🌷అంబరీషుడు దుర్వాసుని పూజించుట - ద్వాదశి పారణము:
అత్రి మహాముని అగస్త్యులవారితో ఈ విధముగా – సుదర్శన చక్రము అంబరీషునకు అభయములిచ్చి ఉభయులను రక్షించి, భక్త కోటికి దర్శనమును ఇచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నుడువ నారంభించెను.ఆ తరువాయి అంబరీషుడు దుర్వాసుని పాదముల పై బడి దండ ప్రణామములను ఆచరించి, పాదములను కడిగి, ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని, “ఓ ముని శ్రేష్ఠా! నేను సంసార మార్గము నందున్న ఒక సామాన్య గృహస్తుడను. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును, ద్వాదశీ వ్రతము చేసుకోనుచూ ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమును ఏలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు. మీ ఎడల నాకు అమితమైన అనురాగము ఉండుట చేతనే తమకు ఆతిథ్యము ఇవ్వవలయునని ఆహ్వానించితిని. కాన, నా అతిధ్యమును స్వీకరించి నన్నును, నా వంశమును పావనము చేసి కృతార్దుని చేయుడు, మీరు దయార్ద్ర హృదయులు, ప్రథమ కోపముతో నన్ను శపించినను, మరల నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ ఉపకారమును మరువలేకున్నాను.
మహానుభావా! నా మనస్సు సంతోషముచే మిమ్మెట్లు స్తుతించ వలయునో నా నోట పలుకులు రాకుండా ఉన్నవి. నా కంటి వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు ఎంత సేవ చేసినను ఇంకను ఋణపడి యుందును. కాన, ఓ పుణ్య పురుషా! నాకు మరల నర జన్మ రాకుండా వుండేటట్లును, సదా, మీ బోటి మునిశ్రేష్ఠుల యందును – ఆ శ్రీ మన్నారాయుణుని యందును మనస్సు గలవాడనై ఉండునట్లును నన్ను ఆశీర్వదించు” అని ప్రార్ధించి, సహ పంక్తి భోజనమునకు దయ చేయుమని ఆహ్వానించెను.
ఈ విధముగా, తన పాదముల పైబడి ప్రార్ధించుచున్న అంబరీషుని ఆశీర్వదించి “రాజా! ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియ చేయుచున్నవి. నీవు నాకు ఇష్టుడవు, తండ్రితో సమానుడవైనావు.
నేను నీకు నమస్కరించినచో నా కంటె చిన్న వాడగుట వలన నీకు ఆయుఃక్షిణము కలుగును. అందుచేత నీకు నమస్కరించుట లేదు. నీవు కోరిన యీ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్రమైన ఏకాదశి వ్రతనిష్టుదువు అగు నీకు మనస్థాపమును కలుగ చేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని, నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నివే దిక్కు అయితివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము కాక, మరొకటి యగునా?” అని దుర్వాస మహాముని పలికి, అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్య పరమాన్నములతో సంతృప్తిగా విందును ఆరగించి, అతని భక్తిని కడుంగడు ప్రశంసించి, అంబరీషుని దీవించి, సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను.
ఈ వృత్తాంతమంతయు కార్తిక శుద్ధ ద్వాదశీ దినంబున జరిగినది. కాన ఓ అగస్త్య మహామునీ! ద్వాదశీ వ్రత ప్రభావమెంతటి మహాత్మ్యము గలదో గ్రహించితివి గదా! ఆ దినమున శ్రీ విష్ణుమూర్తి క్షీర సాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై వుండును. కనుకనే, ఆ రోజుకంతటి శ్రేష్టతయు, మహిమ కలిగినది. ఆ దినమునందు చేసిన పుణ్యము ఇతర దినములలో పంచ దానములు చేసినంత ఫలమును పొందును.
ఏ మనుజుడు కార్తిక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసము ఉండి పగలెల్ల హరినామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ, లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారయణునకు ప్రీతీ కొరకు దానములను ఇచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయునో అట్టి వాని సర్వ పాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంఛలై పోవును. ద్వాదశీ దినము శ్రీమన్నానరయుణుకు ప్రీతికరమైన దినము కనుక ఆ నాడు ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నను, ఆ ఘడియలు దాటకుండగానే భుజింపవలెను.
ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసమును ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో, అట్టి వారు ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ ఓక్కటియు విడువ కూడదు. శ్రీహరికి ప్రీతీకరమైన కార్తిక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింప కూడదు. మఱ్ఱి చెట్టు విత్తనము చాల చేసిన ఏ కొంచము పుణ్యమైనను, అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును. అందులకే ఈ కార్తిక మాస వ్రతము చేసి, దేవతలే కాకుండా సమస్త మానవులు తరించిరి.
ఈ కథను యెవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్దించి సంతాన ప్రాప్తి కూడా కలుగును - అని అత్రిమహాముని అగస్త్యనకు బోధించిరి.
*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకోనత్రి౦శోధ్యాయము - ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము.
ఓం నమో నారాయణాయ..ఓం నమః శివాయ...🙏
