_*అయ్యప్ప సర్వస్వం - 88*_శాస్తాంకోట్టై అయ్యప్పస్వామివారి ఆలయం - 2*

P Madhav Kumar



🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*శాస్తాంకోట్టై అయ్యప్పస్వామివారి ఆలయం - 2*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*కొండ ఎక్కగనే దర్శనము :* 


పూర్వము నుండియే పందళరాజ వంశీయులెల్లరు , కులదైవమగు శబరిమల శ్రీ అయ్యప్పస్వామివారిని శబరిమల కొండెక్కి దర్శించు కొనుట పరిపాటి. ముందొక కాలమున పందళ వంశమునకు చెందిన యొక రాజు కాయంకుళం రాజ వంశంలోని వధువును వివాహమాడెను. వీరు పరస్పరము వీడియుండ వలసి వచ్చెను. అలా 12 సంవత్సరములు రాజు మనోవేధనతో శబరిమలకు వెళ్ళలేకపోయెను. ఆరాజుకు స్వప్నమున పులి , చిరుతపులులు వచ్చి భయపెట్టెను. రాజు నిద్రలో పలుమార్లు కేకలు పెడుతూ ఉలిక్కిపడి లేచి కూర్చొనసాగెను. అలవాటై పోవడం మూలాన రాజధానిలోని వారెల్లరికి ఇబ్బందికరమై తీరెను. అలా ఆయన కేకపెట్టడం మూలాన ఆ రాజధాని లోని వారెవ్వరికికూడా రాత్రివేళ కూడా నిద్రలేకపోయెను. అందువలన ఆ రాజు తన మామగారి రాజ్యమగు కాయంకుళము వెళ్ళి నివశించసాగెను. ఆ రాత్రి పందళ రాజుకు ఒక స్వప్నము వచ్చెను. అందులో పరదైవమగు శబరిమల శ్రీ శ్రీధర్మశాస్తావారి యొక్క దర్శినము చేసి 12 దినములు అచ్చటే యుండి ఆరాధనలు చేసినచో , నీ మనో విచారము తొలగునని చెప్పెను. అనారోగ్యముతోనూ , అతలా కుతలమైన మనస్సుతోనూ యుండిన ఆ రాజు తనకు కనిపించిన స్వప్నము గూర్చి రాణితో తెలిపెను. తదుపరి రాజు రాణియొక్క సమ్మతముతో పందళరాజ్యము చేరి అచ్చటనుండి శబరిమలకు బయలుదేరువేళ యొక స్వర్ణ కిరీటము మరియు మేలు ముత్యముతో చేయబడిన ఒక హారము తీసుకొని శబరిమలకు పయనమయ్యెను. అదే సమయాన అతని మామగారైన కాయంకుళం రాజాగారికి మతిభ్రమణము కలుగుటయు ఆయన గారు *"పులి", "చిరుతపులి", "ఏనుగులు"* అంటూ కేకలు పెడుతూ అటూయిటూ గమ్యములేక తిరుగుటయు , వైద్యుల చికిత్సకు అంతుపట్టక ఆ వ్యాధి యుండుటయు పందళరాజుగారికి తెలిసెను. వెంటనే ఆయన కాయంకుళం బయలుదేరెను.


అచ్చట దేవప్రశ్నం వేసి చూడగా శ్రీస్వామివారికీ 101 స్వర్ణ నాణెములు ఇచ్చి పంపవలెననియు , పులిప్పెట్టు , కడువప్పెట్టు అను వాచకములను యొక పత్రములో వ్రాసి నంబూద్రిల వద్ద ఇచ్చి ప్రాయశ్చిత్తము చేసుకొనవలయునని తేలెను. మరియు పందళ రాజును మర్యాదపూర్వకంగా ఆహ్వానించి , కాయంకుళంలో యుంచు కొనవలయుననియు తేలెను. కాని ప్రతినెల సోమవార భజనము చేయలేక పోవుటవలన మానసీక భాదకు గురయ్యెను. ఆ దినము భాదాక్రాంతుడై నిదురపోవువేళ రాజుకు మరలా ఒక స్వప్నము కన్పించెను. *"పందళరాజా ! శబరిమలకు వచ్చి నన్ను దర్శించుకోలేక పోతినే నని బాధపడకూ ! నన్నుచూచుటకు శబరిమలకే కష్టపడి రావాలని లేదు. నేను నీకు సమీపమునందే వచ్చియున్నాను. కాయంకుళం రాజు ఏడాదికోమారు జరిపే ఆయుధ పోటీలో ఒక వీరుడు ఈ వర్షము పాల్గొనుననియు ఆతడు సంధించే బాణము పడు స్థలమునకు వచ్చినచో నన్ను చూడవచ్చుననియు చెప్పెను. ఆ ఏట అతి తేజస్వియైన యువకుడొకడు కాయంకుళ ఆయుధ పోటీలో పాల్గొనుటకు కాయంకుళం వచ్చెను. ఆయుధ పోటీలో కాయంకుళ్ళ సైనీకులను అతడు ఓడించెను. ఆ యువకుని సామర్థ్యమునకు ఆనందము చెందిన రాజు ఆ యువకునితో ఏమి కావలయునో అడగమనెను. అందులకు ఆ యువకుడు నేను సంధించే బాణము ఎచ్చటపడునో ఆ పరిసర ప్రాంతములోని కొద్దిపాటి స్థలము నాకు ప్రసాదించవలెనని కోరెను. రాజు అందులకు సమ్మతించగా ఆ యువకుడు తూర్పుదిశగా తన బాణమును సంధించెను. అది పడిన స్థలమును కనిపెట్టుటకు పందళం రాజు ఆ యువకునితో సైన్యములు వెంటరాగా బయలుదేరెను. కొద్దిదూరము వెళ్ళగానే ఒక సరోవర తీరమున కొద్దిమంది పచ్చిగడ్డి తినుచుండుట గాంచెను. వెంటనే అందులోని ఒక యువకుడు రాజాగారిని పట్టుకొనుటయు , రాజు వెంట వచ్చిన భటులు పారిపోవుట జరిగిపోయెను. మిక్కిలి ధైర్యము తెచ్చుకున్న రాజు అతనివెంట నడవసాగెను. అప్పుడు అతనివద్ద కరమున వాలము ధరించిన ఒక యువకుడు తోడుగా వచ్చి నడిపించెను. మరి కొంత దూరములోని ఒకప్రదేశమున ఓ శిలావిగ్రహము కనిపించెను. ఆ శిలావిగ్రహముపై తాను శబరిమల శ్రీ ధర్మశాస్తా వారికని తయారు చేసి యుంచిన కిరీటము మరియు ముత్యాల హారము అలంకరించి యుండుట చూచి మహదాశ్చర్యము చెందెను. వెంటనే సాష్టాంగ నమస్కారము చేసి అచ్చటనే యుండి శ్రీస్వామి వారికి 12 దినములు పూజలు , ఆరాధనలు జరిపించెను. అదే సమయాన ఒక బ్రాహ్మణుడు ఎదురు వచ్చి నేటితో నీ రోగములన్నియు తొలగెను. నేను పరమ సంతుష్టుడై యున్నాను. ఇకపై నీవు శ్రమపడి శబరికొండెక్కి వచ్చి నన్ను దర్శించుటకు కష్టపడ నవసరములేదు. ఇతడే నాయొక్క పూజారిగా యుంటాడని చెప్పెను. ఈ సరోవరములోని మకరములు , మత్స్యములు నాపరివారము లగును. నేను ఇచ్చట ప్రభాదేవి మరియు సత్యకన్ సమేతముగా కొలువుంటాను. ఇచ్చట నన్ను దర్శించుకునే వారి సకల బాధలను తీర్చెదను. అని అశరీరిగా చెప్పెను. రాజుగారి రోగములన్నియు శాతించెను. నీవు నన్ను ఇచ్చట దర్శించినది. చైత్రమాసము 10వ దినము , కావున ఆ దినము ఇచ్చట నాకు ఉత్సవము జరిపించుము అనెను. ఈ వివరములన్నియు తెలసుకొన్న కాయంకుళం రాజుగారు వచ్చి అచ్చట ఒక ఆలయము నిర్మించెను. అదియే శాస్తాంకోట్టై అయ్యప్పస్వామివారి ఆలయము.* రాజుగారికి రాణిగారికి రక్షగా ఆ దేవాలయము చుట్టూ అనేక వానరములు తిరిగి ఏర్పరచుచుండెను. ఈ ఆరాధనలు జరిపిన పిమ్మట రాజుగారు తన రాజధానికి వచ్చినపుడు కూడా ఈ వానర సైన్యము వెంబడించెను. అప్పటినుండి ఈ వానరములకు ప్రత్యేకమైన మర్యాదలు లభించసాగెను. ఈ ఆలయమునకు భక్తులు వచ్చి 12 దినములు సేవలు చేసినచో దీర్ఘకాల రోగములు కూడా శాతించునన్నది ప్రతీతి.


*రేపు ఎరిమేలి ధర్మశాస్తా ఆలయం విశిష్టత చదువుకుందాము*


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat