అయ్యప్ప మాలధరించిన మండల కాలంలో ఉపవాస దీక్ష ఉండవచ్చా?
🟢 సమాధానం:
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప!
శబరిమల యాత్ర నియమావళి ప్రకారం భక్తులు పరిమితమైన, సాత్వికమైన ఆహారం తీసుకోవాలని సూచించబడింది. అయితే, కఠిన ఉపవాసాలు తప్పనిసరి అని ఎక్కడా పేర్కొనబడలేదు.
శబరిమల యాత్రలో భక్తులు సుమారు ఐదు రోజుల పాటు కొండలు, అడవులు, వాగులు దాటి కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో శరీరానికి అవసరమైన శక్తి, ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనవి.
ఈ దీక్ష యొక్క ప్రధాన ఉద్దేశం రుచులపై నియంత్రణ, సాత్విక జీవనం, ఇంద్రియ నిగ్రహం, ఆధ్యాత్మిక సాధన. శరీరాన్ని బలహీనపరిచే కఠిన ఉపవాసం దీక్ష లక్ష్యం కాదు.
"శరీరమాద్యం ఖలు ధర్మసాధనం"
ధర్మాన్ని ఆచరించడానికి ఆరోగ్యవంతమైన శరీరమే మొదటి సాధనం.
కాబట్టి, సాత్వికమైన మరియు పరిమితమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా దీక్షను, యాత్రను విజయవంతంగా పూర్తి చేయండి.
జై శబరీష భక్త బృందం..
