*భగవద్గీత - అంతరార్ధ విశ్లేషణ* " - 1వ భాగము.

P Madhav Kumar


భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలున్నాయి. ప్రతి అధ్యాయాన్ని "యోగము" అని పేరుపెట్టడం జరిగింది. వీటిలో ప్రస్తావించిన విషయాలను బట్టీ 1నుండి 6 అధ్యాయాలను "కర్మషట్కము" అని, 7 నుండి 12 వరకు అధ్యాయాలను "భక్తి షట్కము" అని, 13 నుండి 18 అధ్యాయాలను "జ్ఞాన షట్కము" అని పిలవడం జరిగింది.


కురుక్షేత్రంలో అర్జునుని కోరికపై రధసారధియైన కృష్ణుడు ఉభయసేనల మధ్య రథాన్ని నిలిపాడు. ఇరువైపులా మొహరించియున్న సేనలను అర్జునుడు చూశాడు. ప్రాణాలకు తెగించి యుద్ధానికి వచ్చిన బంధు, గురు, మిత్రులను చూశాడు. మనసు వికలం అయ్యింది, నీరసం ఆవహించింది.


హే కృష్ణా! వీరందరినీ హతమార్చి రాజ్యాన్ని పొందడమా! నాకు రాజ్యం వద్దు! నేను యుద్ధం చేయలేను! నాకు ఏంచెయ్యాలో తోచడం లేదు! కర్తవ్యాన్ని బోధించమని ప్రార్థించాడు.


ఇక్కడ హస్తినలో, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధంగా నున్న నా కొడుకులూ, పాండురాజు కొడుకులు ఏమి చేస్తున్నారు? అని ధృతరాష్ట్రుడు, సంజయుడిని ప్రశ్నించాడు. పాండురాజుని కొడుకులు అని సంబోధించడంలోనే ధృతరాష్ట్రుని మమకారం, ద్వందవైఖరి తేటతెల్లమైంది. పాండురాజు తన సోదరుడే కదా?


అందుకే ధృతరాష్ట్రుడిని ఒక గుడ్డివానిగా, అధర్మవర్తనులైన కొడుకుల పట్ల మమకారిగా, అజ్ఞానిగా చూపడం జరిగింది. మరి అటువంటి అజ్ఞానికి, శ్రీకృష్ణుడు తన విశ్వరూపం ఎందుకు చూపించాడు?


భవారణ్య ప్రవిష్టస్య ద్విజ్మోహ భ్రాంతచేతసః | యేన సందర్శితః పన్థా తస్మై శ్రీగురవే నమః ||


సంసారారణ్యమున ప్రవేశించి దిక్కు తెలియక భ్రాంతితో గూడియున్నట్టి జీవునకు ఎవడు మార్గమును చూపునో అట్టి గురువునకు నమస్కారము. 


అందరూ భగవంతుని అంశలే. మాయకు లోబడి, అజ్ఞానవసులై తన నిజస్వరూపాన్ని, ఆత్మశక్తిని మర్చిపోతున్నాడు మానవుడు. అన్నీ వుండికూడా పుత్రులయెడ మమకారంతో ధర్మాన్ని విడచి, మంచిచెడులు విస్మరించి, అజ్ఞానిగా ప్రవర్తించాడు ధృతరాష్ట్రుడు. సత్యాన్ని గుర్తుచేయడం కోసం అతనికి తన విశ్వరూపం చూపించాడు. అఙ్ఞానిని, జ్ఞానిగా మార్చడానికి తనవంతు కృషిచేశాడు జగద్గురువైన శ్రీకృష్ణుడు. గురువు సహాయము చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు. గుర్తించే అర్హత సాధకునికి వుండాలి. 


అక్కడ కురుక్షేత్రంలో మానవులందరి ప్రతినిధిగా అర్జునుడు వ్యవహరించాడు. మార్గదర్శిగా శ్రీకృష్ణుడు నిలబడ్డాడు. శ్రీకృష్ణుడు అర్జునునికి గీతను ఉపదేశించింది గుళ్ళోనో, ఆశ్రమంలోనో కాదు, యుద్ధక్షేత్రంలో. అందునూ ఇరుపక్షాలు యుద్ధానికి సిద్ధంగా నున్నప్పుడు.


జీవితమే ఒక యుద్ధము. శరీరమే కురుక్షేత్రం. ఇంద్రియవాంఛలే శత్రువులు. వీటివలన నిత్యజీవితంలో మానవుడు ఎదుర్కొంటున్న మొహాన్ని, భయాన్ని, అశక్తిని ఏకరవు పెట్టాడు పార్ధుడు. మానవుల విషాదాన్ని మొత్తం ప్రశ్నలతో సంధించాడు సవ్యసాచి. యుద్ధము చేయనని నీరసంతో కూర్చుండిపోయాడు.


అన్నింటినీ మౌనంగా విన్నాడు జగద్గురువు. కురుక్షేత్రమనే శరీరంలో అంతర్గతంతా వున్న శత్రువులను జయించలేక అసమర్థునిగా చతికిలబడటం చూసి, తనలో తాను నవ్వుకొని, మానవ శరీరాన్ని ధర్మక్షేత్రంగా ఎలా మలుచుకోవచ్చునో అర్జునునికి చెప్పదలిచాడు శ్రీకృష్ణుడు. 


పార్థునిలో నున్న సామర్ధ్యం కృష్ణునికి తెలుసు. అర్జునుడు ద్రోణాచార్య, కృపాచార్యుల నుండి ఏమి నేర్చుకున్నాడో గోపాలునికి తెలుసు. వాళ్ళు కేవలం ప్రాపంచిక విద్యలను మాత్రమే నేర్పేరు. ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలాగ, ఏమి చెయ్యాలో బోధించారు. కానీ వారు "నేను చేయగలను" అనే మనోధైర్యాన్ని శిష్యునికి కలిగించలేరు. ఆ శక్తిని ప్రసాదించే సామర్ధ్యం ఒక్క గురువుకి మాత్రమే ఉంటుంది. 


మానవులందరి ప్రతినిధియైన పార్ధునికి "మనోధైర్యాన్ని" కలిగించి, వాస్తవాన్ని తెలియజెప్పి, అంతిమ లక్ష్యాన్ని ఎలా సాధించాలో చెప్పాలని నడుంబిగించాడు జగద్గురువు.


తదుపరి భాగంతో మళ్ళీ కలుసుకుందాము...🌹

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat