_అయ్యప్ప సర్వస్వం - 75_*తుమ్మగుంట శ్రీ అయ్యప్ప క్షేత్రము - 3*

P Madhav Kumar

 *


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*తుమ్మగుంట శ్రీ అయ్యప్ప క్షేత్రము - 3*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*వరద ప్రమాదము నుండి కాపాడుట*


ఒక సారి కుంభవృష్టి ఎడతెరపిలేకుండా కురిసి ఒక రాత్రివేళ తుమ్మగుంట సమీపమునగల చెరువులు తెగి ఉధృతముగా వరద గ్రామమును ముంచెత్తసాగెను. ఈ భయంకరపు టుప్పెనకు గ్రామస్థులు తాళ్లసహాయముతో కుటుంబసభ్యులను అయ్యప్ప ఆలయముదగ్గర వున్న మెరక ప్రాంతమునకు చేర్చుకొనసాగిరి కళ్ళ ముందు తమగృహములు నీటమునుగుచుండుట , పశువులు భీతితో పరుగులు తీయుట , భయముతో జనాల ఆర్తనాదములు , అంతకంతకు పెరుగుతున్న వరదమట్టము మునకవేయుటకు సిద్దముగావున్న మెరక ప్రాంతము , ప్రాణభీతితో క్షణమొక యుగముగా వెళ్ళదీయువేళ ఒక గ్రామస్థుడు భయావహుడై అయ్యప్ప వృక్షము వద్ద చేరి ఆర్తత్రాణ పరాయణ తమ అనుగ్రహబలముతో దేశముగాని దేశమువచ్చి మేము ఈ రోజు కుటుంబములతోసహ జలసమాధి యగుచున్నాము. మామొర ఆలకించి శబరిమల నుండి తరలివచ్చిన తమయెదుట యీఉపద్రవము పాలగుచున్నాము. ప్రాణ భిక్షపెట్టి కాపాడే కరుణమూర్తివి నీవేయని పలురీతుల ప్రార్థించగా అప్పుడు వృక్షము నుండి ఒక కాంతి పుంజము శ్వేతహయారూఢుడై ఖడ్గము ధరించిన స్వామి అయ్యప్ప దివ్యరూపము పయనించి మీకు యేలాంటి భయములేదు వరద నిర్మూలనకు నేను వెళ్ళుచున్నానని.. అభయమిచ్చి ముందుకుసాగిన కొలది క్షణములలో తుమ్మగుంట సమీపమునగల వావిళ్ళు దంపూరు చెరువులు తెగి వరద కొద్దిక్షణములలో తగ్గిపోయెను. ఇటులవరద ప్రమాదమునుండి కాపాడిన ఆర్తత్రాణ పరాయణుడు తుమ్మగుంట అయ్యప్ప స్వామి. ప్రమాదమును తొలగించిన ఆనందముతో భక్తులు స్వామిని వేనోళ్ల కీర్తించిరి.


*కరువు కోరల నుండి విముక్తి కలిగించిన అయ్యప్ప*


ఒక పర్యాయము వర్షాభావమువల్ల భయంకర కరువు యేర్పడెను. నిల్వవుంచిన ధాన్యము అయిపోగా తిండి గింజలకు జనులు అల్లాడుటయేగాక క్షుద్బాధతో అసంఖ్యాక జనులు మృత్యువాతపడసాగిరి. ఈ ఘోరకలి నుండి విముక్తి కలిగించుటకు స్వామి అయ్యప్ప తప్ప మరెవ్వరు లేరని తలంచి స్వామిని ప్రార్థించసాగిరి. స్వామి భక్తుని ఆవహించి సమీపమున గల తటాకము నుండి బంకమన్నును తెచ్చి పెరుగులో కలుపుకొని ఆహరముగా తీసికొనమని దీనివలన ఎలాంటి ఉపద్రవములేకుండా భూమాత కాపాడునని వర్షములుకురిసి ధాన్యము పొందిన తరువాత ప్రతివారు తాము త్రవ్వినగోతిలో ధాన్యమునింపి ఋణము తీర్చుకొనమని అనతివ్వగా దైవముపై భారమువేసి పై విధముగా ఆచరించి వర్షము కొరకు పరమేశ్వరునికి ఘటాభి షేకములు , విరాటపర్వపారాయణ , వరుణ జపములు చేయగా కుంభవృష్టి కురిసి పొలములు సాగుచేసుకొని పంటులు పండించిరి. యీలాకొన్ని మాసములు తమ ఆర్తి దీర్చిన భూమాతకు సెలవిచ్చిన ప్రకారము వారు  త్రవ్విన గోతులలో ధాన్యములనింపిరి కొన్ని మాసములు రేగడమట్టి పెరుగు ఆహారమును పిల్లాపాపలతో భుజించిన వారిపై యెలాంటి ప్రమాదము కలగకుండా భూమాత కరుణ అయ్యప్ప అనుగ్రహము ఇలాంటి నిదర్శనములు నాడేగాక ఈ నాటికి జరుగుచున్నవి. స్వామి వారిసేవలలోను సమస్యల పరిష్కారములోను అయ్యప్ప భక్తులపై ఆవహించి సందేశము లిచ్చుట అలవాటుగా మారినది.


*(సశేషం)*


*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*


*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*


*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*


*అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణం అయ్యప్ప*


*లోకాః సమస్తా సుఖినోభవంతు*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat