అష్టాదశ శక్తి పీఠాలు

P Madhav Kumar
పురాణ గాథలు, ఆచారాల పరంగా లయకారకుడైన పరమ శివుడి అర్ధాంగి పార్వతిదేవిని ఆరాధించే ఆలయాలు ఉన్న మహిమాన్విత ప్రదేశాలను శక్తి పీఠాలుగా పేర్కొంటారు. అసలు శక్తి పీఠాలు ఎన్ని? మనదేశంలో చాలామందికి తెలిసిన శక్తి పీఠాలు 18. అయితే, ‘ప్రాణేశ్వరీ ప్రాణధాత్రీ పంచాశత్పీఠరూపిణీ’ అని లలితా సహస్రనామావళి 51శక్తి పీఠాలు ఉన్నట్లు చెబుతోంది. పురాణ గ్రంథాలను పరిశీలిస్తే, 108 శక్తి పీఠాలు ఉన్నట్లు తెలియజేస్తున్నాయి. కాళీ పురాణంలో 18 శక్తి పీఠాల గురించి చెబితే, దేవీ భాగవతంలో 66 శక్తి పీఠాలు ఉన్నట్లు చెప్పారు. 
పురాణ కథ

దాక్షాయణి శరీరాన్ని మోసుకెళుతున్న శివుడు - 17వ శతాబ్దపు కాంగ్రా శైలి చిత్రం
ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.

కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది.

18 శక్తిపీఠాలు

కొల్హాపూర్ మహాలక్ష్మి
అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకం:

లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే

అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా

వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్
కంచి కామాక్షి
ఈ శ్లోకంలో ఉన్న వివిధ స్థలాలను గుర్తించడంలో కొన్ని భేదాభిప్రాయాలున్నాయి. ఒక వివరణ ప్రకారం ఈ స్థలాలు ఇలా ఉన్నాయి

1 శాంకరి - శ్రీలంక :
ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం. ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.
2 కామాక్షి - కాంచీపురం:
తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
3 శృంఖల - ప్రద్యుమ్న నగరం:
పశ్చిమ బెంగాల్ - ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.
4 చాముండి - క్రౌంచ పట్టణము:
మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.
5 జోగులాంబ - ఆలంపూర్:
తెలంగాణ - కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుంగభద్ర' & Krishna నదులు కలిసే స్థలంలో ఉంది.
6 భ్రమరాంబిక - శ్రీశైలం:
ఆంధ్ర ప్రదేశ్ - కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లికార్జునస్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.
7 మహాలక్ష్మి - కొల్హాపూర్
మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.
8 ఏకవీరిక - మాహుర్యం :
లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును.
9 మహాకాళి - ఉజ్జయిని:
మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉంది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.
10 పురుహూతిక - పీఠిక్య లేదా పిఠాపురం:
ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.
11 గిరిజ - ఓఢ్య:
జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒడిషా - వైతరిణీ నది తీరాన ఉంది.
12 మాణిక్యాంబ - దక్షవాటిక :
లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.
13 కామరూప - హరిక్షేత్రం:
గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.
14 మాధవేశ్వరి - ప్రయాగ (అలహాబాదు):
ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో - ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.
15 వైష్ణవి - జ్వాలాక్షేత్రం:
కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.
16 మంగళ గౌరి - గయ:
బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు.
17 విశాలాక్షి - వారాణసి:
ఉత్తర ప్రదేశ్.కాశీ విశ్వనాధ ఆలయానికి సమీపంలో విశాలాక్షి అమ్మవారి మంధిరం ఉంది.విశ్వనాధుని దర్శించుకున్న తరువాత భక్తులు విశాలాక్షిదేవిని దర్శించడం ఆచారం.ఈ దేవాలయ పూజలు రెండు వేలల నాట్టు కోట్టై నగర సత్తరం వారిచే నిర్వహించబడుచున్నది.
18 సరస్వతి - జమ్ము:
కాష్మీరు - అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరులో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉందంటారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat