🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉
🍃🌷చతుర్వింశోధ్యాయము - శ్రీ కృష్ణ జన్మాష్టమీ వ్రతకథనం
(శ్రీమదష్టాదశ మహాపురాణాలలో ఒకటైన శ్రీ స్కాంద పురాణాంతర్గతం)
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం l
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ll
🌻ఈశ్వర ఉవాచ:
సాంబమూర్తి చెప్పుచున్నాడు....
బ్రహ్మదేవుని కుమారుడవగు ఓ సనత్కుమారా!
పూర్వకల్పమందు భూదేవి దుష్టులైన రాక్షసుల భారమును సహింపలేనిదై దైన్యభావముచే వ్యాకులము కలదియగుచు బ్రహ్మదేవుని శరణు పొందెను. రాక్షసుల వలన తనకు కలిగిన బాధను భూదేవి చెప్పగా విని బ్రహ్మదేవుడు, దేవతలతో కూడుకొనిన వాడై, పాల సముద్రమందు వటపత్రమున శయనించియున్న విష్ణుమూర్తి వద్దకు వెళ్లి, అనేకవిధములుగా విష్ణుమూర్తిని స్తోత్రము చేసిరి.
ఇట్లు, నాలుగు ముఖంబుల వలననను పలుకుచుండగా నాలుగు దిక్కుల యందును ప్రతిధ్వనులు ఇచ్చుచున్నట్టి ఆ బ్రహ్మదేవుని స్తోత్రము విన్నవాడై, విష్ణుమూర్తి ఇట్లు చెప్పుచున్నాడు,
ఓ దేపతలారా. రాక్షసుల వలన మీరు భయపడవలదు. దేవకీ వసుదేవుల వలన నేను భూమి యందు అవతరించి, భూభారమును హరించెదను. కావున, మీరును భూమియందు యాదవులుగా పుట్టవలయును, అని చెప్పి ప్రభువగు విష్ణుమూర్తి అంతర్థానమునొందెను.
అనంతరము, విష్ణుమూర్తి, వసుదేవుని వలన దేవకీదేవియొక్క గర్భము నందు జన్మించగా, కంసునివలన భయముచే వసుదేవుడు ఆ కృష్ణమూర్తిని తీసుకొని వెళ్లి యాదవులు ఉండెడి ప్ర్రదేశమునందు విడిచి రాగా, అక్కడ కృష్ణుడు పెరుగుచుండెను.
అనంతరము కంసుడు సేనాసమేతుడై మధురా పట్టణమునకు వచ్చి యాదపులను బాధింపగా, ఆ పట్టణ జనులందరును దీనులై కృష్ణుని ఇట్లు ప్రార్ధించుచున్నారు.
భక్తులకు అభయమిచ్చువాడవును, శరణుపొందిన వారియందు ప్రేమ గలవాడవును, యోగీశ్వరులలో అగ్రేశ్వరుడవును అగు ఓ కృష్ణమూర్తీ! మా ప్రాణములకు బాధకలిగించెడి దుష్టులను సంహరించి మమ్ములను రక్షింపుము.
ప్రభువా! మేము ప్రార్థించి, విజ్ఞాపనము చేయుచున్నాము. ఆది ఏది అనగా నీవు జన్మించిన దినమందు చేయవలసిన కృత్యమేదియో మాలో ఒకరైనను ఎప్పుడును తెలిసికొనియుండలేదు ఆ విషయమును మీరు చెప్పినయెడల ఆ ప్రకారముగా ఆ దినమునందు రధకాంతి ఉత్సవమును చేసెదము. అని ప్రార్థించగా, అప్పుడు కృష్ణమూర్తి తనయందు వారికి ఉండెడి భక్తియును శ్రద్ధయును మిత్రభావమును జూచినవాడై, వారికి తన జన్మదినమందు చేయవలసిన విధానమంతయు జెప్పగా, వారు విన్నవారై యధాప్రకారముగా చేసిరి.
అప్పుడు భగవంతుండగు కృష్ణమూర్తి, వ్రతము చేసినవారికి అనేక విధములగు వరములనిచ్చెను. దీనిని గుఱించి పూర్వము జరిగిన కధ యొకటి కలదు, దానిని చెప్పెదను వినుము.
అంగ దేశమునందు అమిత్రజిత్తు అను రాజు కలడు. వానికి సత్సజిత్తు అను ఒక కుమారుడు గలడు. అతడు సమస్త రాజనీతిని ఎరింగినవాడై, సన్మార్గమునందు ప్రవర్తించుచు చతురంగబల సమేతుడై, ప్రజలకు అనురాగము కలిగింపుచు న్యాయముగా భూమిని ఏలుచుండెను. ఇట్లు కొంతకాలము వెళ్లగా దైవయోగముచే ఒకప్పుడు నాస్తిక మతస్థులతో సహవాసము కలిగి, పిమ్మట బహుకాలము వఱకు వారితోనే చెలిమి చేయుటవలన ఆ రాజు అధర్మప్రవర్తనుడై యుండెను.
వేదములు, శాస్త్రములు, పురాణములు మొదలగువానిని, అనేక విధములుగా ఆ రాజు నిందించుచుండెను. వర్ణాశ్రమ ధర్మముల యందును మిక్కిలి ద్వేషము కలవాడై యుండెను. ఇట్లు బహుకాలము జరుగగా... ఓ మునీశ్వరుడా! ఆ రాజు కాలవశముచే మరణము నొందెను. అంతట యమదూత వచ్చి, పాశములచే కట్టి, యముని వద్దకు తీసికొని వెళ్లి, అనేక విధములుగా బాధలు పెట్టి, దుర్మార్గుల సహవాసము కలిగి యుండుటవలన ఇతనిని నరకములలో పడవేసి, అనేక సంవత్సరములు యాతన పెట్టి, పాపముల నన్నిటి అనుభవింపచేసి, పిమ్మట పిశాచ శరీరములో ప్రవేశ పెట్టిరి. ఆకలి, దాహము మొదలగువానిచే పీడింపబడుచు, నిర్జల ప్రదేశముల యందు తిరుగుచుండెను.
ఒకప్పుడు ఒక వైశ్యుని దేహములో ప్రవేశించి, పుణ్యప్రదమగు ఆ మధురా పట్టణములో ప్రవేశించగా, ఇతడు పిశాచము పట్టినవాడని ఆ పట్టణ కావలివారలు వెడలగొట్టిరి. అప్పుడా పిశాచము వైశ్యుని దేహము విడిచిపోయెను.
అనంతరము ఆ పిశాచము అరణ్యముల యందును మునీశ్వరుల ఆశ్రమముల యందును తిరుగుచుండగా, ఒకప్పుడు దైవయోగము వలన, ఒకచోట కృష్ణాష్టమీ దినంబున మునీశ్వరులును బ్రాహ్మణులును వ్రతము చేయుచు విశేష పుణ్యప్రదమగు కృష్ణుని యొక్క పూజను గావించి, పిమ్మట ఆ రాత్రి విష్ణు నామస్మరణము, కధా శ్రవణము మొదలగువానిచే జాగరణను చేసిరి. ఆ పిశాచము ఇదియంతయు చూచుట వలనను, విష్ణు కధలను వినుట వలనను, ఆ క్షణమునందే పాపమువలన విడువబడి పరిశుద్ధుడై, నిర్మలమగు మనస్సు గలవాడగుచు పిశాచ శరీరము వదలిపోయెను. అప్పుడు యమదూతలు విడిచి పెట్టి వెళ్లగా, విష్ణుదూతలు వచ్చి, దివ్యవిమానం మీద ఎక్కించి, విష్ణులోకమునకు తీసికొని వెళ్లిరి. అక్కడ దేవతా సంబంధమైన భోగములనన్నియు అనుభవించి, ఆ వ్రతమహిమ వలన, విష్ణుసాయుజ్యమును పొందెను.
ఓ మునీశ్వరా! యధార్ధమును తెలిసికొనిన మునీశ్వరులు ఈ వ్రతమును సర్వకాలముల యందును ముఖ్యముగా చేయవలయునని పురాణములో జెప్పియున్నారు.
కావున, ఎల్లప్పుడును ఈ ప్ర్రతము చేసినవాడు కోరికలనన్నియును పొందును.
ఈ ప్రకారము కృష్ణజన్మాష్టమీ దినంబున శుభప్రదమైన వ్రతమును చేసినవాడు, ఈ లోకంబున సమస్త సుఖములు అనుభవించి, సమస్త శుభములను కోరికలను పొందును.
అంత్యకాలమందు దేవదూతలు వచ్చి, దేవ విమానమందు గూర్చుండబెట్టుకొని, స్వర్గలోకమునకు తీసుకొని వెళ్లుదురు.
ఓ బ్రహ్మకుమారా! అక్కడ సమస్త భోగములను అనుభవించి, పుణ్యంమిగులుట వలన భూలోకంలో గొప్పరాజుల కుటుంబంలో మన్మధునితో సమానమగు సౌందర్యం కలవాడై జన్మించి, ఏ విధమగు అశుభములను పొందక, సమస్త కోరికల యొక్క ఫలితం పొంచుండును.
పూర్వమున చెప్పబడినదియు, సమస్త శుభములతో గూడినటువంటి కృష్ణ జన్మ సంబంధమను చరిత్రను అనుసరించిన విగ్రహాదులు లిఖింపబడినవై ఎవని యొక్క దేవతా గృహమందుంచబడి పూజింపబడునో, ఎక్కడ సమస్త ఉత్సవములతో గూడుకొనినట్లుగా వ్రతములు చేయబడి, భగవంతుడు పూజింపబడునో, అటువంటి ప్రదేశంబున ఇతర రాజుల సంబంధమగు భయం, ఈతిబాధలు మొదలగునవి యెన్నడును కలుగవు.
మేఘుడు సస్యములకు ఉపయోగమగునట్లు వర్షించును. అతివృష్టి, అనావృష్టి, మూషకసదలభములు మొదలగువానివలన బాధలెన్నడును కలుగవు. కృష్ణ జన్మ చరితము పూజింపబడిన గృహము నందు సమస్త ఐశ్వర్యములు సమృద్ధిగానుండును. తిరిగి జన్మించుట అనే భయము కలుగదు, సత్పురుషుల సహవాసము వలనగాని, భక్తి వలన గాని, కృష్ణుని వ్రతమును స్థిరచిత్తుడై చూచినవాడు సమస్త పాపముల వలన విడువఁబడి, జన్మానంతరమున శాశ్వతమగు విష్ణులోకమును పొందును.
అని, ఈ ప్రకారంగా సాంబమూర్తి, సనత్కుమార మునీశ్వరునితో చెప్పినట్లుగా...
సూత మునీశ్వరుడు, శౌనకాదిమునీశ్వరులతో జెప్పెను.
♦️ఇతి శ్రీ స్కాందపురాణే శ్రావణమాస మాహాత్మ్యే ఈశ్వర సనత్కుమార సంవాదే -- "శ్రీ కృష్ణ జన్మాష్టమీ వ్రతకథనం" నామ చతుర్వింశోధ్యాయస్సమాప్తః.
ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః..🙏🙏
🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿
