Karthika Puranam | కార్తీక పురాణం - 8వ అధ్యాయము |

P Madhav Kumar

 కార్తీక పురాణం - 8వ అధ్యాయము శ్రీ హరినామస్మరణాధన్యోపాయం

వశిష్ఠుడు చెప్పినదంతా విని "మహానుభావా! తమరు చెప్పిన ధర్మములన్ని౦టిని శ్రద్దగా వింటిని. అందు ధర్మము బహు సుక్ష్మమనియు, పుణ్యం సులభ౦గా కలుగుననియూ, అది - నదీస్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి. 
ఇట్టి స్వల్ప ధర్మములచేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసిన గాని పాపములు పోవని మీవంటి మునిశ్రేష్టులే చెప్పుచుందురుగదా! మరి తమరు యిది సూక్ష్మములో మోక్షముగా కనబరచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. 
దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక, వర్ణసంకరులై రౌరవాది నరకహేతువులగు మహాపాపములు చేయువారు యింత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్ధించుచున్నాను
"యని కోరెను.


అంతట వశిష్టుల వారు చిరునవ్వు నవ్వి. "జనక మహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే, నేను వేదవేదాంగములను కూడా పఠ్౦చితిని. వానిలో కూడా సుక్ష్మ మార్గాలున్నవి. అవి యేమనగా సాత్త్విక, రాజస, తామసములు అని ధర్మము మూడు రకములు.

సాత్విక, మనగా దేశకాల పాత్రలు మూడునూ సమకూడిన సమయమును సత్త్వమను గుణము జని౦చి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి, మనోవాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము. అ ధర్మమందు యె౦తయో ఆధిక్యత కలదు. సాత్త్వికధర్మము సమస్త పాపములను నాశన మొనర్చి పవిత్రులను చేసి దేవలోక, భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రవర్ణనది సముద్రమున కలియు తావునందు స్వాతికర్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి ధగధగ మెరిసి, ముత్యమగు విధముగా సాత్త్వికత వహించి, సాత్త్విక ధర్మ మాచరించుచూ గంగ, యమున, గోదావరి, కృష్ణానదుల పుష్కరాలు మొదలుగు పుణ్య కాలముల యందు, దేవాలయముల యందు వేదములు పఠించి, సదాచారుడై, కుటి౦బీకుడైన బ్రాహ్మణునకు యెంత స్వల్పదానము చేసిననూ, లేక ఆ నదీతీరమందున్న దేవాలయంలో జపతపాదు లొనరించినను విశేషఫలమును పొందగలరు.

రాజస ధర్మమమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్తవిధులను విడిచి చేసిన దర్మం. ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్టసుఖాలు కలిగించున దగను.

తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్ధం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలము నీయదు.


దేశకాల పాత్రము సమకూడినపుడు తెలిసిగాని, తెలియకగాని యే స్వల్పధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగునట్లు శ్రీ మన్నారాయణుని నామము, తెలిసి గాని, తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక యితిహాసము కలదు.

ఆజామిళుని కథ
పూర్వ కాలమందు కన్యాకుబ్జమను నగరమున నాల్గువేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణరాశియగు హేమవతియను భార్య కలదు. ఆ దంపతులన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి చాలాకాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించెను. వారాబాలుని అతి గారాబముగా పెంచుచు, అజామిళుడని నామకరణము చేసిరి. 
ఆ బాలుడు దిన దిన ప్రవర్ధమానుడగుచు అతి గారాబము వలన పెద్దలను కూడ నిర్లక్షముగా చూచుచు, దుష్ట సావసములు చేయుచు, విద్య నభ్యసింపక, బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించు చుండెను. ఈ విధముగా కొంత కాలమునకు యవ్వనము రాగా కామంధుడై, మంచి చెడ్డలు మరిచి, యజ్ఞోపవితము త్రెంచి, మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి, నిరంతరము నామెతోనే కామక్రీడలలో తేలియాడుచూ, యింటికి రాకుండా, తల్లిదండ్రులను మరిచి, ఆమె యి౦టనే భుజించుచుండెను. 
అతి గారాబము యెట్లు పరిణమించినదో వింటివా రాజా! తమ బిడ్డలపై యెంత అనురాగామున్ననూ పైకి తెలియపర్చక చిన్ననాటి నుంచీ అదుపు ఆజ్ఞలతో నుంచకపోయిన యెడల యీ విధంగానే జరుగును. కావున ఆజామిళుడు కులభ్రష్టుడు కాగా, వాని బంధువులతనిని విడిచి పెట్టిరి. అందుకు ఆజామిళుడు రెచ్చిపోయి వేటవలన పక్షులను, జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను. ఒక రోజున ఆ యిద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను. ఆజామిళుడు ఆ స్త్రీ పైబడి కొంత సేపు యేడ్చి, తరువాత ఆ అడవి యందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను.
ఆ యెరుకుల దానికి అంతకు ముందే ఒక కుమార్తె వుండెను. కొంత కాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారాముచే కన్ను మిన్ను గానక ఆజమిళుడు ఆ బాలికను కూడ చేపట్టి ఆమెతో కూడ కామక్రీడలలో తేలియాడుచుండెను. వారికి యిద్దరు కొడుకులు కూడా కలిగిరి. ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి. మరుల ఆమె గర్భము దరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి 'నారాయణ' అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైననూ ఆ బాలుని విడువక, యెక్కడకు వెళ్ళినా వెంట బెట్టుకుని వెళ్ళుచూ, 'నారాయణా-నారాయణా' అని ప్రేమతో సాకుచుండిరి. కాని 'నారాయణ'యని స్మరించిన యెడల తన పాపములు నశించి, మోక్షము పొందవచ్చుననిమాత్ర మతనికి తెలియకుండెను. ఇట్లు కొంత కాలము జరిగిన తర్వాత అజమిళునకు శరీర పటుత్వము తగ్గి రోగ గ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ద పడి యుండెను. 

ఒకనాడు భయంకరాకారములతో, పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజమిళునకు భయము చెంది కుమారుని పైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక 'నారాయణా నారాయణా' యనుచునే ప్రాణములు విడిచెను. అజమిళుని నోట నారాయణా' యను శబ్దము వినబడగానే యమ భటులు గడ గడ వణకసాగిరి. అదే వేళకు దివ్యమంగళాకారులు శంఖ చక్ర గదాధారులూ యగు శ్రీ మన్నారాయణుని దూతలు విమానములో నచ్చటికి వచ్చి 

"ఓ యమ భటులారా! వీడు మావాడు మేము వీనిని వైకు౦టమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి"యని చెప్పి, అజమిళుని విమాన మెక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు "అయ్యా! మీరెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచటికి వచ్చితిమి గాన, వానిని మాకు వదలుడని కొరగా విష్ణుదూతలు యిట్లు చెప్పదొడ౦గిరి.

ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తిక మహాత్మ్యమందలి ఎనిమిదో అధ్యాయము - ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat