*జీవితం మీద మనకు విసుగు పుట్టినప్పుడు*
*"ఛీ మనిషిగా ఎందుకు పుట్టాను రా బాబూ"*
*అని మనం అనుకుంటూ ఉంటాం.*
*అసలు మనిషి జన్మ ఏమిటి? దీనికి విముక్తి ఎప్పుడు అనే విషయాలను తెలుసుకుందాం.*
*నిజంగా మానవ జన్మ అంత నీచనికృష్టమైనదా? అసలు మనం ఈ భూమ్మీద ఎందుకు పుట్టాం… ఎందుకు చనిపోతున్నాం? చనిపోయాక ఎక్కడికి పోతాం? ఇలాంటి ప్రశ్నలన్నీ మనిషికి సర్వసాధారణంగా వస్తుంటాయి.*
*మనం అనుకున్నట్లుగా మనిషి జన్మ నీచమైనది కాదు ఉత్తమోత్తమమైనది.*
*పునరపి జననం… పునరపి మరణం*
*అంటారు.*
*జన్మ అంటే మళ్లీ పుట్టడం…*
*అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టడమే జన్మ. కానీ తిరిగి మానవ జన్మే వస్తుంది అని మాత్రం చెప్పలేం. ఎందుకంటే మనం ఎలాంటి జన్మ ఎత్తాలో మనం సంపాదించుకున్న జ్ఞానం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కర్మ ఫలాలను బట్టే మనిషి జన్మ ఉంటుంది.*
*మనిషి జన్మ అనేది దేవుడికి మనిషి చేరువ కావడానికి దొరికిన ఓ అపూర్వమైన అవకాశం. భక్తి మార్గంలో ఉండి వైరాగ్యం చెంది భగవంతుడిని చేరుకోవడానికి మనిషి జన్మ తప్పితే మరో జన్మలో ఆ అవకాశం లేదు. అయినా పూర్వ జన్మ పుణ్య ఫలంతో సాలీడు, ఏనుగు, పాము, నెమలి వంటివి దేవుడిని పూజించి ముక్తి పొందినట్టు మన పురాణ గ్రంథాలు తిరగేస్తే తెలుస్తుంది. కానీ మనిషిగా పుట్టిన వారంతా భగవంతుడికి దగ్గరయ్యే మార్గాన్ని నిజంగా ఉపయోగించుకుంటున్నారా లేదా అనేది మనకు మనం ఆలోచించుకోవాలి. మనిషి పుట్టినప్పటి నుంచి తాను చెయ్యాల్సిన మంచి పనులు చేయక తప్పదు. సంసార సాగరంలో ఈదుకుంటూ పోవడం తప్ప మనకు మరో దారి లేదు. ఇందులో మరో దారి లేదు.*
*మనుషులకేనా చెట్లకు ఉండవా?*
*ఇవన్నీ మానవ మాత్రులకేనా చెట్టూ చేమలకు ఉండవా అని మీరనుకోవచ్చు. అక్కడికే వద్దాం. ఒక చెట్టుకు మొగ్గ వచ్చింది. అది పువ్వై ఆ తర్వాత కాయగా మారింది. పండిపోయి కొంతకాలానికి అది నేల రాలిపోతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే పిందెగానో, కాయగానో ఉన్నప్పుడు దానిని కొమ్మ నుంచి కోసి వేరు చేస్తున్నప్పుడు అది ఉన్న చోటు నుంచి నీరు కారుతుంది. కాయ మొదలు లోనూ ఆ నీటి తడిని మీరు చూడవచ్చు. కానీ పండు రాలినప్పుడు కొమ్మలో ఎలాంటి నీటి తడి ఉండదు. పండు రాలిన చోట కూడా నీటి తడి ఉండదు. కానీ కాయ కోస్తున్నప్పుడు నీటి తడి ఉండటానికి కారణం, అయ్యో మరిన్ని రోజులు నన్ను అంటిపెట్టుకుని ఉంటే అది పండు అయ్యేది కదా అని చెట్టు కొమ్మ కంట తడి పెడుతుంది. కాబట్టి అక్కడ నీటి తడిని మనం చూస్తుంటాం.*
*అలాగే కాయ మొదలులోనూ ఆ నీటి తడి ఉంటుంది. ''అయ్యో ముందుగానే నన్ను చెట్టు కొమ్మ నుంచి వేరు చేసేశారు కదా" అని కాయ కూడా బాధపడుతుంది. కానీ పండు విషయంలో అలా కాదు…. కాయ పండి రాలుతున్నప్పుడు చెట్టు కొమ్మన నీటి తడి కనిపించదు. పండు మొదలు లోనూ నీటి తడి ఉండదు. రెండింటిలోనూ ఓ పరిపక్వత వస్తుంది. దాని బంధం అయిపోయింది కాబట్టే పండు రాలిపోయిందని చెట్టు కొమ్మ అనుకుంటుంది. పండు కూడా తన కాలం ముగిసినట్టు అనుకోవడంతో అటూ ఇటూ రెండువైపులా బాధ అనేది ఉండదు. అలాంటిదే మనిషి జీవితం కూడా.*
*సంసార చక్రంలో ఉండి కుటుంబ వ్యవహారాలు సాగిస్తున్న సమయంలో ఉన్నట్టుండి పక్కకు తప్పుకుంటే అటు కుటుంబ సభ్యులకూ బాధే. మధ్యలోనే దూరమవుతున్నామని అతనికీ బాధే. ఆ వ్యక్తి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి నెమ్మదిగా జ్ఞానమార్గం వైపు అడుగులు వేస్తూ అందులో మునిగి తేలినప్పుడు అటు అతనికీ ఇటు కుటుంబ సభ్యులకూ బాధ ఉండదు. రెండువైపులా కన్నీరు కార్చడం అనేది ఉండదు. జ్ఞానమనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. నెమ్మదిగా రావాలి. అందుకే మెల్లమెల్లగా దాని వైపు అడుగులు వేయాలి.*
*కర్మ ఫలాలు ఏమిటో తెలుసుకుందాం…*
*జ్ఞానం, కర్మలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. జ్ఞానం పెరిగే కొద్దీ కర్మలు అంతరిస్తాయి. అనేక జన్మలుగా మనం చేసిన పాపపుణ్యాలు కర్మల రూపంలో మనతోనే వస్తాయి. ఈ కర్మలు మూడు రకాలుగా ఉంటాయి. ఆగామి, సంచితం, ప్రారబ్దం అని మూడు రకాలుగా ఈ కర్మలు ఉంటాయి. నిత్యం మనం చేసే కర్మలన్నీ ఆగామి కర్మల కిందికే వస్తాయి. కొన్ని వెంటనే ఫలిస్తాయి… మరికొన్ని తర్వాతి జన్మల్లో ఫలితాన్ని చూపిస్తాయి. మనం ఎన్ని పాపాలు చేశాం? ఎన్ని పుణ్యాలు చేశాం? దానదర్మాలు ఏమైనా చేశామా… లాంటివన్నీ ఆగామి కర్మల కిందిదకే వస్తాయి.*
*ఇక సంచిత కర్మలలోకి వెళదాం. మనం పూర్వ జన్మలో చేసిన కర్మలు ఈ జన్మకు వచ్చాయనుకోండి మనం ఈ జన్మలో కూడా వాటిని అనుభవించకుంటే అవి మళ్లీ రాబోయే జన్మకు వెళ్లిపోతాయి. వీటిని సంచిన కర్మలు అంటారు. ఉదాహరణకు గత జన్మలో మీరు ఒకర్ని హత్య చేశారనుకుందాం ఈ జన్మలో దాని ఫలితం అనుభవించాల్సి ఉన్నా రకరకాల కారణాలవల్ల అది జరగలేదు…*
*అది రాబోయే జన్మకు తరలిపోతుంది. దీన్ని సంచిత కర్మ అంటారు. ఇక ప్రారబ్దం విషయానికి వస్తే అంతా నా ప్రారబ్దం అని మనం తరచూ అంటూ ఉంటాం.*
*సంచిత కర్మల్లో కచ్చితంగా అనుభవించి తీరాల్సినవి ఉంటాయి. వాటినే ప్రారబ్దం అంటారు. ఇందాకటి ఉదాహరణ విషయానికే వస్తే గత జన్మలో మీరు చాలా హత్యలు చేశారనుకోండి… పైగా మీ దగ్గర పుణ్యబలం కూడా లేదనుకోండి జన్మ తీసుకోగానే దాని సమయం వచ్చినప్పుడు ఆ ప్రారబ్దం తగిన ఫలితం చూపిస్తుంది. ఇలాంటి చావు ఎవరికీ రాకూడదు అని అందరూ అనుకుంటూ ఉంటారు. అది ప్రారబ్ద కర్మ కాబట్టే అతను అనుభవించక తప్పలేదు. అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి.*
*పుణ్య కర్మలు పక్వానికి వస్తే ఆ వ్యక్తి దేవలోకంలో పుడతాడు. ఆ కర్మల ఫలితంగా అనేక భోగాలు అనుభవిస్తాడు. ఆ భోగాలు అయిపోగానే*
*"క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి"*
*అన్నట్లు మళ్లీ మానవ లోకాన్ని చేరుకుంటాడు. అక్కడ మళ్లీ మనిషిగానో, జంతువుగానో పుడతాడు. అంతకుముందు అతను దేవలోకంలో పుట్టినా అతనికి కర్మలు చేసే స్థూల శరీరం ఉండదు. ఎందుకంటే అక్కడ భోగాలు అనుభవించటానికి మాత్రమే అధికారం ఉంటుంది గాని కర్మలు చేసే అధికారం ఉండదు. పుణ్య కర్మలు పక్కన పెట్టి మనం పాపాలు మాత్రమే చేస్తూ పోయామనుకోండి అవి కూడా పక్వానికి వస్తాయి. అప్పుడు ఏ కుక్కగానో పిల్లిగానో పుట్టక తప్పదన్నమాట.*
🙏 *సర్వేజనాః సుఖినోభవంతు*
🕉️🍁🕉️🍁🕉️🍁🕉️🍁🕉️