🙏బసవ పురాణం - 22 వ భాగము🙏

P Madhav Kumar


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


అది విని కల్యాణ కటక ప్రజలందరూ గజ గజ వణికిపోయారు. మిగిలిన భక్తులంతా తలొక దిక్కుకూ చెదిరిపోయారు. బిజ్జలుని తర్వాత పట్టం కోసం వారసులు తమలో తాము కలహించుకొని నశించారు. గుర్రాల తోకల వెంట నిప్పులు రాలాయి. ఏనుగులూ ఏనుగులూ కొట్టుకొని చచ్చాయి. ఎవరో శత్రువులొచ్చారని భ్రమపడి బిజ్జలుని మంత్రులూ సైన్యమూ తమలో తామే కొట్టుకొని మరణించారు. ఈ విధంగా బసవని శాపం సత్యమయిందా అన్నట్లు కల్యాణ నగరం పాడుబడ్డది!

బసవన్న ఈ వార్తలన్నీ విన్నాడు. కూడల సంగమేశ్వరానికి చేరుకున్నాడు. అక్కడ తన గురువు సంగమ దేవుణ్ణి చూచాడు. ‘‘తండ్రీ! నీ యాజ్ఞతో భూమి మీదికి వచ్చి చేయవలసిన పనులన్నీ చేశాను. ఇంక నన్ను నీలోనే విశ్రాంతి తీసుకోని’’ అని ప్రార్థించాడు. సంగమ దేవుడు బసవణ్ణి దీవించి తన ప్రసాదం తినిపించి కొడుకును కౌగిలించుకున్నాడు. ఇరువురూ గర్భగుడిలోకి పోయారు. అంతే సంగమదేవుడూ కన్పడలేదు. బసవన్నా కన్పడలేదు. ఇద్దరూ లింగంలో అదృశ్యమైనారు.

ఆ క్షణమే దివి నుండి పూల వానలు కురిశాయి. భక్తులంతా జయజయధ్వానాలు చేశారు. ‘‘గాలి నుండి సుడిగాలి పుట్టి మళ్లీ గాలి లోపలే కలిసిపోతుంది. అలలు సముద్రంలో నుండే పుట్టి తిరిగి సముద్రంలోనే కలిసిపోతాయి. మెరుపుతీగ గగనంలో పుట్టి తిరిగి గగనంలోనే సమసిపోతుంది. నీరు మేఘాలుగా మారి వర్షమై, వర్షం మళ్లీ సముద్రపు నీటిలోనే కలిసిపోతుంది. అలాగే బసవయ్యా! భక్తజనోద్ధరణ కోసం నీవు సంగమేశ్వరుని నుండి వచ్చి తిరిగి ఆయనలోనే కలిశావు. పూవూ, తావీ విడదీయరానట్లు నీవూ, శివుడూ ఒక్కటే!’’ అని మాదిరాజయ్య, మాచిదేవుడు మొదలైన సమస్త భక్తులూ బసవణ్ణి స్తుతించారు. బసవన్న ప్రసాదించిన సద్భక్తి భావంతో వారంతా తన్మయులై శివానంద సాగరంలో ఓలలాడారు!

ప్రథమాధ్యాయము సమాప్తము

ద్వితీయాధ్యాయము

ముగ్ధ సంగయ్య కథ

కల్యాణ కటకంలో ముగ్ధ సంగయ్య అనే భక్తుడున్నాడు. అతడు ప్రపంచ జ్ఞానం లేని అమాయకుడు. కొంత మంది వేశ్యల ఇంటికి పోతుంటే చూచి అది కూడా రాత్రి చేసే శివపూజలో ఒక భాగమనుకొని తానూ వేశ్య ఇంటికి పోతానని చెప్పాడు బసవన్నకు. బసవన్న చిరునవ్వు నవ్వి ముగ్ధ సంగనికి సర్వాలంకారాలు చేయించి పంపాడు. సంగడు ఒక వేశ్య ఇంటికి పోయాడు. ఆమె సంగణ్ణి ఆదరంతో ఆహ్వానించి అర్ఘ్య పాద్యాదులిచ్చింది. ముగ్ధ సంగడు జీవితంలో ఎన్నడూ వేశ్యలను చూచి ఎరుగడు. అందుకని ఆమెను చూచి ‘విభూతి పూసుకో శివ పూజ మొదలుపెడదాము’ అన్నాడు- ఆమె ఎవరో యోగినిగా భావించి.

‘మేము పచ్చ విభూతి పూస్తాము. ఇది మా సంప్రదాయం’ అని పసుపును చూపించిందామె నవ్వి.

‘రుద్రాక్షల దండ ఏదీ?’ అని అడిగాడు ముగ్ధ సంగయ్య. ‘మేము పాల సముద్రంలో పుట్టిన తెల్ల రుద్రాక్షలు వాడుతాము’ అని తన ముత్యాల దండ చూపింది.

‘యోగీశ్వరీ! నీ జటాజూటమేదీ?’ అన్నాడు సంగయ్య.

‘సగం శివ పూజా ప్రసాద కుసుమాల కోసం ఉంచి మిగిలిన సగమూ జడలుగా అల్లాను’ అని తన వాలుజడలను చూపింది వేశ్య!

‘కచ్చడం కట్టావా?’ అని అడిగాడు సంగయ్య.

‘కచ్చడమేమిటి? ఇదుగో సర్వాంగ కచ్చడం’ అని తన చీరె చూపింది వేశ్య!

‘మీ సంప్రదాయమేమిటి? మీ గురువెవరు?’ అని ప్రశ్నించాడు సంగయ్య.

‘మాది గౌరీ సంప్రదాయం. శివుడు తపస్సు చేసేటప్పుడు హిమాలయాలలో పార్వతి శివుణ్ణి గెల్చిందే ఆమె సంప్రదాయమిది. శక్తి స్వరూపిణి అయిన జగదేక సుందరి మాకు గురువు’ అని చెప్పింది వేశ్య.

ముగ్ధ సంగడు ఇదంతా నిజమేనని నమ్మాడు. ఆమె పడక గది పూజా మందిర మనుకున్నాడు. హంసతూలికాతల్పం, శివ సింహాసనమని భావించాడు. అక్కడి నృత్య, వాద్య, కేళికలన్నీ పూజాక్రమం కాబోలుననుకున్నాడు. మరునాడు వచ్చి అందరికీ ‘రాత్రి నేనొక వింత యోగినిని చూచాను. అలాంటి యోగిని ఎక్కడా లేదు’ అని చెప్పగా విని అంతా నవ్వి ముగ్ధ సంగయ్యను ఆటలు పట్టించారు.

రుద్ర పశుపతి కథ

పూర్వం రుద్ర పశుపతి అనే ముగ్ధ భక్తుడొకడు ఉండేవాడు. ఒకనాడు ఆయన ఆదిపురాణం వింటున్నాడు. పౌరాణికుడు క్షీర సాగర మథన కధ చెపుతూ శివుని హలాహల భక్షణ వృత్తాంతం చెప్పాడు. రుద్ర పశుపతి అది విన్నాడు. విని ‘ఏమిటి శివుడు విషం తిన్నాడా?’ అని నిలుచున్న పాటనే నేలపై పడి ఏడ్వసాగాడు. ‘‘విశే్వశ్వరా! నిన్ను దేవ దానవులు ఇర్వురూ కలిసి వెఱ్ఱివాణ్ణి చేశారు. లేకుంటే ఎవరైనా విషం తాగుతారా? అయ్యో ఇంక నాకు దిక్కెవరు? గౌరవమ్మా! సగం దేహమై వున్నా నీవైనా చెప్పలేకపోయావా? ప్రమథులారా! వీరభద్రుడా! ఏం చేస్తున్నారు

మీరంతా?🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat