శ్రీ రుక్మిణీ కల్యాణము, కథారంభము భావయుక్తంగా

P Madhav Kumar



▪️ *ముందుమాట*:- మన తెలుగుల పుణ్యపేటి, జాతీయ మహా కవి, సహజ కవి, బమ్మెఱ పోతనామాత్యుల వారి ప్రణీతమైన శ్రీమద్భాగవతము నందలి అనేక అద్భుతమైన ఉపాఖ్యానములలో రుక్మిణీ కళ్యాణము (దశము స్కంధము - పూర్వ భాగము), గజేంద్ర మోక్షణము (అష్టమ స్కంధము), ప్రహ్లాద చరిత్ర (సప్తమ స్కంధము), వామన చరిత్ర (అష్టమ స్కంధము), కుచేలోపాఖ్యానము (దశమ స్కంధము - ఉత్తర భాగము) అను అయిదూ పంచ రత్నాలుగా బహుళ ప్రసిద్ధి పొందాయి.


▪️ఈ రుక్మిణీ కల్యాణము తెలుగులకు మిక్కిలి ప్రీతిపాత్ర మైనది. పూర్వము నుండి దీనిని పారయణ చేయు సంప్రదాయము కలదు. *కళ్యాణము విఘ్నాలు లేకుండా శీఘ్రమే జరుగుటకు రుక్మిణీ కళ్యాణ పారాయణను ప్రయోగించి సత్ఫలితములను పొందు సంప్రదాయం తెలుగు కుటుంబాలలో సర్వసాధారణమే*.


▪️జాలతెలుగులారా! ఇట్టి రత్నాన్ని, మీరు ఆనందంగా ఆస్వాదిస్తారని అందిస్తున్నాము.


▪️ *శ్రీ రుక్మిణీ కల్యాణము : రుక్మిణీకల్యాణ కథారంభము*



▪️1 


▪️శ్రీకంఠచాప ఖండన!

పాకారిప్రముఖ వినుత భండన! విలస

త్కాకుత్స్థవంశమండన!

రాకేందు యశోవిశాల! రామనృపాలా!


▪️ *భావము*:- శ్రీరామచంద్ర ప్రభు! నీవు శివధనుస్సు విరిచిన మొనగాడవు. ఇంద్రుడు మొదలైన దేవతలు సైతం కీర్తించేలా యుద్ధం చేసిన వాడవు. ప్రసిద్ధమైన కాకుత్థ్స వంశానికి అలంకారమైన వాడవు. నిండు పదహారు కళల పూర్ణచంద్రుని లాంటి కీర్తి మెండుగా వ్యాపించిన వాడవు. ప్రజలకి ఆనందం పంచే మహారాజువి.


▪️ 2 


▪️ఖగనాథుం డమరేంద్రు గెల్చి సుధ మున్ గైకొన్న చందంబునన్

జగతీనాథులఁ జైద్యపక్షచరులన్ సాళ్వాదులన్ గెల్చి భ

ద్రగుఁడై చక్రి వరించె భీష్మకసుతన్ రాజీవగంధిన్ రమా

భగవత్యంశభవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్.


▪️ *భావము*:- పూర్వం గరుత్మంతుడు ఇంద్రుణ్ణి గెలిచి అమృతం గ్రహించి నట్లు, శిశుపాలుని పక్షం వారైన రాజు లందరిని గెలిచి, శ్రీకృష్ణుడు రుక్మిణిని పెండ్లాడేడు. ఈమె భీష్మకుడు అనే మహారాజు కూతురు. ఈమె బహు చక్కటిది, గొప్ప సుగుణాలరాశి, లక్ష్మీదేవి అంశతో పుట్టినామె.


▪️ 3 


▪️అనిన రాజిట్లనియె “మున్ను రాక్షసవివాహంబున స్వయంవరమునకు వచ్చిన హరి రుక్మిణిం గొనిపోయెనని పలికితివి; కృష్ణుం డొక్కరుం డెవ్విధంబున సాళ్వాదుల జయించి తన పురంబునకుం జనియె; అదియునుం గాక.


^ *అష్టవిధ వివాహములు*


▪️ *భావము*:- అలా శుకమహర్షి చెప్పగా పరీక్షిత్తు ఇలా అడిగాడు “స్వయంవరాని కొచ్చిన కృష్ణుడు రాక్షస వివాహ పద్దతిలో రుక్మిణిని తన ద్వారకాపట్టణానికి తీసుకుపోయేడని చెప్పావు. కృష్ణుడు ఒంటరిగా సాళ్వుడు మొదలైనవారి నందరిని ఎలా జయించాడు. అంతేకాకుండా. .


▪️ 4 


▪️కల్యాణాత్మకమైన విష్ణుకథ లాకర్ణించుచున్ ముక్త వై

కల్యుం డెవ్వఁడు తృప్తుఁ డౌ; నవి వినంగాఁ గ్రొత్త లౌచుండు సా

కల్యం బేర్పడ భూసురోత్తమ! యెఱుంగం బల్కవే; రుక్మిణీ

కల్యాణంబు వినంగ నాకు మదిలోఁ గౌతూహలం బయ్యెడిన్.


▪️ *భావము*:- శుకమహర్షి! ముక్తి కోరేవాడికి శుభకరమైన విష్ణు కథలు ఎంత విన్నా తృప్తి తీరదు కదా. వాటిని విన్నకొద్దీ తెలుసుకొన్న కొద్దీ నిత్య నూతనంగా ఉంటయి కదా. *రుక్మిణీ కల్యాణం వినాలని కుతూహలంగా ఉంది, వివరంగా చెప్పు*.


▪️ 5 


▪️భూషణములు చెవులకు బుధ

తోషణము లనేక జన్మదురితౌఘ విని

శ్శోషణములు మంగళతర

ఘోషణములు గరుడగమను గుణభాషణముల్."


▪️ *భావము*:- గరుడవాహనుడు విష్ణుమూర్తి కథలు చెవులకు కర్ణాభరణాలు, బుద్ధిమంతులకు సంతోషం కలిగించేవి, జన్మజన్మ పాపాలని పోగొట్టేవి, మిక్కిలి శుభకరమైనవి."


▪️ 6


▪️అని రా జడిగిన శుకుం డిట్లనియె.


▪️ *భావము*:- ఇలా పరీక్షిత్తు అడుగగా, శుకముని ఇలా చెప్పసాగాడు.


▪️ *శ్రీ రుక్మిణీ కల్యాణము : రుక్మిణీ జననంబు*



▪️ 7 


▪️"వినుము; విదర్భదేశమున వీరుఁడు, కుండినభర్త భీష్మకుం

డను నొక దొడ్డరాజు గలఁ; డాతని కేవురు పుత్రు; లగ్రజుం

డనఘుఁడు రుక్మి నాఁ బరఁగు; నందఱకుం గడగొట్టు చెల్లెలై

మనుజవరేణ్య! పుట్టె నొక మానిని రుక్మిణినాఁ బ్రసిద్ధయై.


▪️ *భావము*:- “విను. *విదర్భ దేశపు కుండిన నగర రాజు భీష్మకుడు గొప్పవాడు*. అతనికి ఐదుగురు కొడుకులు { *రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులు*}. పెద్దవాడు రుక్మి. అందిరికన్న చిన్నది రుక్మిణి వారు ఐదుగురికి చెల్లెలై పుట్టింది.


▪️ 8


▪️బాలేందురేఖ దోఁచిన

లాలిత యగు నపరదిక్కులాగున, ధరణీ

పాలుని గేహము మెఱసెను

బాలిక జన్మించి యెదుగ భాసుర మగుచున్.


▪️ *భావము*:- ఈమె పుట్టిననాటి నుండి ఆ రాజగృహం, చంద్ర రేఖ ఉదయించిన పడమటి ఆకాశంలా, ప్రకాశవంతంగా మెరిసిపోతోంది.

{ *ఆమె కుటుంబంలో జన్మించింది అనినను, అందరికి పరమైనది కనుక, ఇతరమైనవి అన్నీ అపరములే కనుక. పరాదేవి అపరమైన అంతటిని ప్రకాశంపజేస్తుంది కనుక అపర దిక్కు ప్రయోగించారా?*}


▪️ 9


▪️మఱియును దినదినప్రవర్ధమాన యై.


▪️ *భావము*:- అలా రుక్మిణి దినదినప్రవర్థమానంగా ఎదుగుతోంది.


▪️ 10 


▪️పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు;

నబలలతోడ వియ్యంబు లందు;

గుజ్జెనఁ గూళులు గొమరొప్ప వండించి;

చెలులకుఁ బెట్టించుఁ జెలువు మెఱసి;

రమణీయ మందిరారామ దేశంబులఁ;

బువ్వుఁ దీగెలకును బ్రోది చేయు;

సదమల మణిమయ సౌధభాగంబుల;

లీలతో భర్మడోలికల నూఁగు;


బాలికలతోడఁ జెలరేగి బంతు లాడు;

శారికా కీర పంక్తికిఁ జదువు సెప్పు;

బర్హి సంఘములకు మురిపములు గఱపు;;

మదమరాళంబులకుఁ జూపు మందగతులు.


▪️ *భావము*:- బొమ్మల పెళ్ళిళ్ళు చక్కగా చేసి చెలికత్తెలతో వియ్యాలందే ఆటలాడుతోంది. గుజ్జెన గూళ్లు వండించి పెడుతోంది. అందమైన తోటల్లో పూతీగెలకి గొప్పులు కడుతోంది. సౌధాలలో బంగారపు టుయ్యాలలు ఊగుతోంది. చెలులతో బంతులాట లాడుతోంది. చిలక పలుకులు, నెమలి మురిపాలు, మదగజాల మందగతులతో అతిశయిస్తోంది


▪️ 11


▪️అంత.


▪️ *భావము*:- అలా రుక్మిణీదేవి దినదినప్రవర్దమాన అయి ఎదుగుతున్నప్పుడు.


▪️ 12


▪️దేవకీసుతు కోర్కి తీఁగలు వీడంగ;

వెలఁదికి మైదీఁగ వీడఁ దొడఁగెఁ;

గమలనాభుని చిత్తకమలంబు వికసింపఁ;

గాంతి నింతికి ముఖకమల మొప్పె;

మధువిరోధికి లోన మదనాగ్ని పొడచూపఁ;

బొలఁతికి జనుదోయి పొడవు జూపె;

శౌరికి ధైర్యంబు సన్నమై డయ్యంగ;

జలజాక్షి మధ్యంబు సన్నమయ్యె;


హరికిఁ బ్రేమబంధ మధికంబుగాఁ, గేశ

బంధ మధిక మగుచు బాలకమరెఁ;

బద్మనయను వలనఁ బ్రమదంబు నిండార

నెలఁత యౌవనంబు నిండి యుండె.


▪️ *భావము*:- కృష్ణుడి కోరికలు విప్పారేలా, రుక్మిణి మేని మెరుపులు విరిసాయి. మనస్సు వికసించేలా, ముఖపద్మం వికసించింది. మదనతాపం కలిగేలా, స్తనసంపద ఉదయించింది. ధైర్యం సన్నగిల్లేలా, నడుం సన్నబడింది. ప్రేమ పెరిగి పొంగేలా, శిరోజాలు చక్కగా వృద్ధిచెందేయి. కృష్ణుడికి సంతోషం కలిగించేలా, రుక్మిణికి నిండు యౌవనం తొణకిస లాడుతోంది.

ప్రజల నాలుకలపై నానుతుండే ఒక వృత్తాంతము చూద్దాము. పోతన గారు ఈ పద్యం వ్రాస్తూ, “బాల కమరె” వరకు వ్రాసారుట. అదే సమయంలో వారి , ఇంట్లో ఆడుకుంటున్న చిన్నపిల్ల, నిప్పులపై పడిందిట. జుట్టు కాలుతుందని అందరూ కంగారు పడుతున్నారట. (కమరె అంటే కాలు అనే అర్థం ఉంది కదా.) ఇంతలో, ఇదేమీ తెలియని పోతనగారు తన సహజధోరణిలో “బద్మనయను వలనఁ బ్రమదంబు నిండార నెలఁత యౌవనంబు నిండి యుండె”. అని పూరించగానే ఏ ఇబ్బంది లేకుండ పిల్ల నిప్పులనుంచి బయటపడిందట.


▪️ 13


▪️ఇట్లు రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రు లను నేవురకుం జెలియలైన రుక్మిణీదేవి దన యెలప్రాయంబున.


▪️ *భావము*:- ఇలా రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులనే ఐదుగురికి ముద్దుల చెల్లెలైన రుక్మిణి నవ యౌవనంలో ప్రవేశించింది.


▪️ 14


▪️తన తండ్రి గేహమునకుం

జనుదెంచుచు నున్న యతిథిజనులవలనఁ గృ

ష్ణుని రూప బల గుణాదులు

విని, "కృష్ణుఁడు దనకుఁ దగిన విభుఁ"డని తలఁచెన్.


▪️ *భావము*:- తన పుట్టింటికి వచ్చే పోయే వాళ్ళ వల్ల కృష్ణుడి అందం, బలం, సుగుణాలు తెలిసి భర్తగా వరించింది.


▪️ 15


▪️ఆ లలన రూపు, బుద్ధియు,

శీలము, లక్షణము, గుణముఁ జింతించి తగన్

"బాలారత్నముఁ దన కి

ల్లాలుగఁ జేకొందు" ననుచు హరియుం దలఁచెన్.


▪️ *భావము*:- ఆ సుందరి అందచందాలు, మంచిబుద్ధి, శీలం, నడవడిక, సుగుణాలు, తెలిసి కృష్ణుడు కూడా రుక్మిణీ కన్యకా రత్నాన్ని పెళ్ళి చేసుకుందా మనుకొన్నాడు.


▪️ 16


▪️అంత.


▪️ *భావము*:- అలా రుక్మిణి యౌవనంలో ప్రవేశిస్తున్న ఆ సమయంలో


▪️ 17 


▪️బంధువు లెల్లఁ "గృష్ణునకు బాలిక నిచ్చెద" మంచు శేముషీ

సింధువులై విచారములు చేయఁగ, వారల నడ్డపెట్టి దు

స్సంధుఁడు రుక్మి కృష్ణునెడఁ జాల విరోధముఁ జేసి "మత్త పు

ష్పంధయవేణి నిత్తు శిశుపాలున" కంచుఁ దలంచె నంధుఁడై.


▪️ *భావము*:- రుక్మిణిని బంధువు లంతా మిక్కిలి సద్భుద్దితో కృష్ణుడి కిద్దాం అనుకుంటున్నారు; *కాని దుష్టులతో స్నేహంపట్టి జ్ఞానహీనుడైన రుక్మి వారిని కాదని, కృష్ణుడి యందు యెంతో విరోధం పెట్టుకొని*, మూర్ఖంగా చేదిదేశపు రాజు శిశుపాలుడికి గండుతుమ్మెదల పిండు వలె నల్లని శిరోజాలు గల సుందరవేణి అయిన తన చెల్లెలు రుక్మిణిని ఇస్తానంటున్నాడు.


(సశేషం )


హరిః ఓమ్.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat