Karthika Puranam | కార్తీక పురాణం - 28వ అధ్యాయము |

P Madhav Kumar

 కార్తీక పురాణం - 28వ అధ్యాయము | విష్ణు సుదర్శన చక్ర మహిమ

జనక మహారాజా! వింటివా దుర్వాసుని అవస్ధలు! తాను యెంతటి కోపవంతుడైనను, వెనుక ముందు లాలోచింపక ఒక మహాభక్తుని శుద్దిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసముల పాలైనాడు. కావున, ఎంతటి గొప్ప వారైనాను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోనవలెను.
అటుల దుర్వాసుడు శ్రీ మన్నారాయణుని కడ సెలవుపొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచూ తిరిగి మళ్లి భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి "అంబరీషా, ధర్మపాలకా! నా తప్పు క్షమించి నన్ను రక్షింపుమునీకు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్నాహ్వనించితివి, కాని నిన్ను కష్టములు పాలుజేసి వ్రతభంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేయతల పెట్టితిని. గాని నా దుర్బద్ది నన్నే వెంటాడి నాప్రాణములు తీయుటకే సిద్దమైనది. 

నేను విష్ణువు కడకేగి యా విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపుమని ప్రార్ధి౦చితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీవద్ద కేగమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను యెంతటి తపశ్శాలినైనను, యెంత నిష్టగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందవియేమియు పనిచేయలేదు. నన్నీ విపత్తునుండి కాపాడు"మని అనేక విధాల ప్రార్ధఒచగా, అంబరీషుడు శ్రీ మన్నారాయణుని ధ్యానించి,"ఓ సుదర్శన చక్రమా! నీకివే నా మన:పూర్వక వందనములు.
ఈ దూర్వాస మహాముని తెలిసియో, తెలియకయో తొందరపాటుగా యీ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను యీతడు బ్రాహ్మణుడు గాన, ఈతనిని చంపవలదు, ఒక వేళ నీ కర్తవ్యమును నిర్వహింపతలచితివేని, ముందు నన్నుచంపి, తర్వాత ఈ దుర్వాసుని జంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు యిలవేల్పు, దైవము. 

నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్దములలో , అనేక మంది లోకకంటకులను చంపితివిగాని శరణుగోరువారిని యింత వరకు చంపలేదు. అందువలననే యీ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచునే యున్నావు గాని చంపుటలేదు. 
దేవా! సురాసురాది భూతకోటులన్నియు ఒక్కటిగా యేకమైననూ నిన్నేమియు చేయజాలవు, నీ శక్తికి యే విధమైన అడ్డునూలేదు. ఈ విషయము లోకమంతటికి తెలియును. అయినను మునిపుంగవునికి యే అపాయము కలుగకుండ రక్షింపుమని ప్రార్థించుచున్నాను.

నీ యుందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి యిమిడియున్నది. నిన్ను వేడుకోనుచున్న నన్నును, శరణు వేడిన యీ దుర్వాసుని రక్షింపుము" అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి "ఓ భక్తాగ్రేశ్వరా ! అంబరీషా! నీ భక్తిని పరీక్షించుట కిట్లు చేసితినిగాని వేరుగాదు.
అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకైటభులను - దేవతలందరు యెకమైకూడ  - చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా! ఈ లోకములో దుష్టశిక్షణ, శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్దాపించుచుండును. ఇది యెల్లరకు తెలిసిన విషయమే, ముక్కోపియగు దుర్వాసుడు నీపైల్ పగబూని నీవ్రతమును నశింపజేసి, నానా యిక్కట్లు పెట్టవలెనని కన్ను లెఱ్ఱజేసి నీ మీద జూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి, యీ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను.

ఈతడు కూడా సామాన్యుడు గాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు. బ్రహ్మతేజస్సు గలవాడు. మహాతపశ్శాలి. రుద్రతేజము భులోకవాసుల నందరను చంపగలదుగాని, శక్తిలో నా కంటె యెక్కువేమియుగాదు. సృషి కర్తయగు బ్రాహ్మతేజస్సు కంటెను, కైలాసవతియగు మహేశ్వరుని తేజశ్శక్తి కంటెను యెక్కువయైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని , క్షత్రియ తేజస్సుగల నీవు గాని తులతూగరు. నన్నెదుర్కొనజాలరు. తనకన్న యెదుటి వాడు బలవంతుడై యున్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట యుత్తమము. ఈ నీతిని ఆచరించువారలు యెటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకోనగలరు.

ఇంత వరకు జరిగినదంతయు విస్మరించి, శరణార్థియై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపు" మని చక్రాయుధము పలికెను. అంబరీషుడా పలుకులాలకించి, " నేను దేవ గో, బ్రాహ్మణాదులయుందును, స్త్రీలయందును, గౌరవము గలవాడను. నా రాజ్యములో సర్వజనులూ సుఖిముగా నుండవలెననియే నా యభిలాష.
కాన, శరణుగోరిన ఈ దుర్వాసుని, నన్నూ కరుణించి రక్షింపుము. వేలకొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్య మండలములు యేక మైననూ నీ శక్తీకి, తేజస్సుకూ సాటి రావు. నీవు అట్టి తేజోరాశివి మహా విష్ణువు లోకనిందితులపై, లోకకంటకులపై, దేవ - గో - బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి, వారిని శిక్షించి, తనకుక్షియుందున్న పధ్నాలుగు లోకములను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన, నికివే నామన:పూర్వక నమస్కృతులు" అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను. అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాడాలింగన మొనర్చి "అంబరీషా! నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు నెవరు పఠింతురో, యెవరు దానదర్మములతో పుణ్యఫలమును వృద్ది చేసుకొందురో, యెవరో పరులను హింసించక - పరధనములను ఆశపడక - పరస్త్రీలను చెరబెట్టిక - గోహత్య - బ్రాహ్మణహత్య - శిశుహత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టివారి కష్టములు నశించి, యిహమందును పరమందును సర్వసాఖ్యములతో తులతూగుదురు. కాన, నిన్నూ దుర్వాసుని రక్షించుచున్నాను, నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాల గొప్పది. నీ పుణ్యఫలము ముందు యీ మునిపుంగవుని తపశ్శక్తి పని చేయలేదు." అని చెప్పి అతని నాశీర్వదించి, అదృశ్యమయ్యెను.

ఇట్లు స్కాంద పురాణా౦తర్గ్హత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి అష్టావింశోధ్యాయము - ఇరవయ్యెనిమిదో రోజు పారాయణము సమాప్తము.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat