*_🚩అయ్యప్ప చరితం - 17_🚩*

P Madhav Kumar



🕉☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️☘️🕉️


*‘‘లేదు దేవీ ! నేను చూసినప్పుడే ఆ హారం మెడలో వుండినది. భగవద్దత్తంగా భావిచుకుందాము ! ఆస్థాన పురోహితులను రప్పించి నామకరణం , పుట్టిన దిన మహోత్సవాలను జరిపించవలసి వుంది ఎవరక్కడ?’’* అంటూ పరిచారికలను పంపి రాజపురోహితులను పిలిపించాడు రాజశేఖరుడు.


*‘‘మహారాజా ! ఈ పసివాడు కారణ జన్ముడు ! మీ దంపతుల మీద కరుణతో హరిహరుల అనుగ్రహం ఈ పసివాడి రూపంలో మీకు లభించింది ! ఈ పసివానివల్ల మీకు ఆచంద్ర తారార్కమైన కీర్తిప్రతిష్ఠలు చేకూరుతాయి. మన రాజ్యంలో కూడా సుఖశాంతులు నెలకొంటాయి.  ప్రజలు సర్వశుభాలు పొంది ఆనందంగా జీవించగలరు!’’* అంటూ పురోహితులు చెప్పిన విషయాలు మరింత ఆనందాన్ని కలిగించాయి.. రాజదంపతులకు !

*‘‘మా పుత్రుడికి తగిన పేరును , జన్మ తిథి నక్షత్రాలను మీరే గురించి చెప్పండి!’’* అని అడగటంతో పసివాడు లభించిన సమయం మొదలైనవి గుణించారు పురోహితులు.


*‘‘మహారాజా ! మీకు లభించిన సమయాన్ని బట్టి అత్యంత శుభసమయంలో బాలుని ఆవిర్భావం జరిగి వుంటుంది , ఉత్తరా నక్షత్ర శుభ ఘడియలలో ! ఈవేళ ఫాల్గుణ శుక్ల పక్ష పంచమి , ఉత్తరా నక్షత్ర యుక్త శుభయోగంని జన్మదిన , జన్మ నక్షత్రాలుగా గణించాలి ! ఇక కంఠంలో మణిహారంతో మీకు లభించాడు గనుక మణికంఠుడనే నామం ఈ బాలునికి అన్ని విధాలా తగినది!’’* అని చెప్పారు!


*‘‘మణికంఠుడు ! చాలా బాగుంది పేరు ! ఇకపై మా పుత్రుడు మణికంఠుడని పిలవబడతాడు. ప్రజాలారా ! ఇడుగో మీ యువరాజు ! కన్నుల కరువు తీరా దర్శించుకోండి మీ భావి మహారాజును’’* అంటూ చూడవచ్చిన ప్రజలకు పసివాడిని చూపించి అందరి సమక్షంలో మణికంఠుడని నామకరణం చేశాడు రాజశేఖరుడు పసివాడికి !


*‘‘యువరాజు మణికంఠునికి జయము ! జయము !’’* చూడవచ్చిన పందల రాజ్య ప్రజలందరూ ఉత్సాహంగా జయజయధ్వానాలు చేశారు ! రాజ్యమంతటా పుత్రోత్సవ వేడుకలు జరిపారు !

మణికంఠుడు వచ్చిన వేళా విశేషంవల్ల కొద్దికాలంలో పాడి పంటలతో తులతూగసాగింది పందల రాజ్యం ! ఈతిబాధలు లేవు. అన్నిటికన్నా ఆనందకరమైన విషయం మణికంఠుడు వచ్చిన కొద్దికాలానికే రాణి గర్భవతియై సకాలంలో పుత్రునికి జన్మనిచ్చింది ! రాజదంపతుల చిరకాల వాంచితం ఈడేరింది ! కానీ మణికంఠునిపై వాళ్ల ప్రేమ , వాత్సల్యం తగ్గలేదు సరికదా మరింత ఎక్కువైనాయి ! ఇద్దరి పుత్రుల బాల్య చేష్టలు చూస్తూ ఆనందంగా గడపసాగారు!


మణికంఠుని

గురుకుల వాసం

కాలం వేగంగా గడుస్తున్నది ! మణికంఠుడు దిన దిన ప్రవర్థమానుడౌతున్నాడు ! అక్షరాభ్యాసం , ఉపనయన సంస్కారం జరిపి విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపించాడు రాజు !

ఏక సంథాగ్రాహి అయిన మణికంఠుడు వేదాలు , శాస్త్రాలు కొద్దికాలంలోనే అభ్యసించి అందరికీ ఆశ్చర్యం కలిగించాడు ! వాటితోబాటు క్షత్రియోచితాలైన విలువిద్య , కత్తిసాము , గుఱ్ఱపుస్వారి , మల్లయుద్ధం , శస్త్రాస్త్ర ఉపయోగ ఉపసంహరాలు గురుకులంలోనే వుంటూ నేర్చుకున్నాడు !

కొద్దికాలంలోనే విద్యాభ్యాసం పూర్తయింది


*‘‘మణికంఠా ! ఎంతో త్వరగా అన్ని విద్యలలో ప్రవీణుడివైన నిన్ను చూస్తుంటే ఆనందం కలుగుతున్నది ! ప్రయోజకుడైన శిష్యుని చూసుకుని గురువు హృదయం తృప్తితో నిండిపోతుంది ! రాజకుమారుడివైనా ఇక్కడ ఇతరులతో అరమరికలు లేకుండా గడిపావు ! సామాన్యుడిలా సేవలు చేశావు ! అందరికీ ఆదర్శప్రాయంగా గడిపావు ! తిరిగి వెళ్లాక నీ ప్రజలను ధర్మంగా పాలిస్తూ సత్యవంతుడివై జీవించు’’* అంటూ బోధించి ఆశర్వదించాడు గురువు విద్యారణ్యుడు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat