గౌరవించి నీ ధర్మమును నీవు నిర్వర్తింపు” మని చక్రాయుధము పలికెను.

అంబరీషుడా పలుకులను ఆలకించి, ”నేను దేవ, గో, బ్రాహ్మణాదులయుందును, స్త్రీలయందును, గౌరవము గలవాడను. నా రాజ్యములో సర్వజనులూ సుఖిముగా ఉండ వలెననియే నా అభిలాష. కాన, శరణు కోరిన ఈ దుర్వాసుని, నన్నూ కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్య మండలములు ఏకమైననూ నీ శక్తీకి, తేజస్సుకూ సాటి రావు. నీవు అట్టి తేజోరాశివి మహా విష్ణువు లోకనిందితులపై, లోకకంటకులపై, దేవ – గో – బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి, వారిని శిక్షించి, తన కుక్షియుందున్న పధ్నాలుగు లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన, నికివే నా మనఃపూర్వక నమస్కృతులు’ అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను.

అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢమైన ఆలింగమునొనర్చి “అంబరీషా! నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు ఎవరు పఠింతురో, ఎవరు దాన దర్మములతో పుణ్యఫలమును వృద్ది చేసుకొందురో, ఎవరు పరులను హింసించక – పరధనములను ఆశపడక – పర స్త్రీలను చెరబెట్టక – గోహత్య – బ్రాహ్మణ హత్య – శిశు హత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి, ఇహమందును పరమందును సర్వ సాఖ్యములతో తులతూగుదురు. కాన, నిన్ను మరియు దుర్వాసుడిని రక్షించుచున్నాను, నీ ద్వాదశీ వ్రత ప్రభావములు చాల గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ ముని పుంగవుని తపశ్శక్తి పని చేయలేదు.” అని చెప్పి అతని ఆశీర్వదించి, అదృశ్యమయ్యెను....(29వ అధ్యాయము లో "అంబరీషుడు దుర్వాసుని పూజించుట").


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి అష్టావింశోధ్యాయము - ఇరవయ్యెనిమిదో రోజు పారాయణము సమాప్తము.


ఓం నమో నారాయణాయ..ఓం నమః శివాయ...🙏🙏


⚜️⚜️⚜️🌷🌷🌷🌷⚜️⚜️⚜️

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow