🍃🌷ఏకోనవింశోధ్యాయము - ఉభయైకాదశీ వ్రత కథనం, ద్వాదాశీ వ్రత కథనం:
(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll
🌻ఈశ్వరఉవాచ:
సాంబమూర్తి చెప్పుచున్నాడు....
ఓ మునీశ్వరా ఇకముందు శ్రావణ మాసములో రెండు పక్షములయందు వచ్చునటువంటి ఏకాదశుల ముందు చేయతగిన కృత్యమును చెప్పెదను సావధాన మనస్సు గలవాడవై వినుము.
ఓ చిన్నవాడా! శ్రేష్ఠంబైన ఈ ఏకాదశి వ్రతమును ఇదివరలో ఎరికిని నేను చెప్పియుండలేదు. రహస్యముగా ఉన్నది, కాబట్టి, ఈ ఏకాదశీ వ్రతము విశేషమగు పుణ్యమును ఇచ్చునదిగాను, మహాపాతకములను నశింపుచేయునదిగాను, మనుష్యులకు కోరిన కోరికల నిచ్చునది గాను, ఉపపాతకములను అన్నింటిని నశింపుచేయునది గాను, శ్రేష్ఠఁబగు వ్రతములు అన్నింటిలోను గొప్పదిగాను, శుభములనొసగునది గాను, సమస్తమైన మహామునులచేతను జెప్పబడెను.
కాబట్టి, ఓ మునీశ్వరా! ఈ ఏకాదశీ వ్రతమును నీకు జెప్పెదను పావధానచిత్తము గలవాడవై వినుము. దశమి దినంబున ప్రాతఃకాలంబున స్నానము చేసి, పరిశుద్ధుడై, సంధ్యావందనాది నిత్యకృత్యములను నెరవేర్చుకొని, వేదమును చదివిన వారు, పురాణమును తెలిసినవారు, ఇంద్రియములను జయించినవారు, ఈ మొదలగు సత్పురుషుల వలన అనుజ్ఞ గైకొని, దేవదేవుండగు భగవంతుని షోడశోపచారముల చేత పూజించి, పద్మముల వంటి నేత్రములు గల ఓ నారాయణమూర్తీ! ఈ దినంబున ఏకభుక్తంబును, ఏకాదశీ దినంబున ఉపవాసంబును జేసి ద్వాదశీ దినంబున భుజించెదను. ఓ భగవంతుడా! నన్ను రక్షింపుమని ప్రార్థించవలెను.
ఓ చిన్నవాడా! ఈ మూడు దినములయందు నియమముగా ఉండి, గురువులు, దేవతలు అగ్నిహోత్రము - వీరి సన్నిధానమునందే నివసింపుచు కామ ద్రోధాది దుష్టగుణములను విడిచి, శాంతస్వభావము గల వాడగుచు,ఈ మూడు దినములయందును భూమియందే పరుండవలయును.
ఓ చిన్నవాడా! ఆనంతరము ఏకాదశి నాడు ఉదయముననే లేచి, విష్ణువునందు చిత్తము గలవాడై తుమ్మినను దగ్గినను "శ్రీధర శ్రీధర" అని స్మరణ చేయుచు, పాషండులు మొదలగు వారిని చూచుట, వారితో సంభాషించుట, వారి మాటలను వినుట, ఈ మొదలగువాటిని మూడు దినములు విడిచి,ముక్తికి కారణమగు ఏకాదశీ వ్రతమును చేయవలయును.
అనంతరము మధ్యాహ్న కాలంబున నదులు మొదలగు పవిత్రములగు జలంబున స్నానము చేసి, క్రోధాదిదుర్గుణములను విడిచి, పంచగవ్య ప్రాశన చేసి, సూర్యునకు నమస్కారము చేసి, భగవంతుని శరణును పొంది, తన కులాచార సంబంధమగు కృత్యములను నెరవేర్చి యింటికి రావలెను.
అనంతరము శ్రద్ధాభక్తులతో గూడినవాడై, పుష్పములు, ధూపములు, దీపములు అనేక విధములగు నైవేద్యములు మొదలగువానిచే శ్రీధరుని పూజించవలయును.
ఒక కలశమునకు మంచిగంధము పూసి, దానికి నూతనమగు రెండు వస్త్రములను జుట్టి, దానిలో రత్నములు బంగారము ఉంచి, శంఖము, చక్రము, గద మొదలగు ఆయుధములచే ఒప్పబడుచుండెడి విష్ణుమూర్తి ప్రతిమను పూర్వమందు చెప్పబడిన కలశమునందుంచి, యధావిధిగా పూజించి, ఆ రాత్రియంతయు సంగీతము వాద్యములు హరికధా కాలక్షేపములు మొదలగు వానిచే వెళ్లబుచ్చి, ద్వాదశి నాడు తెల్లవారగానే లేచి స్నాన సంధ్యావందనాది నిత్యకృత్యములు నెరవేర్చి, శ్రీధరునియందే చిత్తము గలవాడై, ఆ ప్రతిమను తిరిగి పూజించి దక్షిణతో గూడ ఆ కలశమును ప్రతిమను ఆచార్యునకు దానమియ్యవలయఁను.
ఓ మునీశ్వరా! శ్రీధరుడు సంతోషించుగాక, నాకు విశేషమగు ఐశ్వర్యమును ఇచ్చుగాక యని ప్రార్ధించి, జగత్ప్రభువగు విష్ణుమూర్తిని పూజించి, నవనీతము మొదలగునవన్నియు బ్రాహ్మణునకు ఇచ్చి, మఱియు ఇతరులగు బ్రాహ్మణులకు కూడ భోజనము పెట్టి తన శక్తికొలది దక్షిణను ఇయ్యవలయును.
అనంతరము, భృత్యులు మొదలగు వారికిని భోజనము పెట్టి, గోవులకు పచ్చిక మొదలగు మేత వేసి, అనంతరము స్నేహితులు బంధువులు మొదలగు వారితో గూడి తాను భుజింపవలెను.
ఓ సనత్కుమారా! ఈ ప్రకారము శ్రావణ శుక్ల ఏకాదశీ వ్రతము చెప్పబడినది. ఈ ప్రకారముగానే శ్రావణ మాసములో బహుళ ఏకాదశి యందును వ్రతము చేయవలయును.
రెండు ఏకాదశుల యందును కృత్యములు సమానమే గాని, నామములు మాత్రము వేరు. అది ఏవిధముగా అనగా, శుక్ల పక్ష ఏకాదశి యందు పూజించినప్పుడు *శ్రీధరుడు* అనియు, బహుళ పక్ష ఏకాదశి యందు పూజించునప్పుడు *జనార్దనుడు* అనియు పూజింపవలయును.
శుక్ల పక్షంబున శ్రీధరుడనియును, బహుళ పక్షంబున జనార్దనుడనియు విష్ణుమూర్తి వేరువేరు నామముల చెప్పఁబడుచున్నాడు కాఁబట్టి ఈ విధమగు రెండు ఏకాదశీ వ్రతములను నీకు చక్కగా విమర్శించి చెప్పితిని.
దీనితో సమానమగు పుణ్యవ్రతము ఇదివరకు ఎక్కడను లేదు, యిక ముందును కలుగబోదు. కావున, యిది నీవు రహస్యముగానుంచుము, దుష్టువ్వుభావులకు జెప్పఁగూడదు.
🌻ఈశ్వర ఉవాచ:
ఓ మునీశ్వరుఁడా! ఇకముందు, ద్వాదశి యందు విష్ణువును గుఱించి పవిత్రారోపణ వ్రతమును చెప్పెదను వినుము. ఈ పవిత్రారోపణ విషయమై యిది వరకు దేవీ సంబంధమగు పవిత్రారోపణమునకు చెప్పబడినట్లుగానే కృత్యములన్నియును సమానము. దీనియందు గల విశేషములు మాత్రము చెప్పెదను, సావధానమనస్సు గలవాడవై వినుము.
దీనియందు వ్రతము చేయటకు తగిన అధికారి విషయమును గుఱించి చెప్పబడినది కావున దానిని గుఱించి చెప్పెదను.
బాహ్మణుఁడు, క్షత్రియుడు, వైశ్యుఁడు స్త్రీలు, శూద్రులు అందరును తమ ధర్మములయందు ఉండువారలై, భక్తితో కూడుకొని ఈ పవిత్రారోపణ వ్రతమును చేయవచ్చును.
విష్ణువును గురించి పవిత్రమును అర్పించునప్పుడు బ్రాహ్మణుఁడు ఆతోదేవీ అను మంత్రమును జెప్పుచు అర్పింపవలయును. స్త్రీలు, శూద్రులు విష్ణువు యొక్క పేరును చెప్పుచు పవిత్రమును అర్పింపలయును.
శివుని గురించి పవిత్రారోపణ వ్రత విషయములో కద్రుద్రాయ అను మంత్రమును చెప్పి బ్రాహ్మణుడు పవిత్రమును అర్పించవలయును. శివుని నామములను చెప్పి స్త్రీలు శూద్రులు పవిత్రమును అర్పించవలయును.
కృతయుగములో మణులతో గూర్చబడిన పవివిత్రమును, త్రేతాయుగములో బంగారపు పవిత్రమును, ద్వాపరయుగములో పట్టుపవిత్రమును, కలియుగములో ప్రత్తి సంబంధముగు పవిత్రమును అర్పణచేయవలెను.
ఈ పవిత్రారోపణమును యతీశ్వరులు మనస్సునందే చేయవలయును, ఈ పవిత్రములను వెదురు పాత్ర యందుంచి శుభ్రమగు నూతన వస్త్రములచే గప్పి ఓ ప్రభువా! నేను పాత్రను వస్త్రముచే కప్పిన రీతిగానే నా వ్రత లోపములు అన్నియును కప్పివేయుము, నీవు సంతసించుటకు ఈ పవిత్రారోపణ వ్రతమును చేసితిని, ఓ స్వామి! నా యందు దయగలవాడవై నే చేయు వ్రతమునకు విఘ్నము కలిగింపకుము అని ప్ర్రార్ధించవలెను.
ఓ దేవా! ఎల్లప్పుడు సమస్త విధములచే నీవే నాకు దిక్కు, ఓ స్వామీ! నేను ఈ పవిత్రస్వరూపుడనై నిన్ను సంతోషింపజేయువాడన అగుదును.
ఓ స్వామీ! వ్రతమునకు విఘ్నమును కలిగించెడి కామము క్రోధము మొదలగు దుర్గుణములు నాకు కలుగునీయకుము. ఇది మొదలు సంవత్సరము పూర్తి అగుపర్యంతము నీవు నన్ను రక్షింపుము, నీకు నమస్కారము చేసెదను.
ఈ ప్రకారము దేవతను ప్రార్థించి వెదురుచే నిర్మింపబడిన శోభస్కరమగు పాత్రయందుంచబడిన పవిత్రమును ఇట్లు ప్రార్ధించవలెను. ఓ పవిత్రమా! నేను సంవత్సర పర్యంతము చేసిన పూజను పవిత్రము చేయు కొఱకు ఇప్పుడు విష్ణు లోకము నుండి వచ్చితివి నీకు నమస్కారము.
ఓ స్వామీ! విష్ణు తేజస్సు వలన కలిగినదియు, మనోహరమైనదియు సమస్త పాపములను పోగొట్టునదియు సమస్త కోరికలనొసగునదియు ఈ పవిత్రము నీ శరీరమందుంచెదను.
ఓ స్వామీ! నారాయణమూర్తీ! నిన్ను పూజించుట కొఱకు ఆవాహన చేసితిని కావున నీకు నమస్కారము చేసెదను నాకు ప్రత్యక్షమగుము ప్రాతఃకాలంబున యీ పవిత్రమును నీకు అర్పణ చేసెదను.
అనంతరం పుష్పాంజలినిచ్చి ఆ రాత్రి జాగరణ చేయవలయును. ఇట్లు ఏకాదశినాడు ఆవాహన చేసి ద్వాదశి నాడు ఉదయంబున తిరిగి పూజింపవలెను.
గంధం, గరికెలు, అక్షతలు మొదలగువానితో అలంకరింపబడిన పవిత్రమును పుచ్చుకొని, ఓ స్వామీ! నన్ను పవిత్రమును చేయుటకును, సంవత్సర పర్యంతము నే చేసిన పూజ సఫలమగుటకును, నేను అర్పణచేయునటువంటి పవిత్రమును గ్రహింపుము.
ఓ స్వామీ! నేను చేసిన పాపమును పోగొట్టి నన్ను పవిత్రునిగా చేయుము, ఓ దేవతా సార్వభౌమా! నీ అనుగ్రహము వలన పరిశుద్ధుడనగుదును అని ప్రార్ధించి మూల బీజాక్షరములతో సంపుటి చేయబడిన మంత్రములతో పవిత్రమును స్వామికి అర్పణచేయవలెను.
మహానైవేద్యము, నీరాజనము మొదలగునవి జరిపి, పిమ్మట అగ్నిహోత్రమునఁదు మూలమంత్రముతో నెయ్యి, పరమాన్నము మొదలగు వానిని హోమము చేయవలయును.
ఈ మూలమంత్రంతోనే పవిత్రమునకు ఉద్వాసన చెప్పి, ఓ పవిత్రమా! సంవత్సరపర్యంతం నే చేసిన పూజను సఫలమగునట్లు చేసితివి నీవిప్పుడు విష్ణులోకమునకు వెళ్లుము, అని చెప్పి ఆ పవిత్రమును తీసి బ్రాహ్మణునికై ఇయ్యవలయును, లేక ఉదకంలోనైనా విడువవలయును. ఈ విధమగు విష్ణుని గుఱించిన పవిత్రారోపణ వ్రతమును నీకు జెప్పితిని, ఈ వ్రతమును చేసినావారు ఇహలోకమున సుఖములనొంది, అనంతరం మోక్షమునొందుదురు అని సనత్కుమార మునీశ్వరునితో సాంబ మూర్తి చెప్పెను.
♦️ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే - "ఉభయైకాదశీ వ్రత కథనం", "ద్వాదాశీ వ్రత కథనం" నామ ఏకోనవింశోధ్యాయస్సమాప్తః.
ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏
🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿
