'కార్తీక పౌర్ణిమ' నేపథ్యం , ప్రత్యేకతలు ఏంటి ? Kartheeka Pornami

P Madhav Kumar

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అంటే హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు. కానీ ఈ పరమ పవిత్రమైన రోజు వెనుకున్న నేపథ్యం , ప్రత్యేకతలు ఏంటి ?*
    
కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అంటే హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు. శివుడు , శ్రీమహా విష్ణువులని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి , వారి అనుగ్రహం పొందేందుకు ఈ కార్తీక మాసం కన్నా పవిత్రమైనది మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ కార్తీక మాసంలో కానీ ప్రత్యేకంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున కానీ శివాలయాలు , విష్ణువు నెలవైన పుణ్యక్షేత్రాల్లో భగవంతుడిని దర్శించుకోవాలనుకునే భక్తుల తాకిడి అధికంగా వుంటుంది. ఇదే కార్తీక మాసాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తుంటారు. వారాణాసి లాంటి ఉత్తర భారతం ప్రాంతాల్లో ఇదే రోజుని దేవ దీపావళి , దేవ దివాళి అని అంటుంటారు. ముఖ్యంగా ఈరోజున వారణాసిలోని గంగా నది ఒడ్డున వున్న ఘాట్లు అన్నీ దీపాల అలంకరణతో శోభాయమానంగా వెలిగే దృశ్యం చూపరులని కట్టిపడేస్తుంది. అలాగే దక్షిణ భారత దేశంలో కొన్ని చోట్ల త్రిపుర పూర్ణిమ , త్రిపురారి పూర్ణిమ అని పిలుస్తుంటారు. శివుడు త్రిపురాసురుడిని అంతమొందించింది ఈరోజే కావడంతో... ఈ కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణిమ , త్రిపురారి పౌర్ణమి అని కూడా పిలుచుకుంటుంటారు.

కార్తీక పౌర్ణమి రోజునే విష్ణువుని కూడా పూజించడానికి ఓ కారణం వుంది. మహాప్రళయం బారి నుంచి మనుని రక్షించడానికి ఆ శ్రీ మహా విష్ణువు మత్సావతారం ఎత్తింది ఈ కార్తిక పౌర్ణమి రోజునే. అందుకే ఇవాళ విష్ణువుని కూడా ఆరాధిస్తుంటారు. ఈ కార్తీక పౌర్ణమికి ప్రభోదిని ఏకాదశికి కూడా ఓ సంబంధం వుంది. ప్రభోదిని ఏకాదశితో ఆరంభం అయ్యే చతుర్మాసం పండగలన్నీ మళ్లీ నాలుగు నెలల తర్వాత ఈ కార్తీక పౌర్ణమితో ముగుస్తాయి.

*ఈ పౌర్ణమికి త్రిపుర పూర్ణిమ అని మరొకపేరు.*

*కార్తీక పౌర్ణమి , కార్తీక పూర్ణిమ ఎలా వచ్చింది ?*

మహాభారతం ప్రకారం తారకసురుడిని శివుడి తనయుడు కార్తీకేయ అంతమొందిస్తాడు. అయితే , ఈ ఘటన తర్వాత తారకసురుడి ముగ్గురు కుమారులు బ్రహ్మ దేవుడిని పూజించి , మెప్పించి , ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు. ఎవరివల్లా మరణం లేకుండా వరంకోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ. అలాగైతే రథంకాని రథంమీద , విల్లుకాని విల్లుతో , నారికాని నారి సారించి , బాణంకాని బాణం సంధించి , మూడు నగరాలూ ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురినీ ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు. ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు. ఆ వర బలంతో పట్టణాలతో సహా సంచారంచేస్తూ లోకాలన్నింటా కల్లోలం సృష్టిస్తున్నారు. వివిధ లోకవాసులు బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు. విష్ణువు దగ్గర కెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకా శక్తిలేదని , వారిని వెంటపెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు. దేవతలందరూ సహకరిస్తే తానీ పని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది. మేరు పర్వతం విల్లుకాని విల్లుగా , ఆదిశేషువు అల్లెతాడు కాని అల్లెతాడుగా , శ్రీమహావిష్ణువు బాణం కాని బాణంగా మారారు. వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురులను (మూడు పట్టణాల యజమానులైన రాక్షసులను) సంహరించాడని , అందువల్ల ఈ పేరు వచ్చిందనీ పురాణ కథనం.


కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి ఆ పరమ శివుడిని పూజించి రోజంతా ఉపవాసం ఉండటం భక్తులకి ఆనవాయితీ. కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం చేస్తే , శరీరానికి ఎన్నో శక్తులు చేకూరుతాయని... అందులోనూ పవిత్రమైన నదుల్లో ఈ నదీ స్నానం మరింత పవిత్రతని , పుణ్యంని చేకూరుస్తుందనేది భక్తుల బలమైన విశ్వాసం. అందువల్లే కార్తీక పౌర్ణమి రోజున ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వారణాసి భక్తుల రాకతో కిటకిటలాడుతుంటుంది.

*దీపారాధన :*
ఇంట్లో తులసి మొక్కకు కానీ లేదా దేవాలయాల్లో కానీ ఇవాళ దీపారాధన చేస్తే మరింత పుణ్యం , పూజా ఫలం దక్కుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. కొంతమంది కార్తిక పౌర్ణమి రోజున 365 దీపాలు వెలిగిస్తుంటారు. దీనికి అర్థం.. సంవత్సరంలో ఒక్కో రోజుకి ఒక్కో దీపం చొప్పున అన్ని దీపాలు ఈ పరమ పవిత్రమైన రోజే వెలిగించి మీ అనుగ్రహం కోరుకుంటున్నాను దేవా అని.

*సత్యనారాయణ వ్రతం :*
సత్యనారాయణ వ్రతం జరుపుకోవడానికి కార్తీక పౌర్ణమి కన్నా అతి పవిత్రమైన రోజు మరొకటి లేదు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకు కారణం ఆ శ్రీ మహా విష్ణువుకి ఈ కార్తీక పౌర్ణమి అతి ప్రీతి పాత్రమైనది కావడమే. అందుకే మిగతా రోజుల్లో సత్యనారాయణ వ్రతం చేయడం కన్నా కార్తీక పౌర్ణమి రోజున చేసే వ్రతానికే పూజా ఫలం అధికం అని అంటుంటారు పెద్దలు.

*ఏకాదశి రుద్ర అభిషేకం :*
ఈరోజు శివనామస్మరణతో మోగిపోయే ఆలయాలన్నింటిలో సర్వ సాధారణంగా కనిపించేది ఏకాదశి రుద్ర అభిషేకం. పదకొండుసార్లు రుద్ర చమకం లేదా శివ నామస్మరణతో శివుడిని అభిషేకించడమే ఈ ఏకాదశి రుద్ర అభిషేకం ప్రత్యేకత.

శివుడు , విష్ణువులని పూజించే పరమ పవిత్రమై రోజుగా హిందువులకి ఈ కార్తీక పౌర్ణమి అతి ముఖ్యమైనది కాగా.. మరోవైపు సిక్కులు , జైన మతస్తులు కూడా ఈ కార్తీక పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటుంటారు. సిక్కులు దైవంగా భావించే శ్రీ గురు నానక్ పుట్టింది కార్తీక పౌర్ణమి రోజే కావడంతో సిక్కులు ఈ రోజుని పవిత్రమైనదిగా భావిస్తారు. జైన్లు కూడా ఈ కార్తీక పౌర్ణమిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం విశేషం.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat