శ్రీశైలంలో చంద్రఘంటా దుర్గా అలంకరణ

P Madhav Kumar


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


చంద్రఘంటా దుర్గా ,  దుర్గాదేవి తొమ్మిది అవతారాల్లో మూడవ అవతారం. భక్తులు ఈ అమ్మవారిని చంద్రఖండ , చండికా , రణచండీ అని కూడా పిలుస్తారు. చంద్రఘంటా అంటే అర్ధచంద్రాకారంతో , గంట కలగి ఉన్నది అని అర్ధం. నవరాత్రులలో పూజించే నవదుర్గల్లో మూడో అవతారమైన చంద్రఘంటా దేవి ధైర్యానికీ , శక్తికీ , తేజస్సుకూ ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఆమె తన తేజస్సుతో పూజించినవారి పాపాలు , ఈతిబాధలు , రోగాలు , మానసిక రుగ్మతలు , భూత భయాలు దూరం చేస్తుంది.


*పురాణ గాథ*


శివుడు , పార్వతి దేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న  తరువాత ఆమె ఎంతో సంతోషిస్తుంది. పార్వతీదేవి తల్లిదండ్రులైన  మేనకా దేవి , హిమవంతులు కూడా పెళ్ళికి అంగీకరిస్తారు. పెళ్ళి రోజున శివుడు దేవతలతోనూ , మునులతోనూ , తన గణాలతోనూ , శ్మశానంలో తనతో ఉండే భూత ,  ప్రేత , పిశాచాలతోనూ తరలి విడిదికి  వస్తాడు. వారందరినీ చూసి పార్వతి తల్లి మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది.  అప్పుడు  అమ్మవారు  చంద్రఘంటాదేవి  రూపంలో శివునకు కనిపించి ,  తమ కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం  మార్చుకోమని ఆయనను కోరుతుంది. అప్పుడు శివుడు రాజకుమారుని  వేషంలో ,  లెక్కలేనన్ని  నగలతో తయారవుతాడు.   అప్పుడు  ఆమె కుటుంబసభ్యులు ,  స్నేహితులు , బంధువులూ భయం  పోయి  శివుణ్ణి  వివాహానికి  ఆహ్వానిస్తారు.  ఆ  తరువాత  శివ , పార్వతులు  వివాహం చేసుకుంటారు.  అలా  ప్రజల  భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి ఇలా చంద్రఘంటా అవతారం ఎత్తింది.


శివ , పార్వతుల కుమార్తె కౌషికిగా దుర్గాదేవి జన్మించింది. శుంభ , నిశుంభులను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థించారు. ఆమె యుద్ధం చేస్తుండగా , ఆమె అందం చూసి రాక్షసులు మోహితులవుతారు. అమెను తన తమ్ముడు నిశుంభునికిచ్చి వివాహం చేయాలని శుంభుడు కోరుకుని ధూమ్రలోచనుణ్ణి కౌషికిని ఎత్తుకురమ్మని పంపిస్తారు. అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రఘంటా దుర్గా అవతారం ధరించి ధూమ్రలోచనుణ్ణి , అతని పరివారాన్ని సంహరిస్తుంది. అలా శుంభ , నిశుంభులతో యుద్ధంలో నవదుర్గా అవతారాల సమయంలో రెండోసారి చంద్రఘంటా దుర్గా అవతారం ఎత్తింది అమ్మవారు.


*రూప వర్ణన*


చంద్రఘంటా దుర్గా దేవి ఎనిమిది చేతులతో ఉంటుంది. ఒక చేతిలో  త్రిశూలం , మరో చేతిలో గద , ఒక చేతిలో ధనుర్భాణాలు , మరో చేతిలో  ఖడ్గం ,  ఇంకో  చేతిలో కమండలం  ఉంటాయి. కుడి హస్తం  మాత్రం అభయముద్రతో ఉంటుంది. చంద్రఘంటా దుర్గాదేవి పులి మీదగానీ , సింహం  మీదగానీ ఉంటుంది . ఈ వాహనాలు ధైర్యానికి , సాహసానికీ ప్రతీకలు.  అమ్మవారి కిరీటంలో అర్ధచంద్రుడు ఉండగా , ఫాలభాగంలో మూడో నేత్రంతో ప్రకాశిస్తుంది ఆ తల్లి. అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసిపోతూంటుంది. శివుడు ఈ అమ్మవారి అందానికి ముగ్ధుడయ్యాడని పురాణోక్తి.


పులి లేదా సంహవాహిని అయిన అమ్మవారు ధైర్య ప్రదాయిని. నిజానికి ఈ రూపం కొంచెం ఉగ్రమయినా , ఆమె ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతోనే ఉంటుంది. ఉగ్రరూపంలో ఉండే ఈ అమ్మవారిని చండి , చాముండాదేవి అని పిలుస్తారు.


ఈ అమ్మవారిని ఉపాసించేవారు మొహంలో దైవ శోభతో ప్రకాశిస్తుంటారని భక్తుల నమ్మికం. వారు అద్భుతమైన తేజస్సుతో ఉంటారట. ఈ అమ్మవారిని పూజించేవారు విజయాన్ని అతిశీఘ్రంగా పొందగలరని భక్తుల విశ్వాశం. దుష్టులను శిక్షించేందుకు ఈ అమ్మవారు ఎప్పుడూ తయారుగా ఉంటుందని పురాణోక్తి. అలాగే తన భక్తులకు ప్రశాంతత , జ్ఞానం , ధైర్యం ప్రసాదిస్తుందట ఈ అమ్మవారు. రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలోని ఘంట భీకరమైన శబ్దం చేసిందట. కొందరు రాక్షసులకు ఆ ఘంటానినాదానికే గుండెలవిసాయని దేవి పురాణం చెబుతోంది. అయితే ఈ ఘంటానినాదం ఆమె భక్తులకు మాత్రం శుభదాయకమనీ , ఎంతో మధురంగా వినపడుతుందని ప్రతీతి. దుష్టులకు అమ్మవారి రూపం ఎంత భయదాయకమో , ఉపాసకులకు మాత్రం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది.


*ధ్యాన శ్లోకం*


*పిండజ ప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ప్రసాదం తనుతే మహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat